కరోనా తగ్గినా..

కొత్త కరోనా జబ్బు జిత్తులమారిలా వ్యవహరిస్తోంది. రోజుకో కొత్త వేషం ధరిస్తోంది. అవటానికిది వైరల్‌ ఇన్‌ఫెక్షనే అయినా జీవక్రియ రుగ్మతనూ (మెటబాటిక్‌ డిసీజ్‌) తలపింపజేస్తోంది. రోగనిరోధక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ (ఇమ్యునోజెనిక్‌), రక్తాన్ని చిక్కబరుస్తూ (థ్రాంబోజెనిక్‌), వాపు ప్రక్రియను ప్రేరేపిస్తూ (ఇన్‌ఫ్లమేటరీ) పలు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఉద్ధృత దశలో ఇబ్బంది పెట్టటమే కాదు.. పూర్తిగా నయమైన తర్వాతా సుదీర్ఘంగా వెంటాడుతోంది (లాంగ్‌ కొవిడ్‌).

Updated : 19 Oct 2022 15:51 IST

తుపాన్‌ తగ్గిపోతేనేం? నష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. కరోనా బాధితుల్లో కొందరి పరిస్థితి ఇలాగే ఉంటోంది. కొవిడ్‌-19 నుంచి కోలుకున్నా కొందరినిది సుదీర్ఘంగా బాధలు పెడుతూనే వస్తోంది. ఎందుకిలా?

కొత్త కరోనా జబ్బు జిత్తులమారిలా వ్యవహరిస్తోంది. రోజుకో కొత్త వేషం ధరిస్తోంది. అవటానికిది వైరల్‌ ఇన్‌ఫెక్షనే అయినా జీవక్రియ రుగ్మతనూ (మెటబాటిక్‌ డిసీజ్‌) తలపింపజేస్తోంది. రోగనిరోధక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ (ఇమ్యునోజెనిక్‌), రక్తాన్ని చిక్కబరుస్తూ (థ్రాంబోజెనిక్‌), వాపు ప్రక్రియను ప్రేరేపిస్తూ (ఇన్‌ఫ్లమేటరీ) పలు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఉద్ధృత దశలో ఇబ్బంది పెట్టటమే కాదు.. పూర్తిగా నయమైన తర్వాతా సుదీర్ఘంగా వెంటాడుతోంది (లాంగ్‌ కొవిడ్‌). కొవిడ్‌ బారినపడి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సగానికి పైగా మంది 2-3 నెలలు దాటినా ఆయాసం, నిస్సత్తువ, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలతో బాధపడుతుండటమే దీనికి నిదర్శనం. సాధారణంగా కొవిడ్‌ లక్షణాలు రెండు వారాల్లో పూర్తిగా తగ్గిపోతాయి. కొందరికివి మరో వారం వరకు కొనసాగొచ్ఛు అంటే గరిష్ఠంగా 21 రోజుల్లో లక్షణాలన్నీ తగ్గిపోవాలన్నమాట. అదేంటో గానీ కొద్దిమందికి దగ్గుతో పాటు తలనొప్పి, ఆయాసం, ఒళ్లు నొప్పులు, నీళ్ల విరేచనాల వంటి లక్షణాలు విడవకుండా కొనసాగుతూ వస్తున్నాయి. కొందరిలో ఇవి 90 రోజుల వరకూ కొనసాగుతుండటం గమనార్హం. ఇలాంటి ఇబ్బందులు అన్నిసార్లూ ఒకేలా ఉండటం లేదు. వస్తూ పోతున్నాయి. మంచి విషయం ఏంటంటే- చాలామందిలో ఇవేవీ తీవ్రం కావటం లేదు. ప్రాణానికి అపాయమేమీ కలిగించటం లేదు. కానీ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికిప్పుడు వీటి గురించి తీవ్రంగా భయపడాల్సిన పనిలేదు గానీ ఒకింత జాగ్రత్త అవసరం.

వాపు ప్రక్రియ తగ్గకపోవటంతోనే

సుదీర్ఘ కొవిడ్‌కు మూలం వైరస్‌తో ప్రేరేపితమైన వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) పూర్తిగా తగ్గకుండా, కొనసాగుతూ వస్తుండటం. ఇదే వివిధ లక్షణాల రూపంలో ఇబ్బది పెడుతోంది. తీవ్ర కొవిడ్‌ బారినపడ్డవారిలో ఐఎల్‌6, సీఆర్‌పీ వంటి వాపు ప్రక్రియ సూచికలు పెరిగిపోతుండటం చూస్తున్నదే. వీటిని తొలివారంలోనే మామూలు స్థాయికి తీసుకురావటం ప్రధానం. ఐఎల్‌6 పరీక్ష ఖరీదైంది కాబట్టి మనం సీఆర్‌పీ పరీక్ష చేస్తే చాలు. తొలినాళ్లలో చాలామందిలో సీఆర్‌పీ 5 ఎంజీ/లీ కన్నా ఎక్కువగానే ఉంటోంది. కొందరిలోనైతే 10 ఎంజీ/లీ కన్నా మించిపోతోంది కూడా. తొలి వారంలో సీఆర్‌పీ అదుపులోకి రానివారికి, కొవిడ్‌ నయమైనప్పటికీ సుదీర్ఘంగా వెంటాడే ప్రమాదముంది. ఇలాంటివారికి మొదట్లో ఎలాంటి ఇబ్బందీ ఉండటం లేదు. మూడు వారాల తర్వాత సీఆర్‌పీ పెరుగుతూ వస్తోంది. దీంతో 60, 90 రోజుల వరకూ ఇబ్బందులు వేధించటం కనిపిస్తోంది. అందుకే కొవిడ్‌ బాధితుల్లో సీఆర్‌పీని వీలైనంత త్వరగా 2 ఎంజీ/లీ వరకు రప్పించటం చాలా కీలకం. ఇందుకు డెక్సామెథసోన్‌, ప్రెడ్నిసోలోన్‌, మిథైల్‌ ప్రెడ్నిసోలోన్‌ వంటి స్టిరాయిడ్‌ ఇంజెక్షన్లు, మాత్రలు ఉపయోగపడతాయి. అవసరమైతే కాల్చిసిన్‌, మెఫానమిక్‌ ఆసిడ్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ఐవర్‌మెక్టిన్‌ మందులూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవీ వాపు ప్రక్రియను అదుపులో ఉంచేవే.

ముప్పు ఎవరికి?

* కొవిడ్‌ నిర్ధారణ అయినా, కాకపోయినా.. కొవిడ్‌కు చికిత్స తీసుకున్నా, తీసుకోకపోయినా.. ఒకటి కన్నా ఎక్కువ లక్షణాలు కనిపించేవారికి సుదీర్ఘ కొవిడ్‌ వచ్చే అవకాశముంది. అంటే దగ్గుతో పాటు తలనొప్పి, జ్వరం, ఆయాసం, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాల్లో ఏదో ఒకటి.. లేదూ ఇంకా ఎక్కువ లక్షణాలు కనిపించినవారు సుదీర్ఘ కొవిడ్‌ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటోందన్నమాట.

* కరోనా జబ్బు మగవారిలో ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ సుదీర్ఘ కొవిడ్‌ మాత్రం మహిళల్లోనే అధికం. ఇది పిల్లల్లోనూ, 55 ఏళ్లు దాటినవారిలోనూ ఎక్కువగానే కనిపిస్తోంది.

మధుమేహం ప్రధానం

సుదీర్ఘ కొవిడ్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మధుమేహం గురించే. ఎందుకంటే కొవిడ్‌-19 సైతం మధుమేహం మాదిరిగా జీవక్రియల సమస్య రూపంలోనూ వేధిస్తోంది. అంతేనా? స్వీయ రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన శరీరం మీద దాడిచేసే స్వభావంతోనూ ముడిపడి ఉంటున్నట్టు తాజాగా బయటపడుతోంది. కాబట్టే కొవిడ్‌లోనూ మధుమేహ దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనాజబ్బు బారినపడ్డవారిలో కొత్తగా మధుమేహం తలెత్తుతుండటం, గ్లూకోజు స్థాయులు మరీ ఎక్కువగా లేకపోయినా మధుమేహంలో మాదిరిగా రక్తంలో ఆమ్ల స్థాయులు విపరీతంగా పెరిగిపోతుండటం (కీటోఅసిడోసిస్‌) మనకు తెలిసిందే. ఇలాంటి ప్రభావాలు ఉద్ధృత దశలోనే కాదు.. 21 రోజుల తర్వాతా కనిపిస్తుండటం గమనార్హం. ఎందుకిలా? ఐఎల్‌6, సీఆర్‌పీ వంటి వాపు ప్రక్రియల సూచికలు ఇన్సులిన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. దీంతో తీవ్రమైన ఇన్సులిన్‌ నిరోధకత తలెత్తుతుంది. ఇది టైప్‌2 మధుమేహానికి దారితీస్తుంది. కొవిడ్‌ చికిత్సలో స్టిరాయిడ్ల వాడకమూ ఇందుకు దోహదం చేస్తోంది. ముఖ్యంగా మధుమేహం ముప్పు గలవారిలో కొత్తగా మధుమేహం బయటపడుతోంది. దీన్నే కొవిడ్‌ అనంతర స్టిరాయిడ్‌ ప్రేరేపిత మధుమేహం అనీ అంటున్నారు. కొవిడ్‌ నయమైనా కొందరికి 90 రోజుల్లోపు ఎప్పుడైనా సీఆర్‌పీ పెరగొచ్ఛు దీనికీ స్టిరాయిడ్లు వాడుకోవాల్సి వస్తోంది. ఇదీ మధుమేహానికి దారితీయొచ్ఛు అలాగే రక్తంలో ఆమ్లం స్థాయులూ పెరిగిపోతున్నాయి. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాక ఇవి మొదలవుతుండటం గమనార్హం. రాత్రిపూట మూత్రం ఎక్కువగా రావటం, మూత్రంలో మంట, నోరు ఎండిపోవటం వంటి లక్షణాలతో ఇది బయటపడుతోంది.

* గ్లూకోజు బాగా పడిపోవటం: కొవిడ్‌తో గానీ స్టిరాయిడ్ల వాడకంతో గానీ కొత్తగా మధుమేహం బారినపడ్డ కొందరిలో మూత్రపిండాలు, కాలేయం పనితీరు తాత్కాలికంగా అస్తవ్యస్తం కావటమూ సమస్యగా పరిణమిస్తోంది. ఇది హఠాత్తుగా గ్లూకోజు స్థాయులు పడిపోవటానికీ దారితీస్తోంది (హైపోగ్లైసీమియా).

* కీటోఅసిడోసిస్‌: సాధారణంగా మధుమేహంలో గ్లూకోజు స్థాయులు బాగా పెరిగిన సందర్భాల్లోనే రక్తంలో కీటోన్స్‌ పెరుగుతాయి (హైపర్‌ అస్మలార్‌ కీటోసిస్‌). కానీ సుదీర్ఘ కొవిడ్‌లో గ్లూకోజు స్థాయులు అంత ఎక్కువ లేకపోయినా, మామూలు స్థాయిలో ఉన్నా కూడా ఇవి పెరిగిపోవచ్ఛు ఎస్‌జీఎల్‌టీ2 ఇన్‌హిబిటార్స్‌ (గ్లిఫ్లోజిన్లు) వాడేవారిలో ఇలాంటి ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. రక్తంలో ఆమ్లం స్థాయులు పెరగటం వల్ల స్పృహ తప్పిపోవచ్ఛు

* పిల్లల్లో మధుమేహం: ఒకప్పుడు కాక్స్‌సాకీ బి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తో పిల్లల్లో మధుమేహం రావటం గమనించాం. సైటోమెగాలో వైరస్‌ల వంటివీ పిల్లల్లో మధుమేహానికి దారితీస్తుంటాయి. ఇలాంటి ధోరణి కరోనా జబ్బులోనూ కనిపిస్తున్నట్టు కొన్ని అనుభవాలు చెబుతున్నాయి.

ఇన్సులిన్‌ చికిత్స కీలకం

నిజానికి ఏదైనా మందుకు నిరోధకత తలెత్తితే దాన్ని ఇవ్వటం ఆపేయాల్సి ఉంటుంది. ఇన్సులిన్‌ విషయంలో అలా కాదు. దీర్ఘకాల ఇన్‌ఫెక్షన్లలో ఇన్సులిన్‌ నిరోధకత తలెత్తినా కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్సులిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కొవిడ్‌ బారినపడ్డవారిలో అప్పటికే మధుమేహం ఉన్నా, కొత్తగా మధుమేహం బయటపడినా, స్టిరాయిడ్‌ ప్రేరేపిత మధుమేహమైనా విధిగా ఇన్సులిన్‌ ఇవ్వాలి. అదీ దీర్ఘకాలం.. 12 గంటల పాటు పనిచేసే ఇంజెక్షన్లతోనే చికిత్స చేయాల్సి ఉంటుంది.

ఇతర అవయవాల మీదా..

వాపు ప్రక్రియ ప్రేరేపితమైతే శరీరమంతటా ప్రభావం కనిపిస్తుంది. పైగా దీని దుష్ప్రభావాలు ఒక్క రోజుతో సమసిపోయేవి కావు. అందుకే ఆయా అవయవాలకు సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు వేధిస్తుండటం చూస్తున్నాం. సమతులాహారం తీసుకోవటం, పోషకాలు తగ్గకుండా చూసుకోవటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం, శక్తి కొద్దీ వ్యాయామం చేయటం ద్వారా వీటిని అదుపులో ఉంచుకోవచ్ఛు లక్షణాల తీవ్రత ఏమాత్రం పెరిగినా తాత్సారం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.

* ఊపిరితిత్తులు: సుదీర్ఘ కొవిడ్‌లో ముఖ్యంగా దెబ్బతినేవి ఊపిరితిత్తులు. దీంతో చాలామందిలో కొవిడ్‌ తగ్గిన తర్వాత దగ్గు వేధిస్తోంది (పోస్ట్‌ కొవిడ్‌ బ్రాంకైటిస్‌). వీరిలో శ్వాసనాళాల్లో మాత్రమే సమస్య ఉంటోంది. గాలి గదులేమీ ప్రభావితం కావటం లేదు. ఆక్సిజన్‌ స్థాయులేమీ తగ్గటం లేదు. కేవలం దగ్గుతోనే ఆగిపోతోంది. శ్వాసనాళాలు గట్టిపడటం, వీటిల్లో కఫం పేరుకోవటం వంటి కారణాలతో కొందరిని ఆయాసం కూడా వేధిస్తోంది. ముఖ్యంగా పని చేస్తుంటే ఇది ఎక్కువవుతుంటుంది.

* మూత్రపిండాలు: మూత్రపిండాల కార్టెక్స్‌లో లింఫ్‌ నాళాల నుంచి ద్రవం లీకై పోగుపడటం మరో సమస్య. దీంతో వారం, పది రోజుల పాటు మూత్రం తెల్లగా రావొచ్చు (కైలూరియా). దీన్నే పోస్ట్‌ కొవిడ్‌ సిస్టైసిస్‌, పోస్ట్‌ కొవిడ్‌ ప్రోస్టెటైసిస్‌ అంటున్నారు. సాధారణంగా కైలూరియా బోదకాలులోనే చూస్తుంటాం. ఇప్పుడిది సుదీర్ఘ కొవిడ్‌లోనూ కనిపిస్తోంది.

* గుండె: ఇన్‌ఫెక్షన్‌ మూలంగా గుండె కండరం మందమై గుండె వేగంగా కొట్టుకోవచ్చు (అరిత్మియా). స్వయంచాలిత నాడీ వ్యవస్థ దెబ్బతిన్నా గుండె లయ తప్పొచ్ఛు ఇది గుండె వైఫల్యానికి దారితీయొచ్ఛు

* కాలేయం: కొవిడ్‌ బారినపడ్డవారిలో కాలేయ ఎంజైమ్‌ల స్థాయులూ పెరగొచ్చు (పోస్ట్‌ కొవిడ్‌ హెపటైటిస్‌). అలాగే పిత్తాశయంలో పైత్య రసం ఎక్కువై రాళ్లు ఏర్పడొచ్ఛు

* మెదడు: చాలామందిలో కుంగుబాటు, ఆలోచనలు అస్తవ్యస్తం కావటం, విషయగ్రహణ సామర్థ్యం తగ్గటం, అయోమయం, తికమక వంటి ఇబ్బందులూ బయటపడుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని