బోల్తా పడొద్దు!

లక్షణాలు జబ్బుల కిటికీలు! సమస్యను త్వరగా గుర్తించటానికివే కీలకం. అయితే ఇవి ఆయా వ్యాధులకే ప్రత్యేకం కాకపోవచ్చు. కొన్ని లక్షణాలు పలు రకాల జబ్బుల్లోనూ కనిపించొచ్చు. కొన్ని తీవ్రమైనవైతే.. మరికొన్ని మామూలు సమస్యలకు సంబంధించినవి కావొచ్చు. ఇక్కడే చాలామంది బోల్తా పడుతుంటారు. తీవ్రమైన జబ్బులకు చెందిన వాటినీ మామూలువేనని పొరపడుతుంటారు. ఇలాంటి లక్షణాల విషయంలో అప్రమత్తత అత్యవసరం. లేకపోతే పెద్ద ముప్పులో పడ్డట్టే.

Updated : 30 Nov 2021 04:30 IST

లక్షణాలు జబ్బుల కిటికీలు! సమస్యను త్వరగా గుర్తించటానికివే కీలకం. అయితే ఇవి ఆయా వ్యాధులకే ప్రత్యేకం కాకపోవచ్చు. కొన్ని లక్షణాలు పలు రకాల జబ్బుల్లోనూ కనిపించొచ్చు. కొన్ని తీవ్రమైనవైతే.. మరికొన్ని మామూలు సమస్యలకు సంబంధించినవి కావొచ్చు. ఇక్కడే చాలామంది బోల్తా పడుతుంటారు. తీవ్రమైన జబ్బులకు చెందిన వాటినీ మామూలువేనని పొరపడుతుంటారు. ఇలాంటి లక్షణాల విషయంలో అప్రమత్తత అత్యవసరం. లేకపోతే పెద్ద ముప్పులో పడ్డట్టే.

రోగ్యమే మహా భాగ్యం. దీన్ని ఎవరికి వారు కాపాడుకోవాల్సిందే. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాల్సిందే. కానీ కొందరు జబ్బు లక్షణాలు కనిపిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. ‘ఆ ఏమవుతుందిలే’ అని నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. మరికొందరు చిన్న చిన్న విషయాలకే డాక్టర్ల దగ్గరికి, అదీ స్పెషలిస్టుల దగ్గరికి పరుగెత్తుకొని వెళ్తుంటారు. ఇది ఆయా వ్యక్తుల ఆలోచనా ధోరణి, ఆర్థిక స్థితిగతులు.. డాక్టర్లు, ఆసుపత్రుల అందుబాటు వంటి వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. మరోవైపు జనాభాతో పోలిస్తే మనదేశంలో వైద్యుల సంఖ్య తక్కువ. దీంతో కొన్నిసార్లు.. ముఖ్యంగా రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయాల్లో సమగ్రంగా చర్చించి, క్షుణ్నంగా పరిశీలించే సమయం దొరక్కపోవచ్చు. ఇన్ని వ్యత్యాసాలు, వైవిధ్యాలతో కూడిన మనదేశంలో కొన్నిసార్లు జబ్బు లక్షణాలను విస్మరించే అవకాశం లేకపోలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇలాంటిది చూస్తూనే ఉంటాం. దీంతో కొందరికి జబ్బు ముదిరి, తీవ్రం కావొచ్చు. తగు చికిత్స అందకపోతే ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. కాబట్టి వీటిపై అవగాహన కలిగుండటం ఎవరికైనా మంచిదే.

ఛాతీ మంటా? గుండె నొప్పా?

‘కొద్దిరోజులుగా తిన్నది సరిగా జీర్ణం కావటం లేదు. ఛాతీలో మంటగా ఉంటోంది. కుదురుగా ఉండలేకపోతున్నా’ అని బాధపడిపోతుంటారు. ఇవి అజీర్ణం, ఛాతీ మంట (అసిడిటీ) లక్షణాలే కావొచ్చు. అలాగని పూర్తిగా దానికే పరిమితం కావు. గుండెపోటుతోనూ ఇవి తలెత్తొచ్చు. మనదేశంలో చాలామంది విస్మరిస్తున్న లక్షణాలివి. గుండెనొప్పిని అసిడిటీ, గ్యాస్‌గా పొరపడుతూ తాత్సారం చేస్తుంటారు. ఛాతీ మంట తగ్గించే మందులు వాడుతుంటారు. ఏవేవో పొడులు నీటిలో కలుపుకొని తాగుతుంటారు. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. గుండెపోటులో అన్నిసార్లూ ఛాతీలోనే నొప్పి రావాలనేమీ లేదు. ఇది కొన్నిసార్లు కడుపునొప్పి రూపంలోనూ బయటపడుతుంది. గుండెకు, అన్నవాహికకు, కడుపు భాగానికి ఒకే నాడి సంకేతాలను ప్రసారం చేస్తుంటుంది. అందుకే గుండెపోటు అసిడిటీలా కనిపించొచ్చు, అసిడిటీ గుండెపోటు మాదిరిగా కనిపించొచ్చు. వీటి మధ్య తేడాను గుర్తించటం కష్టం. పరీక్షలతోనే నిర్ధరించటం సాధ్యమవుతుంది. కొందరికి సుష్టుగా భోజనం చేసిన తర్వాత గుండెనొప్పి రావొచ్చు. భోజనం చేశాక కడుపులోని అవయవాలకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో గుండె మీద భారం పెరిగి, నొప్పికి దారితీస్తుంది. దీన్ని అసిడిటీగా భావించటం తగదు. అసిడిటీ అయితే మంచిదే. అంత ప్రమాదమేమీ లేదు. కానీ గుండెపోటును విస్మరిస్తేనే ప్రమాదం. కడుపులో.. ముఖ్యంగా ఛాతీ, బొడ్డు మధ్యభాగంలో నొప్పి వస్తే నిర్లక్ష్యం తగదు. నడుస్తున్నప్పుడు, భోజనం చేశాక నొప్పి ఎక్కువవుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. మధుమేహం, అధిక రక్తపోటు గలవారికి, 30 ఏళ్లు పైబడ్డవారికి, కుటుంబంలో గుండెపోటు బాధితులు ఉన్నవారికిది మరింత ముఖ్యం.

అతి నిద్ర వరమా? శాపమా?

‘మావాడు ఇలా పడుకోగానే అలా నిద్రపోతాడు. ఎంత అదృష్టవంతుడో’ అని కొందరు గొప్పగా చెబుతుంటారు. నిజానికిదేమంత మంచి లక్షణం కాదు. సాధారణంగా పడుకున్నాక కొంత సేపటికి నిద్ర పడుతుంది. వెంటనే గాఢ నిద్ర ముంచుకొస్తుందంటే నిద్ర కొరతతో బాధపడుతున్నారనే అర్థం. రాత్రి సరిగా నిద్రపోకపోతే పగటిపూట నిద్ర రావటం మామూలే. కానీ రాత్రి బాగా నిద్రపోయినా పగటి పూట నిద్ర వస్తుంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. దీనికి ప్రధాన కారణం గురక. దీన్నే అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా అంటారు. ఇందులో నిద్రపోతున్నప్పుడు గొంతు వెనకాల భాగం వదులై, కిందికి జారుతుంది. ఇది శ్వాస నాళానికి అడ్డుపడుతుంది. దీంతో కాసేపు శ్వాస ఆడక, ఉక్కిరిబిక్కిరై ఉన్నట్టుండి నిద్రలోంచి మెలకువ వచ్చేస్తుంది. ఇలా రాత్రంతా చాలాసార్లు నిద్రకు భంగం కలుగుతుంది. గాఢ నిద్ర కొరవడుతుంది. రక్తంలో ఆక్సిజన్‌ తగ్గుతుంది. దీంతో మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందక విశ్రాంతి దొరకదు. ఫలితంగా తెల్లారి హుషారుగా ఉండదు. చిరాకు, ఆందోళన వేధిస్తాయి. ఒకోసారి గుండె లయ దెబ్బతిని, ఆక్సిజన్‌ బాగా తగ్గిపోయి నిద్రలోనే మరణించే ప్రమాదమూ ఉంది. చాలామంది గురకతో ఇబ్బంది పడుతున్నా దాన్ని పోల్చుకోలేరు. తలనొప్పి, చికాకు, ఆందోళన, బలహీనత వంటి సమస్యలుగా పొరపడి ఇవేవో చికిత్సలు తీసుకుంటుంటారు. దీన్ని విస్మరిస్తే గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, ప్రశాంతత లోపించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కొరవడుతుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు నిద్ర ఆపులేకపోవటం వల్ల రోడ్డు ప్రమాదాలకూ గురికావొచ్చు. కాబట్టి గురకను తేలికగా తీసుకోవటానికి లేదు. నిద్ర పోతున్నప్పుడు మనకు తెలియనంత మాత్రాన దీంతో ఎలాంటి నష్టం లేదనుకోవటానికి లేదు. మున్ముందు ఇది తీవ్ర అనర్థాలకు దారితీసే అవకాశముంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. బరువు తగ్గించుకోవటం.. మద్యం, పొగ అలవాట్లు మానెయ్యటం ద్వారా దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు. దీనికిప్పుడు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి డాక్టర్లు వీటిని సూచిస్తారు.


మామూలు మచ్చేనా?

కీళ్లనొప్పులు, శరీరం మీద మచ్చలు, వెంట్రుకలు రాలిపోవటం, నోట్లో పుండ్లు పడటం, జ్వరం. ఇలాంటి లక్షణాలు చాలా జబ్బుల్లో కనిపించేవే. అందుకే ల్యూపస్‌ లక్షణాలు చాలామందిని బోల్తా కొట్టిస్తుంటాయి. మన రోగనిరోధక శక్తి మనమీదే దాడి చేయటం వల్ల తలెత్తే సమస్య ఇది. దీని ప్రధాన లక్షణం ముఖానికి ఇరువైపులా సీతాకోక చిలుక ఆకారంలో ఎర్రటి దద్దు రావటం. అయితే మనలాంటి ముదురు చర్మం గలవారిలో ఇది అంతగా కనిపించకపోవచ్చు. చాలామంది దీన్ని మామూలు మచ్చగానే భావిస్తుంటారు. ఏవో తోచిన చిట్కాలు పాటిస్తుంటారు. నూనెలు, క్రీములు రాసుకుంటుంటారు. లేకపోతే బ్యూటీ పార్లర్‌కు వెళ్తుంటారు. చర్మ సమస్యగా భావించి స్కిన్‌ స్పెషలిస్టును సంప్రదిస్తుంటారు. నిపుణులైన వైద్యులు దీన్ని తేలికగానే గుర్తిస్తారు గానీ కొన్నిసార్లు వేరే సమస్యగా భావించొచ్చు. ల్యూపస్‌ ప్రధానంగా మహిళల్లోనే కనిపిస్తుంది. దీని బారినపడే వారిలో నూటికి 90 మంది మహిళలే. సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల వయసులో కనిపిస్తుంది. దీన్ని తొలిదశలో గుర్తించకపోతే లోలోపలే ముదిరి, చాలా చిక్కులు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఇది ఒక్క చర్మానికే పరిమితమయ్యేది కాదు. కిడ్నీల వంటి కీలకమైన అవయవాలనూ దెబ్బతీస్తుంది. అబార్షన్లు కావటం, సంతానం కలగకపోవటం వంటివీ ఉంటాయి. కొందరిలో మానసిక సమస్యలూ పొడసూపుతుంటాయి. ల్యూపస్‌కు చికిత్స తీసుకుంటే మానసిక సమస్యలూ తగ్గుతాయి. అందువల్ల కీళ్లనొప్పులు, మచ్చల వంటివి కనిపిస్తే ఇతరత్రా జబ్బులతో పాటు ల్యూపస్‌నూ అనుమానించాలి. యాంటీ న్యూక్లియర్‌ యాంటీబాడీ (ఏఎన్‌ఏ) పరీక్షతో ఇది బయటపడుతుంది. దీర్ఘకాలిక సమస్యే అయినా ల్యూపస్‌ను మందులతో నియంత్రణలో ఉంచుకోవచ్చు.


వేడి చేయటమంటే?

‘నాకు బాగా వేడి చేసింది’ అనేది చాలామంది నోటి నుంచి వచ్చే మాట. మూత్రంలో మంట కావొచ్చు. మల విసర్జన సమయంలో మంట కావొచ్చు, రక్తం పడటం కావొచ్చు. ఒళ్లు వేడిగా అనిపించటం కావొచ్చు. వీటన్నింటినీ వేడి చేయటంగానే భావిస్తుంటారు. మాంసాహారం తినటం, మద్యం తాగటం వల్ల ఇది వచ్చిందని భావిస్తుంటారు. నిజానికి వేడి అనే జబ్బేదీ లేదు. దీన్ని చాలామంది చాలా రకాలుగా ఊహించుకుంటుంటారు. సమస్య గురించి చెప్పమని అడిగినప్పుడు లక్షణాలు ఏకరువు పెడుతుంటారు. మల విసర్జన సమయంలో మంట పుట్టటానికి, రక్తం పడటానికి ప్రధాన కారణం మలబద్ధకం. మలం గట్టిగా, బలంగా రావటం వల్ల మలద్వారం చుట్టుపక్కల చీరుకుపోయి (ఫిషర్‌) రక్తం పడుతుంది. కొందరికి మొలలూ (పైల్స్‌) ఉండొచ్చు. మంట లేకుండానూ కొందరికి రక్తం పడొచ్చు. దీన్ని కూడా వేడి చేయటమనే అనుకుంటుంటారు. ఇది పొరపాటు. మల విసర్జన సమయంలో రక్తం పడితే సొంత వైద్యాలు చేసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. తగు పరీక్షలు చేసి సమస్యను నిర్ధరిస్తారు. మంట, నొప్పి లేకుండా రక్తం పడుతుంటే నిర్లక్ష్యం అసలే పనికిరాదు. వృద్ధుల్లో ఇది క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు. కొలనోస్కోపీతో దీని ఆనవాళ్లను ముందే పట్టుకోవచ్చు.

మూత్రంలో మంటను వేడిగా భావించి చల్లటి నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ల వంటివి తాగుతుంటారు. కొందరు శీతల పానీయాలు, బీరు కూడా తాగుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మూత్రం మంటకు ప్రధాన కారణం ఇన్‌ఫెక్షన్‌. కొన్నిసార్లు మూత్రమార్గం సన్నగా అవటంతోనూ ఇన్‌ఫెక్షన్లు వేధించొచ్చు. అడ్డంకిని తొలగిస్తేనే ఇది తగ్గుతుంది. మూత్ర పరీక్షతో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించొచ్చు. తగు యాంటీబయోటిక్‌ మందులు వాడితే ఇది నయమవుతుంది. ఇన్‌ఫెక్షన్‌ తగ్గాకా మూత్ర పరీక్ష చేసి, నిర్ధరించుకోవాలి. ఎందుకంటే ఒకోసారి మంట తగ్గినా ఇన్‌ఫెక్షన్‌ అలాగే ఉండొచ్చు. ఇది దీర్ఘకాల ఇన్‌ఫెక్షన్‌గా మారొచ్చు. ఇది పైకి పాకితే కిడ్నీ దెబ్బతినే ప్రమాదముంది. పూర్తిగా నయమయ్యేంత వరకు విధిగా మందులు వాడుకోవాలి.

థైరాయిడ్‌ జబ్బుతోనూ జ్వరం వచ్చినట్టుగా ఉండొచ్చు. దీన్ని కూడా వేడి అనే అనుకుంటుంటారు. థైరాయిడ్‌ హార్మోన్‌ మోతాదులు ఎక్కువైతే ఒంట్లో జీవక్రియల వేగం పెరుగుతుంది. దీంతో ఒళ్లంతా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. చికిత్స తీసుకుంటే థైరాయిడ్‌ జబ్బు తగ్గుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని