మధుమేహులు మందులు వేసుకోవాల్సిందేనా?

ఆరోగ్యం అనగానే ఎక్కడలేని సందేహాలు పుట్టుకొస్తాయి. మధుమేహులు మందులు వేసుకోవాల్సిందేనా? ఆహార, వ్యాయామ నియమాలతో గ్లూకోజు అదుపులో ఉండదా? గుండెజబ్బులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఎలా చూసుకోవాలి? మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటే వ్యాయామాలు చేయటమెలా?

Updated : 12 Apr 2022 08:22 IST

ఆరోగ్యం అనగానే ఎక్కడలేని సందేహాలు పుట్టుకొస్తాయి. మధుమేహులు మందులు వేసుకోవాల్సిందేనా? ఆహార, వ్యాయామ నియమాలతో గ్లూకోజు అదుపులో ఉండదా? గుండెజబ్బులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఎలా చూసుకోవాలి? మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటే వ్యాయామాలు చేయటమెలా? పనుల ఒత్తిడిని తగ్గించుకోవటమెలా? ఇటీవల జీవనశైలి జబ్బులపై ఈనాడు-సుఖీభవ నిర్వహించిన వెబినార్‌లో వీక్షకులు ఇలాంటి సందేహాలనే సంధించారు. వీటికి నిపుణులు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. వాటిల్లో కొన్ని ఇవీ..


గుండెజబ్బులు తగు జాగ్రత్తలు అవసరం

* ఛాతీ బిగుతుగా ఉంది. ఏం చేయాలంటారు?

* ఛాతీ బిగుతు, నొప్పి అనేక కారణాలతో రావొచ్చు. గుండెజబ్బు, జీర్ణాశయంలోని రసాలు అన్నవాహికలోకి ఎగదన్నుకొని రావటం, ఊపిరితిత్తుల్లో ద్రవాలు పోగుపడటం.. కండరాలు, ఎముకల సమస్యలు.. ఇలాంటివేవైనా వీటికి దోహదం చేయొచ్చు. అందువల్ల కారణాన్ని గుర్తించటం ముఖ్యం. ఛాతీలో నొప్పి తీరును బట్టి కొంతవరకు కారణాలను అంచనా వేయొచ్చు. నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, ఏవైనా పనులు చేసినప్పుడు, వ్యాయామాలు చేసినప్పుడు ఛాతీలో నొప్పిగా, బరువుగా అనిపించటం.. ఆయా పనులు మానేసినప్పుడు తగ్గుతుంటే గుండెజబ్బుకు సంబంధించిన నొప్పి అయ్యిండొచ్చు. పనులతో సంబంధం లేకుండా రోజంతా నొప్పి వస్తుంటే ఎముకలకు, కండరాలకు సంబంధించిన సమస్య కావొచ్చు. తిన్న తర్వాత నొప్పి వస్తే జీర్ణకోశ సమస్యతో ముడిపడి ఉండొచ్చు. గట్టిగా ఊపిరి తీసుకున్నప్పుడు నొప్పి వచ్చి, ఊపిరి వదిలినప్పుడు నొప్పి తగ్గుతుంటే ఊపిరితిత్తుల సమస్య కారణమై ఉండొచ్చు. ఏదేమైనా అంతకుముందు నొప్పి లేకుండా ఇప్పుడే మొదలైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవటం మంచిది. గుండె నొప్పిగా అనుమానిస్తే ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేస్తారు. అవసరమైతే ట్రెడ్‌మిల్‌ పరీక్ష కూడా చేస్తారు. వీటితో చాలావరకు గుండె నొప్పా? కాదా? అన్నది బయటపడుతుంది.

* గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఏం చేయాలి?

* అస్తవ్యస్త జీవనశైలిని మార్చుకొని గాడిలో పెట్టుకోవాలి. వేళకు భోజనం చేయాలి. వేళకు పడుకోవాలి. సమతులాహారం తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటమూ ముఖ్యమే. చాలామంది దీన్ని తగ్గించుకునే విషయంలో పొరపాటు పడుతుంటారు. నిజానికి చిన్న చిన్న జాగ్రత్తలతో దీన్ని తగ్గించుకోవచ్చు. వీటిల్లో ఒకటి సమయ పాలన. ఏదైనా పనిని కాస్త ముందుగానే ఆరంభించటం అలవాటు చేసుకుంటే చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది. ఒకేసారి ఎక్కువ పనులు ముందేసుకోకుండా ఒకటి పూర్తి చేశాక, మరోటి మొదలు పెట్టినా మేలే. అన్ని పనులూ మనమే చేయాల్సిన అవసరముండకపోవచ్చు. కొన్నింటిని ఇతరులకు అప్పగించే అవకాశముండొచ్చు. ఇలాంటి వాటిని గుర్తించి ఆయా వ్యక్తులకు అప్పగిస్తే ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైంది మనం చేయగలిగిన పనులేంటి? చేయలేనివేంటి? అనేది గుర్తించటం. మన సామర్థ్యాన్ని గుర్తించగలిగితే ‘అయ్యో అది చేయలేకపోయామే, ఇది చేయలేకపోయామే’ అని బాధపడటం తగ్గుతుంది. బలమైన, ఆరోగ్యకరమైన కుటుంబ, సామాజిక సంబంధాలు కూడా ముఖ్యమే. ఇవి మానసికంగా మంచి దన్నుగా నిలుస్తాయి. ఇలాంటి జాగ్రత్తలతో గుండెజబ్బులను చాలావరకు నివారించుకోవచ్చు.


మధుమేహం తొలి రోజు నుంచే మందులు

* నా భార్యకు పరగడుపున గ్లూకోజు 124 ఉంది. భోజనం చేశాక 235. మందులు ఇంకా మొదలు పెట్టలేదు? ఏం చెయ్యాలి?

* మధుమేహం నిర్ధరణ, చికిత్సలో రక్తంలో గ్లూకోజు మోతాదులే కీలకం. ఎవరికైనా పరగడుపున ఉదయం ఏడు గంటలకు రక్తంలో గ్లూకోజు 125 మి.గ్రా. దాటినా లేదా భోజనం చేశాక రెండు గంటల తర్వాత 200 మి.గ్రా. మించినా తొలి రోజు నుంచే మందులు వేసుకోవటం ఆరంభించాలి. ఇప్పుడు పరీక్ష చేయించారు కాబట్టి గ్లూకోజు ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది. ఇలా ఎంతకాలం నుంచి ఉందనేది తెలియదు. చాలామంది ‘ఇప్పుడే కదా మధుమేహం బయటపడింది. మరో నెల ఆగుదాం. ఆహార, వ్యాయామ నియమాలు పాటిద్దాం. తర్వాత మందులు వేసుకుందాం’ అని అనుకుంటారు. ఒకప్పుడు డాక్టర్లు కూడా మూడు నెలల పాటు ‘పొగ మానెయ్యండి, రోజూ వ్యాయామం చేయండి, ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించుకోండి’ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు రక్తంలో గ్లూకోజు నిర్ణీత మోతాదుల కన్నా ఎక్కువగా ఉన్నట్టు బయటపడిన రోజు నుంచే మందులు వేసుకోవాలని చెబుతున్నాం. మధుమేహం మొదలై అప్పటికే చాలాకాలం అయినట్టయితే దుష్ప్రభావాలూ ఆరంభమై ఉండొచ్చు. మందులు ఆలస్యమైతే ఇవి తీవ్రమయ్యే ప్రమాదముందని తెలుసుకోవాలి.

* చాలా ఏళ్లుగా మధుమేహం ఉంది. అరికాలు మంటలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒకోసారి పాదాలకు పట్టు కూడా ఉండటం లేదు. చెప్పులు కూడా సరిగా వేసుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలి?

* మధుమేహం వచ్చి, పదేళ్లు దాటిన తర్వాత ఏదో ఒకరకమైన నాడీ సమస్య (న్యూరోపతీ) తలెత్తుతుంటుంది. వీటిల్లో ప్రధానమైనవి పాదాల్లో స్పర్శ తగ్గటం (సెన్సరీ).. తిమ్మిర్లు, సూదులు పొడిచినట్టు అనిపించటం (పారస్తీషియా). కొందరికి కదలికలకు తోడ్పడే నాడులూ ప్రభావితం కావొచ్చు. దీంతో కాళ్లలో గానీ వేళ్లలో గానీ బలహీనత ఏర్పడుతుంది. పాదాలకు పట్టు ఉండటం లేదంటున్నారంటే స్పర్శ, కదలికలకు తోడ్పడే నాడులు రెండూ దెబ్బతిన్నాయనే అనిపిస్తోంది. మీరు ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకుంటూ రక్తంలో గ్లూకోజు మోతాదులు 125 మి.గ్రా. కన్నా మించకుండా, భోజనం తర్వాత 200 మి.గ్రా. దాటకుండా చూసుకోవాలి. మూడు నెలల గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్షలో 7% లోపే ఉంచుకోవాలి. ఇలా మూడు నెలల పాటు గ్లూకోజును అదుపులో ఉంచుకుంటే నాడీ సమస్యల ఇబ్బందులు తగ్గే అవకాశముంది. తిమ్మిర్లు, మంటలు తగ్గటానికి ప్రిగాబాలిన్‌, మిథైల్‌ కొబాలమిన్‌ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల సలహా మేరకు తీసుకోవాలి. వీటిని వేసుకున్నా కూడా గ్లూకోజును కచ్చితంగా అదుపులో ఉంచుకుంటే తప్ప కాళ్లలో నాడీ సమస్యలు తగ్గవనే సంగతిని గుర్తించాలి.

* మందులు వాడుకోకుండా షుగర్‌ జబ్బును అదుపులో ఉంచుకోవచ్చా?

* చాలామంది ఇదే మాట అడుగుతుంటారు. ఆహారంలో మార్పులు చేసుకోవటం.. వ్యాయామం, శారీరక శ్రమ ఎక్కువగా చేయటం.. మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం వంటి జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చనే ధీమా అందరిలోనూ ఉంటుంది. ఈ ఆలోచన మంచిదే గానీ దాదాపు 60-70% మందిలో ఇది సాధ్యం కాదు. మందుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మందులతోనే గ్లూకోజు అదుపులోకి వస్తుంది. ఒకవేళ గ్లూకోజు పెరుగుతున్నట్టయితే దానికి తగినట్టుగా మందుల మోతాదులనూ మార్చుకోవాలి. ఎప్పుడో ఒకప్పుడు ఇన్సులిన్‌ ఇంజెక్షన్ల అవసరమూ ఏర్పడుతుంది. వీటిని కూడా తీసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం గుర్తించాలి. ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల వంటి సాంక్రమికేతర జబ్బులకు సుమారు 70% వరకు గాలి కాలుష్యం కారణమవుతున్నట్టు ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒక్క గాలి కాలుష్యమే కాదు, మనకు తెలియని కాలుష్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాల అనర్థాల గురించి మనకు అంతగా అవగాహన లేదు. కానీ ప్లాస్టిక్‌ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే గర్భిణులకు పుట్టిన పిల్లలకు థైరాయిడ్‌ గ్రంథి వాపు, మధుమేహం ముప్పు ఎక్కువగా వస్తున్నట్టు పరిశోధనల్లో గుర్తించారు. కాబట్టి కాలుష్యం మీదా దృష్టి పెట్టాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచిస్తోంది.


ఆహారం అన్నం మితంగా..

* నాకు 64 ఏళ్లు. చాలా ఏళ్లుగా మధుమేహం ఉంది. ఇటీవల అధిక రక్తపోటూ వచ్చింది. మందులు వాడుకుంటూనే ఆహార పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

* మధుమేహం, అధిక రక్తపోటు రెండూ ఉన్నాయి కాబట్టి ఉప్పు, చక్కెర వాడకంలో పరిమితి పాటించాలి. రోజుకు 2 గ్రాములకు (అర చెంచా) మించి ఉప్పు తీసుకోవద్దు. ఉప్పు వేయకుండా కూరలు వండుకోవాలి. తినేటప్పుడు పక్కన అర చెంచా ఉప్పు పెట్టుకోవాలి. దీన్ని కొద్దికొద్దిగా కూరల మీద చల్లుకొని కలుపుకోవాలి. అప్పుడే కలుపుకోవటం వల్ల రుచి బాగానే ఉంటుంది. అన్నం ఒకేసారి కాకుండా రెండు గంటలకు ఒకసారి కొద్ది కొద్దిగా తినాలి. పొద్దున టిఫిన్‌ చేశాక 10 గంటలకు ఒకసారి కాస్త తినాలి. అనంతరం 12 గంటలకు, తిరిగి 2 గంటలకు.. ఇలా కొద్దికొద్దిగా తినాలి. దీంతో రక్తంలో గ్లూకోజు ఒకేసారి ఎక్కువగా పెరగకుండా చూసుకోవచ్చు. సాయంత్రం 7 గంటల తర్వాత ఏమీ తినొద్దు. పిండి పదార్థాలతో పాటు మిఠాయిలు, వేపుళ్లు కూడా తగ్గించాలి. వెన్న, నెయ్యి వంటివీ చాలావరకు తగ్గించుకోవాలి.

* దంపుడు బియ్యం తినటం మంచిదని కొందరు, తృణ ధాన్యాలు తినటం మంచిదని మరికొందరు చెబుతున్నారు. వీటితో గ్లూకోజు అదుపులో ఉంటుందని అంటున్నారు. నిజంగా దంపుడు బియ్యం, తృణ ధాన్యాలు, చపాతీలతో గ్లూకోజు అదుపులో ఉంటుందా? అన్నం పూర్తిగా మానెయ్యాలా?

* తెల్లటి బియ్యంతో వండిన అన్నం త్వరగా జీర్ణమవుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజు మోతాదులు వేగంగా పెరుగుతాయి. దంపుడు బియ్యం అన్నమైతే ఆలస్యంగా జీర్ణమవుతుంది. పీచు కూడా లభిస్తుంది. చపాతీ వంటి వాటికి వాడే గోధుమ పిండిలోనూ పీచు ఉంటుంది. తృణ ధాన్యాలనూ చాలావరకు పొట్టుతోనే ఉంటాయి. ఇలాంటివన్నీ ఆలస్యంగా జీర్ణమవుతాయి. కాబట్టి రక్తంలోకి గ్లూకోజు త్వరగా విడుదల కాదు. పైగా అన్నం మాదిరిగా వీటిని అంత ఎక్కువ మొత్తంలోనూ తీసుకోరు. దీంతో గ్లూకోజు మరీ అంత ఎక్కువగా అందదు. కాబట్టి తెల్ల అన్నాన్ని తగ్గించుకోవటం మంచిది. మధ్యాహ్న భోజనంలో అన్నాన్ని సగానికి తగ్గించుకొని, మిగతా సగంలో చపాతీ, తృణ ధాన్యాల వంటివి చేర్చుకోవచ్చు.


వ్యాయామం మోకాళ్ల నొప్పి ఉన్నా..

* నాకు మోకాళ్ల నొప్పులున్నాయి. డాక్టర్‌ బరువు తగ్గమని చెప్పారు. మోకాళ్లు అరిగితే వాకింగ్‌, రన్నింగ్‌ చేయకూడదు కదా. మరి బరువు తగ్గటమెలా?

* నడక, జాగింగ్‌ కాకుండా మంచం మీద ఉండీ కొన్ని వ్యాయామాలు చేసుకోవచ్చు. కుర్చీలో కూర్చొనీ చేసుకోవచ్చు. నడుం వరకు లోతు నీటిలో దిగి కూడా వ్యాయామాలు చేసుకోవచ్చు. నీటిలో దిగినప్పుడు మోకాళ్ల మీద బరువు పడదు. తేలికగా వ్యాయామాలు చేసుకోవచ్చు. దీంతో ఫిట్‌నెస్‌ మెరుగవటమే కాదు, కొవ్వు కూడా తగ్గుతుంది. మోకాళ్ల నొప్పులు పెరగవు. ఆరోగ్యం మెరుగవుతుంది. శారీరకంగా ఫిట్‌ అవుతారు. కొద్దిరోజుల తర్వాత నెమ్మదిగా మామూలు వ్యాయామాలు ఆరంభించొచ్చు.

* నేను ఏడాదిగా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాను. రెండు, మూడు గంటల సేపు అలాగే కూర్చొని ఆన్‌లైన్‌ తరగతులు వినేవాడిని. ఈ మధ్య ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. ఏం చెయ్యాలి? 

* పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేవారికి మంచి ఆరోగ్యంగా ఉన్నా కూడా నడుం, మెడ నొప్పులు వచ్చే అవకాశముంది. అందువల్ల కూర్చున్నప్పుడు నడుం నిటారుగా ఉండేలా, వెనకాల వీపునకు దన్ను ఉండేలా చూసుకోవాలి. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి కుర్చీలోంచి లేవాలి. నాలుగడుగులు వేసి, తిరిగి కూర్చోవాలి. కూర్చున్న చోటే వెన్నెముకను సాగదీసే వ్యాయామాలు (డెస్క్‌టాప్‌ స్ట్రెచస్‌) కూడా మేలు చేస్తాయి. ఇవి ఎక్కువ సేపు కూర్చోవటానికి వీలు కల్పిస్తాయి. వీలున్నప్పుడు కూర్చునే తీరునూ మార్చుకోవాలి. వజ్రాసనంలో గానీ పద్మాసనంలో గానీ కింద కూర్చోవచ్చు. కాసేపు బోర్లా పడుకొని పుస్తకం చదువుకోవచ్చు. ఇవి వెన్నెముక డిస్కుల మీద ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే ఉదయం, సాయంత్రం రెండు పూటలా గంటసేపు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు కూడా చేయాలి.


మానసిక ఆరోగ్యం ఒత్తిడికి చిత్తవ్వద్దు

* నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను. రెండేళ్లుగా ఇంటి నుంచి పని చేస్తున్నాను. చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతుంటాను. త్వరగా కోపం వస్తుంది. యోగా, ప్రాణాయామం చేయాలని అనుకుంటుంటాను గానీ వీటి మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ఏం చెయ్యాలి?

* మనసు తీవ్ర అలజడితో ఉన్నప్పుడు ఏకాగ్రత కుదరకపోవచ్చు. యోగా, ప్రాణాయామం వంటివి చేయలేకపోవచ్చు. అంతమాత్రాన చింతించాల్సిన పనిలేదు. బాధ పడి మరింత ఒత్తిడి పెంచుకోవాల్సిన పనిలేదు. ముందు ఒత్తిడికి కారణాన్ని గుర్తించటానికి ప్రయత్నించండి. తర్వాత అధిగమించటానికి మార్గాలు వాటంతటవే దొరుకుతాయి. యోగా, ధ్యానం, ప్రాణాయామం ప్రశాంతగా జీవించటానికి తోడ్పడతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. వీటితో ఫలితం కనిపిస్తే అలాగే కొనసాగించొచ్చు. వీటిని సాధన చేయలేకపోతున్నానని భావిస్తే మాత్రం ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించొచ్చు. కొందరికి నడిస్తేనో, పరుగెడితేనో మానసిక ప్రశాంతత లభించొచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైంది మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోవటం. మీ గురించి మీరు ఆలోచించుకోవటం.. మీకు నచ్చినవి చేస్తేనే మంచి విశ్రాంతి లభిస్తుందని తెలుసుకోవాలి. అందరూ చేస్తున్నారు కదా, అందరూ చెబుతున్నారు కదా అని వాటిని ప్రయత్నించి.. అందులో విఫలమై బాధపడటంలో అర్థం లేదు. అదేపనిగా కోపం, బాధ, చిరాకు వస్తున్నా.. ఇవి నిరంతరం విడవకుండా వేధిస్తున్నా.. వీటితో రోజువారీ పనుల మీద శ్రద్ధ తగ్గుతున్నా.. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటున్నా.. నిద్ర సరిగా పట్టకపోతున్నా ఒత్తిడి జబ్బుగా మారిందనే అర్థం. దీనికి తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి.

* నాకు హఠాత్తుగా ఏదైనా అవుతుందోమో, జరగకూడదని జరుగుతుందేమోననే ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. అతిగా భయపడి పోతుంటాను. ఎప్పుడూ ఏదో ఆందోళన వెంటాడుతూ ఉంటుంది. దీన్ని ఎలా నియంత్రించుకోవాలి?

* రోజువారీ పనుల్లో భాగంగా ఒకింత ఒత్తిడి, ఆందోళన సహజమే. కానీ ఎలాంటి కారణం లేకుండా హఠాత్తుగా భయపడటం.. అంటే గుండెదడ, చెమట్లు పట్టటం, ఏదో జరిగిపోతుందని అనిపించటం, ఊపిరి సరిగా ఆడటం లేదని తోచటం.. ఇలాంటి పరిస్థితి 5, 10 నిమిషాలు ఉండటం, తగ్గటం.. తగ్గిన తర్వాత మళ్లీ వస్తుందేమోనని భయపడటం.. ఇలాంటివన్నీ పానిక్‌ డిజార్డర్‌ లక్షణాలు. సాధారణంగా ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఎదురైతే మెదడు అతి చురుకుగా స్పందిస్తుంది. ఒంట్లో ఎన్నో రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి లేదంటే అక్కడ్నుంచి పారిపోవటానికి తగిన శక్తినిస్తాయి. కానీ పానిక్‌ డిజార్డర్‌లో ప్రమాదకర పరిస్థితులేవీ లేకపోయినా మెదడు దానంతటదే అతిగా స్పందింస్తుంది. ఉన్నట్టుండి భయం, అందోళన కలుగుతాయి. దీనికి మందులు, చికిత్స అవసరం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని