శిశు సంరక్షణ పదిలంగా..

తొమ్మిది నెలల పాటు అమ్మ కడుపులో పెరిగిన శిశువు బయటకు రావటంతోనే ఇంటిల్లిపాదీ మనసు సంతోషంతో ఉరకలేస్తుంది.

Updated : 31 Jan 2023 02:57 IST

తొమ్మిది నెలల పాటు అమ్మ కడుపులో పెరిగిన శిశువు బయటకు రావటంతోనే ఇంటిల్లిపాదీ మనసు సంతోషంతో ఉరకలేస్తుంది. ముట్టుకుంటే కందిపోయే లేత చిన్నారి సంరక్షణ కోసం వెంపర్లాడుతుంది. ఎలాంటి ఆపదా రాకుండా కాపాడుకోవాలని అనుక్షణం తాపత్రయ పడుతుంది. అందుకేనేమో మాతా శిశు సంరక్షణలో అనాదిగా ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు స్థిరపడిపోయాయి. ఇంటి కాన్పులు తగ్గిపోయి, ఆసుపత్రి ప్రసవాలు పెరిగిన నేటి రోజుల్లోనూ కొందరు వీటిని పాటించటం చూస్తూనే ఉన్నాం. ఇవి ఆయా ప్రాంతాలు, నమ్మకాలను బట్టీ మారిపోతుంటాయి. ఆచారాలు, సంప్రదాయాల్లో పేద ధనిక తారతమ్యాలనూ గమనిస్తుంటాం. అయితే తరతరాలుగా వస్తున్నవైనా అన్ని ఆచారాలూ అనుసరణీయం కాకపోవచ్చు. పాతవైనంత మాత్రాన అన్ని సంప్రదాయాలను కొట్టిపారేయటానికీ లేదు. కొన్ని కేవలం నమ్మకాలతోనే ముడిపడితే.. కొన్నింటికి బలమైన శాస్త్రీయ ఆధారాలూ ఉండటం గమనార్హం. కాబట్టి వీటిలోని మంచి చెడ్డలను గుర్తించాలి. వేటిని ఆచరించాలో, వేటిని వదులుకోవాలో తెలుసుకొని మసలుకోవటం ఎంతైనా అవసరం.

పసి గుడ్డు కుసుమ కోమలం. అప్పటివరకూ ఎలాంటి చీకూ చింతా లేకుండా తల్లి కడుపులో పెరిగిన బిడ్డ కాన్పయిన మరుక్షణం నుంచే బయటి ప్రపంచానికి అలవడే ప్రయత్నం మొదలెడుతుంది. ఏడుపు తప్ప మరేదీ తెలియని శిశు భాషను అర్థం చేసుకోవటం, అవసరమైన రక్షణ కల్పించటం మన బాధ్యతే. ముఖ్యంగా తొలి 28 రోజులు (నియోనేటల్‌) అతి కీలకం. ఆరు నెలలు నిండేవరకూ కంటికి రెప్పలా చూసుకోవాలి. అనంతరం ఐదేళ్లు పూర్తయ్యేవరకూ ఆలానా పాలనలో ఆద మరవొద్దు. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగినా జీవితాంతం దాని పర్యవసానాలు వెంటాడతాయి. వైద్య సదుపాయాల విషయంలో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మనదేశంలో ఐదేళ్ల లోపు మరణిస్తున్న పిల్లల సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉంటోంది. వీరిలో చాలామంది పుట్టిన నెలలోపే.. అదీ పుట్టిన ఒకట్రెండు రోజుల్లోనే కన్ను మూస్తుండటం విచారకరం. శిశు సంరక్షణలో పుట్టిన తొలినాళ్లలో అత్యంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఇది నొక్కి చెబుతోంది. అందువల్ల తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాల విషయంలో ఆచితూచి వ్యవహరించటం మంచిది.


మేలు చేసేవి

* తల్లీ బిడ్డను ప్రత్యేక గదిలో ఉంచటం: పసిబిడ్డ సంరక్షణకు ఇది చాలా కీలకం. మన చుట్టూ కనిపించని సూక్ష్మక్రిములు ఎన్నో ఉంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డకు రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల బిడ్డను వీటి బారినపడకుండా చూసుకోవటం మంచిది. అందుకే ఒకప్పుడు పురుడు అయ్యేంతవరకు తల్లీబిడ్డను ప్రత్యేక గదిలోనే ఉంచేవారు. దానిలోకి ఇతరులను రానిచ్చేవారు కాదు. ఒకరో ఇద్దరో తల్లీబిడ్డల అవసరాలను చూసుకునేవారు. ఇది ఇన్‌ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడేది. దీన్ని ఇప్పుడు పాటించటమూ మంచిదే. అయితే ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగిపోతున్న తరుణంలో ఇది మరుగున పడిపోయింది. కాన్పయిన మరుక్షణం నుంచే బంధువులంతా ఆసుపత్రికి వస్తుంటారు. చేతులు, కాళ్లు కడుకోకుండానే బిడ్డను ఎత్తుకోవటం, ముద్దులు పెట్టటం చేస్తుంటారు. దీంతో బిడ్డకు ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. తల్లికీ ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. అందువల్ల తల్లీబిడ్డలను కనిపెట్టుకునేవారు తప్ప మిగతావాళ్లంతా దూరంగా ఉండటం మంచిదని గుర్తించాలి. ముఖ్యంగా తొలి 15 రోజుల్లో బాలింతను, బిడ్డను బయటివారు తాకకుండా చూసుకోవటం ఎంతైనా మంచిది. 

* నూనె మర్దన: నూనెతో మర్దన చేయటం శిశువుకే కాదు, తల్లికీ మేలు చేస్తుంది. ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది. నూనెతో మర్దన చేస్తే పిల్లలు బాగా నిద్ర పోతున్నట్టు, బరువూ పెరుగు తున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మరీ గట్టిగా, బలంగా రుద్దొద్దు. కళ్లు, కనుబొమలు, ముక్కు, బుగ్గలు, బొడ్డు, వెన్నెముక, కాళ్లు చేతులను క్రమబద్ధంగా నెమ్మదిగా, మృదువుగా రుద్దుతూ మర్దన చేయాలి. ఇది బిడ్డకు మంచి విశ్రాంతిని కలిగిస్తుంది. శిశువు శరీరానికి రక్త ప్రసరణ పుంజుకునేలా చేస్తుంది. 

* చనుబాలు పట్టటం: ఒకప్పుడు తల్లికి పాలు పడకపోతే ఇరుగుపొరుగువారిలోనో, బంధువుల్లోనో చనుబాలు పట్టేవారిని తీసుకొచ్చి బిడ్డకు ఇప్పించేవారు. ఇది మంచి పద్ధతి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవచ్చు గానీ వీలైనంత త్వరగా.. అరగంటలోపే తల్లిపాలు పట్టటం ఆరంభించటం మంచిది. చనుబాలలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. మొదటి మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలు (కొలెస్ట్రమ్‌) చాలా చాలా ముఖ్యం. ఇందులో కొవ్వు పదార్థాలు, రోగనిరోధక కణాలు దండిగా ఉంటాయి. దీనిలోని ఇమ్యునోగ్లోబులిన్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కొందరు ముర్రుపాలు జీర్ణం కావని, బిడ్డకు జబ్బు చేస్తుందని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. ఒకట్రెండు చుక్కలే వస్తున్నాయని, అవి సరిపోవటం లేదని వెంటనే పోతపాలు మొదలెట్టటమూ సరికాదు. పడుతుంటూనే పాలు వస్తుంటాయి. చనుబాలు ఇవ్వటం సులువు. ఇవి పరిశుభ్రంగానూ ఉంటాయి. సూక్ష్మక్రిములకు తావులేదు. అదే పోతపాలతో పిల్లలకు మలబద్ధకం రావొచ్చు. సీసా శుభ్రంగా కడగకపోతే విరేచనాలు, వాంతులు పట్టుకోవచ్చు. ఒకవేళ తల్లిపాలను పిండి పట్టాల్సి వస్తే గోకర్ణ/పాలాదలో పట్టి తాగించాలి. ప్రతి రెండు గంటలకోసారి పాలు పట్టాలి. బిడ్డ బాగా ఏడ్చేంతవరకు ఆగకూడదు. పుట్టిన తొలి రోజుల్లో ఒంట్లోంచి నీరు పోవటం వల్ల బిడ్డ బరువు తగ్గిపోవటం సహజమే. అలాగని మరీ ఎక్కువగా తగ్గకూడదని గుర్తించాలి. బరువు మరీ తగ్గితే పాలు సరిగా పట్టటం లేదని, బిడ్డకు తగినన్ని కేలరీలు లభించటం లేదనే అర్థం. శిశువులు 10% కన్నా ఎక్కువ బరువు తగ్గితే డాక్టర్‌ను సంప్రదించాలి. వీరిలో రక్తంలో గ్లూకోజు తగ్గిపోవచ్చు. సోడియం మోతాదులు బాగా పెరిగిపోవచ్చు. ఇది మున్ముందు పిల్లలకు ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. అందువల్ల బరువు తగ్గటానికి గల కారణాన్ని గుర్తించి, సరిచేస్తే వీటిని ముందుగానే నివారించుకోవచ్చు. 

* బిడ్డకు తొలి 6 నెలల వరకు చనుబాలు తప్ప మరేదీ ఇవ్వద్దు. ఆరు నెలల తర్వాత ఘనాహారం ఆరంభించాలి. ఘనాహారం ఇస్తున్నా కూడా రెండేళ్లు నిండేవరకూ తల్లిపాలు పట్టాలి. ఇది బిడ్డకు, తల్లికి ఇద్దరికీ మేలు చేస్తుంది. 

* ఎండ చూపించటం: ఇది శిశు కామెర్లు తగ్గటానికి తోడ్పడుతుంది. ఈ విషయం శాస్త్రీయంగానూ రుజువైంది. అయితే ఎండలోని అతి నీలలోహిత, పరారుణ కిరణాలు కొన్నిసార్లు హాని చేయొచ్చు. అందువల్ల అతి నీలలోహిత కాంతి తక్కువగా ఉండే ఉదయం వేళల్లోనే బిడ్డకు ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగని ఇదేమీ కామెర్లకు ఇచ్చే ఫొటోథెరపీకి ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. కళ్లు, చర్మం మరీ పసుపు పచ్చగా ఉంటున్నా.. బిడ్డ చిరాకు పడుతున్నా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఎండకు పెడుతున్నాం కదా, అదే తగ్గిపోతుందని అనుకోరాదు.


హాని చేసేవి

* తేనే నాకించటం: మాటలు త్వరగా వస్తాయని కొన్ని సమాజాల్లో బిడ్డ పుట్టగానే తేనె నాకిస్తుంటారు. ఇది నిజం కాదు. కొన్నిచోట్ల చక్కెర, నీరు, తీర్థ ప్రసాదం వంటివీ నోట్లో పోస్తుంటారు. ఇవి ఇన్‌ఫెక్షన్లకు దారితీయొచ్చు. ముఖ్యంగా తేనెతో బోటులినిజమ్‌ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు. కొన్నిచోట్ల బిడ్డకు ఆముదం పట్టించటం చూస్తుంటాం. ఆముదంలో రిఫార్సినాల్‌ అనే విషతుల్య పదార్థముంటుంది. ఇది బిడ్డకు హాని చేస్తుంది. ఇలాంటి పద్ధతులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

* పాత బట్టల్లో బిడ్డను చుట్టటం: ఆసుపత్రుల్లో కాన్పులు అవుతుండటం వల్ల ఇది చాలావరకు తగ్గింది. కానీ ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో సంప్రదాయ నమ్మకం పేరుతో శిశువులను పుట్టిన వెంటనే పాత బట్టల్లో చుట్టబెడుతుంటారు. ఇది మంచిది కాదు. బట్టలను సరిగా ఉతక్కపోతే బిడ్డకు ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. కాబట్టి పూర్తిగా శుభ్రంగా ఉతికిన బట్టల్లోనే శిశువులను పడుకోబెట్టాలి. 

కళ్లకు కాటుక పెట్టటం: శిశువుల మీద చెడు దృష్టి పడకూడదని చాలా కుటుంబాల్లో భావిస్తుంటారు. చేతికి, కాళ్లకు నల్లదారం కడుతుంటారు. నల్ల గాజులు, పూసల దండలు వేస్తుంటారు. నుదుటి మీద నల్లబొట్టు పెడుతుంటారు. బుగ్గలకు దిష్టి చుక్క పెడతారు. ఇవి చాలావన్నట్టు కళ్లకు కాటుక కూడా రాస్తుంటారు. అరికాళ్లు, అరచేతుల్లో కాటుకను రాస్తే పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లకు మాత్రం రాయొద్దు. కాటుకలోని రసాయనాలు కళ్లకు హాని చేయొచ్చు. కళ్ల కలక రావొచ్చు. 

* బొడ్డుకు పొడులు రాయటం: కొన్నిచోట్ల సంప్రదాయ బద్ధంగా తయారుచేసిన పొడి, కొబ్బరినూనె, బూడిద, ఆవు పిడకల పొడి వంటివి శిశువు బొడ్డుకు రాస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. బొడ్డు పూర్తిగా ఎండిపోయి, ఊడేంతవరకు శుభ్రంగా ఉండాలి. లేకపోతే ఇన్‌ఫెక్షన్‌ తలెత్తి, అది రక్తంలోకి వ్యాపించొచ్చు (సెప్సిస్‌). అందువల్ల బొడ్డు మీద పొడులు, నూనె వంటివేవీ రాయొద్దు. ఎల్లప్పుడూ బొడ్డు పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ బొడ్డులోంచి రసిలాంటిది వస్తున్నట్టయితే యాంటీసెప్టిక్‌ పూత మందు రాయాలి. చెవుల్లో వేడి చేసిన నూనె పోయటం, ముక్కులోకి ఊదటం, శరీరం మీద పిండిని రుద్దుటం వంటి పనులూ చేయొద్దు. వేడి నూనె చెవిలో పోస్తే ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. పిండితో అలర్జీ తలెత్తొచ్చు. దీంతో సున్నితమైన చర్మం దెబ్బతినొచ్చు. 

పుట్టిన వెంటనే స్నానం చేయించటం: తల్లి కడుపులోంచి బయటపడ్డ బిడ్డను వెచ్చగా ఉంచటం చాలా ముఖ్యం. అందువల్ల వెంటనే స్నానం చేయొంచొద్దు. ఆసుపత్రుల్లో పిల్లలు పుట్టగానే పూర్తిగా శుభ్రం చేసేస్తారు. అందువల్ల ప్రత్యేకించి స్నానం అవసరం లేదు. బిడ్డను వెచ్చగా, తల్లి పక్కన పడుకోబెడితే చాలు. బిడ్డకు స్నానం చేయించటానికి కనీసం 48 గంటలైనా ఆగాలి. ఆ తర్వాత కూడా అదేపనిగా రుద్ది.. ఎక్కువసేపు స్నానం చేయించటమూ మంచిది కాదు. దీంతో బిడ్డ ఒంట్లో ఉష్ణోగ్రత తగ్గిపోవచ్చు. ఇది చాలా సమస్యలకు దారితీయొచ్చు. ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పెరుగుతుంది. 

* రొమ్ములు బలంగా నొక్కటం: కొన్నిచోట్ల మగ శిశువుల రొమ్ములు బలంగా నొక్కి పాలు బయటకు తీస్తుంటారు. లేకపోతే పెద్దయ్యాక రొమ్ములు పెద్దగా అవుతాయని నమ్ముతుంటారు. ఇందులో నిజం లేదు. రొమ్ములను నొక్కి, పాలు పిండితే ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు. రొమ్ములు పెద్దగా అవ్వచ్చు. మగ శిశువుల్లో కొందరికి అంగం కింద చీము ఉండొచ్చు. అలాగని బలవంతంగా చర్మాన్ని వెనక్కి లాగి, శుభ్రం చేయొద్దు. 

* నీళ్లు తాగించటం: కొందరు బిడ్డకు నీళ్లు తాగిస్తుంటారు. ముఖ్యంగా ఎండకాలంలో పిల్లలకు దాహం వేస్తుందని, నీళ్లు తాగించకపోతే ప్రమాదమని భావిస్తుంటారు. నిజానికి చనుబాలతోనే బిడ్డకు తగినంత నీరు లభిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా నీళ్లు తాగించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే పట్టాలి. నీరు తాగిస్తే ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ప్రమాదముంది. అయితే బాలింతలకు మాత్రం తగినంత నీరు అవసరం. గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో చేరిన నీరంతా కాన్పయ్యాక బయటకు వెళ్లిపోతుంది. బిడ్డకు పాలిస్తున్నప్పుడు పాలతోనూ ఒంట్లోంచి నీరు బయటకు పోతుంది. దీంతో దాహం ఎక్కువవుతుంది. కాబట్టి ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది. లేకపోతే ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి పాలు సరిగా రాకపోవచ్చు. మూత్రం ఉత్పత్తీ తగ్గిపోవచ్చు. ఇది మూత్ర ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి బాలింతకు నీళ్లు ఇవ్వకపోవటం మంచిది కాదని తెలుసుకోవాలి. 

* బాలింతకు పథ్యం పాటించటం: కొందరు పథ్యం పేరుతో తల్లి కడుపు మాడుస్తుంటారు. ఇది పెద్ద పొరపాటు. బాలింతకు ఎలాంటి పథ్యాలూ పెట్టొద్దు. బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లికి మరింత ఎక్కువ ఆహారం అవసరం కూడా. సమతులాహారం తింటేనే పాలు బాగా వస్తాయి. చనుబాలు తగ్గితే బిడ్డ పోషణా దెబ్బతింటుంది. పప్పులు, కూరగాయలు, కొన్నిరకాల పండ్లు వంటివి తినకపోతే తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యమూ క్షీణిస్తుంది. తగినంత ఆహారం తినకపోతే తల్లికి కడుపు ఉబ్బరం తలెత్తొచ్చు. జీర్ణాశయంలో ఆమ్లం ఉత్పత్తి పెరిగి ఛాతీలో మంట, పులితేన్పులకు దారితీయొచ్చు. ఒకవేళ బిడ్డకు కడుపునొప్పి వస్తుంటే, బిడ్డకు పాలు సరిపడక పోతుంటే డాక్టర్లు తగు సూచనలు ఇస్తారు. 

* తల్లికి ఆవరి స్నానం చేయించటం: కాన్పు తర్వాత తొలి నెలలో కొన్ని గ్రామాల్లో, తెగల్లో తల్లికి ఆవిరి స్నానం చేయిస్తుంటారు. ఇది హాని చేయకపోవచ్చు గానీ అతి వేడితో చర్మం కాలిపోకుండా చూసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని