TS Exams 2022: విన్నవించినా వినలేదు.. ఉద్యమం తప్పలేదు!

తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలను, రక్షణలను నాటి పాలకులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. నిబంధనలను నీరుగార్చారు. స్థానికుల భయాందోళనలను నిజం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసిన వందల విన్నపాలు బుట్టదాఖలయ్యాయి. అడుగడుగునా అవమానాలే మిగిలాయి.

Updated : 26 May 2022 06:44 IST

తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం

తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలను, రక్షణలను నాటి పాలకులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. నిబంధనలను నీరుగార్చారు. స్థానికుల భయాందోళనలను నిజం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసిన వందల విన్నపాలు బుట్టదాఖలయ్యాయి. అడుగడుగునా అవమానాలే మిగిలాయి. తెలంగాణ వాసులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని ఆనాటి పాలకులూ అంగీకరించారు. అయినా సరిదిద్దేందుకు సరైన చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితులు మహా ఉద్యమానికి దారితీశాయి. 

జై తెలంగాణ ఉద్యమ నేపథ్యం (1969)

తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులే 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రధాన కారకులు. ఆ తర్వాత విద్యార్థులు, యువతతో పాటు యావత్‌ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ భాగస్వాములవడంతో అదొక మహా ప్రజా ఉద్యమంగా మారింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో తెలంగాణ ప్రాంతమంతటా చెలరేగిన ఆందోళనలు, జరిగిన సంఘటనలు మొత్తం భారతదేశాన్ని ఆకర్షించాయి. విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడంతో పరిపాలనా యంత్రాంగం స్తంభించిపోయింది. పరిస్థితులు జాతీయ స్వాతంత్య్ర పోరాటాన్ని తలపించాయి. నిత్యకృత్యమైన పోలీసుల లాఠీఛార్జ్‌లు, కాల్పులు, అమాయక ప్రజల ప్రాణ త్యాగాలు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ నగరాన్ని అతలాకుతలం చేశాయి. 

ఉద్యమ కారణాలు  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదికైన పెద్దమనుషుల ఒప్పందం, దానిలోని రక్షణలు, హామీలను నాటి  పాలకులు ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించడమే ఈ ఉద్యమానికి ప్రధాన కారణం. నాటి తెలంగాణ ప్రాంత కమ్యూనిస్టు పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ రాజబహదూర్‌ గౌర్‌ రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అప్పటివరకు అంటే రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నర కాలం వరకు తాము హామీ ఇచ్చిన రక్షణలకు చట్టబద్ధత కల్పించాలనే సంగతి అప్పటి పాలకులు మరిచిపోయారు. రాష్ట్రం ఏర్పడే ముందు తెలంగాణ ప్రాంత ప్రజలు వెలిబుచ్చిన అనేక భయాందోళనలు క్రమంగా నిజమవడంతో గత్యంతరంలేక వారు ప్రత్యేక ఉద్యమం బాట పట్టారు.  

1968 - 69 మహోద్యమానికి ముందే తెలంగాణ ప్రజలు తమకు జరిగిన అన్యాయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేకసార్లు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని విస్మరించింది. రాష్ట్రం ఏర్పడిన 17 నెలల తర్వాత అంటే 1958 మార్చిలో వరకాంతం గోపాలరెడ్డి నేతృత్వంలో తెలంగాణ మహాసభ నాటి కేంద్ర హోంమంత్రి జి.బి.పంత్‌కు ఉల్లంఘనల గురించి వినతి పత్రాన్ని సమర్పించింది. ఆ పత్రంలో ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య సమైక్యత, సమగ్రత, సహజీవనాన్ని పెంపొందించడంలో రాష్ట్ర పాలకులు విఫలమయ్యారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ఇరు ప్రాంతాల మధ్య ప్రాంతీయతత్వాన్ని సృష్టించి ప్రజల మధ్య అగాథాన్ని సృష్టిస్తోందని తెలిపారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న ఆంధ్రా వారు నోటి దురుసుతో వ్యవహరించి తెలంగాణ ప్రాంత ప్రజలను అవమానపరచడాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని కేంద్ర ప్రభుత్వానికి మరొక ఫిర్యాదు చేశారు. నాటి తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయకోవిదుడు గులాం పంజాతన్‌ 1959, డిసెంబరు 12న ‘పరిస్థితి చేజారక మునుపు మేల్కొనండి’ అనే శీర్షికలో ప్రజలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బహిరంగ హెచ్చరిక చేశారు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులకు జరుగుతున్న అనేక అన్యాయాలు, అక్రమాలపై ఆయన విజ్ఞాపన పత్రంలో ఒక పెద్ద చిట్టా ప్రకటించారు. 

తెలంగాణ మహాసభ నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు ఒక వినతి పత్రాన్ని పంపుతూ తెలంగాణ ప్రజలకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాలను వివరించి వాటిని అరికట్టడానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమించాలని మనవి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఫిర్యాదుల్లోని వాస్తవాలను గ్రహించి భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులకు ఆస్కారం ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినప్పటికీ నాటి ఆంధ్రా పాలకులు బేఖాతరు చేశారు. 

రాజ్యసభ సభ్యుడైన వి.కె.ధగే 1960లో రాజ్యసభలో మాట్లాడుతూ ఈ అన్యాయాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే అన్ని విషయాలను సర్దుబాటు చేయకపోతే భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతీయ సంఘం మొదటి అధ్యక్షుడు కె.అచ్యుత్‌ రెడ్డి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు జరిగిన అన్యాయాలను పత్రికా గోష్ఠిలో ప్రకటించారు. ఇందులో తెలంగాణకు ప్రభుత్వం చేసిన అన్యాయాలను బయటపెట్టారు. ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య తెలంగాణకు జరిగిన ఆ అన్యాయాలు, వాటిపై చేసిన ఫిర్యాదులను అర్థం చేసుకొని సరిదిద్దాలని 1961లో ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించారు. ఇది నాటి తెలంగాణ వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుంది.

1968-69లో తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు చొక్కారావు పదవిలోకి వచ్చిన నాటి నుంచి అన్యాయాలను నివారించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు. నాటి తెలంగాణ ఎన్‌జీవోల సంఘం నాయకుడు కె.ఆర్‌.ఆమోస్‌ ఉద్యోగుల ఇబ్బందులు, వాటిలోని మెలికలు, చిక్కులను ఎప్పటికప్పుడు ప్రాంతీయ సంఘం అధ్యక్షుడికి వివరిస్తూ వాటి పరిష్కారానికి ప్రయత్నించారు. మిగులు నిధుల దోపిడీకి సంబంధించి చర్చించడానికి 1968లో నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి దగ్గరకు వెళ్లినప్పుడల్లా తనను ఒక గుమాస్తాగా చూశారని, వెనుకబడిన తెలంగాణ ప్రాంతాన్ని అత్యవసర ప్రాతిపదికపై అభివృద్ధి చేయాల్సి ఉండగా ఇక్కడి ఆదాయాన్ని ఇక్కడే ఖర్చు చేయకుండా ఆంధ్రా ప్రాంతంలో ఖర్చు చేశారని చొక్కారావు విమర్శించారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని మొదట అంగీకరించినవారు రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. ఆయన నిజాయతీగా ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రయత్నించి పదవినే కోల్పోయారు.  

1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం పార్లమెంటు తెలంగాణలో ఉద్యోగాలకు నివాస యోగ్యతను విధించే చట్టాన్ని ఆమోదించింది. అదే ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ రిక్వైర్‌మెంట్‌ (యాజ్‌ టు రెసిడెన్స్‌) యాక్ట్‌ - 1957. తర్వాత రెండేళ్లకు ఈ చట్టం కింద నియమావళిని రూపొందించారు. దీని ప్రకారం 1959, మార్చి 21 నుంచి ముల్కీలకే ఇక్కడి ఖాళీల్లోని కింది స్థాయి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆచరణలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. ముల్కీ రూల్స్‌ వర్తించకుండా తెలంగాణ వారికి ఉద్యోగావకాశాలు లేకుండా చేయడం కోసం నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం అనేక ప్రభుత్వ శాఖలను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మార్చింది. రోడ్డు రవాణా శాఖను రోడ్డు రవాణా సంస్థగా (కార్పొరేషన్‌), విద్యుచ్ఛక్తి శాఖను విద్యుచ్ఛక్తి బోర్డుగా మార్చింది. ఇదేవిధంగా మరికొన్ని ప్రభుత్వ శాఖలను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మార్చింది. 

ఉదా: హౌసింగ్‌ బోర్డు, ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌.  

ఈ విధంగా ప్రభుత్వ వివక్ష ధోరణి, నిర్లక్ష్య వైఖరిని నాటి తెలంగాణ నాయకులు కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా విమర్శించి, హెచ్చరించారు. 

1968, జులై 10న ‘తెలంగాణ హక్కుల పరిరక్షణ దినం’ సందర్భంగా ఒక సభ నిర్వహించారు. ఈ సభలో హైదరాబాదు స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ కార్మిక నాయకుడు మహదేవ్‌ సింగ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష ధోరణిని నిరసించారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగని పక్షంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభించి తీరతామని హెచ్చరించారు. 


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రిపరేషన్‌ కోసం ఇస్రో, డీఆర్‌డీఓ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖల వెబ్‌సైట్‌లలోని న్యూస్‌ను చదువుతూ ఉండాలి. దేశ, విదేశాల్లో జరిగే పరిణామాలను నోట్‌ చేసుకొని అధ్యయనం చేయాలి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని