UPSC CSE 2022 Result: సివిల్‌ సర్వీసెస్‌ తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. టాపర్లు వీళ్లే..

UPSC Civils Final result: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ - 2022 తుది ఫలితాలు వెల్లడయ్యాయి. తొలి నాలుగు ర్యాంకుల్లో అమ్మాయిలే సత్తాచాటారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మెరుగైన ర్యాంకులు సాధించారు.

Updated : 23 May 2023 19:19 IST

దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ (Civils) - 2022 తుది ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి మూడో ర్యాంకుతో మెరిశారు. 2022 ఏడాదికి గాను మొత్తం 933 మందిని యూపీఎస్సీ(UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ - ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌ బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. (UPSC Civils Final result). 

తొలి నాలుగు ర్యాంకులూ అమ్మాయిలవే..

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా టాప్‌ ర్యాంకర్లుగా అమ్మాయిలే సత్తా చాటారు. 2022 సివిల్స్‌ ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకులనూ అమ్మాయిలే సాధించారు. యూపీకి చెందిన ఇషితా కిశోర్‌ (Ishita kishore) ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకుతో అదరగొట్టగా.. గరిమ లోహియా (బిహార్‌), ఉమా హారతి నూకల( తెలంగాణ); స్మృతి మిశ్రా (యూపీ) వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో మెరిశారు. సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు తేజం ఉమా హారతి మెరిశారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఎస్పీ కుమార్తె నూకల ఉమా హారతి మూడో ర్యాంకు సాధించడం విశేషం.

(సివిల్స్‌లో తొలి నాలుగు ర్యాంకుల్లో మెరిసింది వీరే..)

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీళ్లే.. 

ఈసారి సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు మెరుగైన ర్యాంకులు సాధించి సత్తా చాటారు. నూకల ఉమా హారతి మూడో ర్యాంకు సాధించగా.. తిరుపతికి చెందిన జీవీఎస్‌ పవన్‌ దత్తాకు 22వ ర్యాంకు వచ్చింది.  అజ్మిరా సంకేత్‌ కుమార్‌ 35వ ర్యాంకు, శాఖమూరి శ్రీసాయి ఆశ్రిత్‌కు 40వ ర్యాంకు దక్కగా..  సాయిప్రణవ్‌ 60, ఆవుల సాయికృష్ణ 94, నిధి పాయ్‌ 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంతకుమార్‌ 157, కమతం మహేశ్‌ కుమార్‌ 200, రావుల జయసింహారెడ్డి 217, విశాఖ వాసి సాహిత్య 243, అంకుర్‌ కుమార్‌ 257, బి. ఉమామహేశ్వర్‌ రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పి.విష్ణువర్దన్‌ రెడ్డి 292, సాయికృష్ణ 293, లక్ష్మీ సుజిత 311, ఎన్‌.చేతనారెడ్డి 346, యారగట్టి శ్రుతి 362, సోనియా కటారియా 376, షాద్‌నగర్‌కు చెందిన యప్పలపల్లి  సుష్మిత 384, రేవయ్య 410, సీహెచ్‌. శ్రావణ్‌కుమార్‌ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462, దామెర హిమ వంశీ 548, రేపూడి నవీన్‌ చక్రవర్తి 550, కొట్టె రుత్విక్‌ సాయి 558, తమ్మదడ్డి పద్మన్న 566, ఎర్రంశెట్టి రమణి 583, భవిరి సంతోష్‌ కుమార్‌ 607, తుమ్మల సాయికృష్ణారెడ్డి 640, పసులూరి రవికిరణ్‌ 694, రెడ్డి భార్గవ్‌ 772, నాగుల కృపాకర్‌ 866 ర్యాంకులు సాధించి ఈ ఏడాది సివిల్స్‌లో మెరిశారు.  

మెరిట్‌ జాబితా కోసం క్లిక్‌ చేయండి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని