గుండెకు మెట్ల బలం!

జిమ్‌లో వ్యాయామాలు చేసేవారికి కొవిడ్‌-19 పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. రెండో దశ విజృంభణ, నిర్బంధాలతో ఇంటికే పరిమితమవ్వటం కష్టంగానే మారింది. చాలామంది ఇంటి వ్యాయామాల్లో మెట్లు ఎక్కటాన్ని చేర్చటమూ చూస్తూనే ఉన్నాం. దీన్ని తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదని, మెట్లు ఎక్కటంతోనూ

Published : 08 Jun 2021 01:29 IST

జిమ్‌లో వ్యాయామాలు చేసేవారికి కొవిడ్‌-19 పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. రెండో దశ విజృంభణ, నిర్బంధాలతో ఇంటికే పరిమితమవ్వటం కష్టంగానే మారింది. చాలామంది ఇంటి వ్యాయామాల్లో మెట్లు ఎక్కటాన్ని చేర్చటమూ చూస్తూనే ఉన్నాం. దీన్ని తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదని, మెట్లు ఎక్కటంతోనూ ఒక మాదిరి తీవ్ర వ్యాయామాలతో సమానంగా ప్రయోజనాలు కలుగుతున్నట్టు కెనడా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. ఇందులో భాగంగా గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్నవారి వ్యాయామాల తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కినవారిలో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం, కండరాలు గణనీయంగా పుంజుకుంటున్నట్టు గుర్తించారు. అంటే ఇది గుండె ఆరోగ్యం పుంజుకోవటానికే కాదు.. దెబ్బతిన్న కండరాలూ పునరుత్తేజితం కావటానికీ తోడ్పడుతోందన్నమాట. అందుకే గుండె పునరుత్తేజ చికిత్సలో మెట్లు ఎక్కటమనేది సురక్షిత, సమర్థ, అనువైన మార్గం కాగలదని పరిశోధకులు భావిస్తున్నారు. కొవిడ్‌ విజృంభణతో బయటికి వెళ్లటం తగ్గిన నేపథ్యంలో ఇది చాలామందికి ఉపయోగపడగలదని ప్రధాన పరిశోధకుల్లో ఒకరైన మౌరీన్‌ మెక్‌డొనాల్డ్‌ చెబుతున్నారు. ఒకసారి గుండెపోటు తలెత్తితే రెండోసారి దీని బారినపడే అవకాశముంది. దీన్ని నివారించుకోవటానికి వ్యాయామం, జీవనశైలి మార్పులు బాగా ఉపయోగపడతాయి. కానీ చాలామంది గుండెజబ్బు బాధితులు సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవటం మీద పెద్దగా దృష్టి పెట్టరు. సమయం దొరక్కపోవటం, జిమ్‌ అందుబాటులో లేకపోవటం లేదా వ్యాయామాలకు తగిన స్థలం లేకపోవటం వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయి. అయితే ఇకపై ప్రత్యేక పరికరాలు, సదుపాయాలు లేవనే సాకులు చెప్పటం కుదరదని పరిశోధకులు చెబుతున్నారు. ఇంటినే వ్యాయామశాలగా పరిగణించి, శరీర సామర్థ్యాన్ని బట్టి మెట్లు ఎక్కటం సాధన చేయటం మంచిదని సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని