గర్భిణికి కరోనా తగ్గాక

కరోనా పరీక్ష నెగెటివ్‌గా వచ్చిన తర్వాత దాని గురించి పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు. అనవసరంగా ఆందోళన పడొద్ధు కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండాలి. కరోనా బారినపడ్డ తర్వాత కొందరికి పోషకాల లోపం తలెత్తే అవకాశముంది. కాబట్టి సమతులాహారం తీసుకోవటం చాలా ముఖ్యం

Published : 18 Aug 2020 00:51 IST

సమస్య సలహా

సమస్య: నేను గర్భిణిని. ఇప్పుడు 7 నెలలు. ఇటీవల కరోనా జబ్బు వచ్చింది. తగ్గిపోయింది. పరీక్ష నెగెటివ్‌గా వచ్చింది. కాస్త నీరసంగా ఉండటం తప్ప వేరే ఇబ్బందులేవీ లేదు. నేను ఆహార పరంగా, మందుల పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- రాజిత, హైదరాబాద్‌

సలహా: కరోనా పరీక్ష నెగెటివ్‌గా వచ్చిన తర్వాత దాని గురించి పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు. అనవసరంగా ఆందోళన పడొద్ధు కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండాలి. కరోనా బారినపడ్డ తర్వాత కొందరికి పోషకాల లోపం తలెత్తే అవకాశముంది. కాబట్టి సమతులాహారం తీసుకోవటం చాలా ముఖ్యం. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. తరచూ వేడి నీళ్లు తాగటం మంచిది. ఎప్పుడైనా సరే కాచి, చల్లార్చిన నీరే తాగాలి. జింక్‌, విటమిన్‌ సి వంటి రకరకాల విటమిన్లతో కూడిన మాత్రలు వేసుకోవాలి. మీరు ఇప్పటివరకూ చూపించుకుంటున్న డాక్టర్‌ను క్రమం తప్పకుండా సంప్రదించాలనే సంగతి మరవరాదు. ఎందుకంటే కరోనా బారినపడ్డ కొందరు గర్భిణుల్లో మాయకు రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గూడు కడుతున్నట్టు కొన్ని అనుభవాలు చెబుతున్నాయి. ఇది పిండానికి చిక్కులు తెచ్చిపెట్టొచ్ఛు డాక్టర్‌కు చూపించుకొని, తగు పరీక్షలు చేయించుకుంటే నిశ్చింతగా ఉండొచ్ఛు పిండం కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏమాత్రం తగ్గినట్టు అనుమానం వచ్చినా తాత్సారం చేయరాదు. వెంటనే డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలి. ధనుర్వాతం, కంఠసర్పి, కోరింతదగ్గు రాకుండా చూసే టీడ్యాప్‌ టీకా.. అలాగే ఫ్లూ నివారణకు తోడ్పడే ఫ్లూ టీకా తీసుకోవాలి.


బొటన వేలు వద్ద రసి?

సమస్య: నాకు కాలి బొటన వేలు మీద పుండు అయ్యింది. రసి కారుతోంది. యాంటీబయోటిక్‌ మందులు వాడాను. పుండు మానింది గానీ నీళ్ల లాంటిది వస్తోంది. నాకు మధుమేహం ఏమీ లేదు. దీనికి పరిష్కారమేంటి?

-శ్రీనాథ్‌, హన్మకొండ

సలహా: మీరు వయసు, చేసే పని వంటి వివరాలు తెలపలేదు. పుండు పడిందంటున్నారు గానీ దెబ్బ ఏదైనా తగిలిందా? నొప్పి, దురద ఉన్నాయా? అనేవి రాయలేదు. సమస్యను అర్థం చేసుకోవటానికి, పరిష్కారం చెప్పటానికివి చాలా ముఖ్యం. మీకు తెలియకుండానే ఎప్పుడైనా దెబ్బ తగిలి ఉండొచ్ఛు దాన్ని మీరు గుర్తించి ఉండకపోవచ్ఛు అది ఇన్‌ఫెక్షన్‌కు దారితీసి ఉండొచ్ఛు యాంటీబయోటిక్‌ మందులు వేసుకున్నా పూర్తి కోర్సు వాడి ఉండకపోవచ్ఛు దీంతో ఇన్‌ఫెక్షన్‌ పైకి మానినట్టు కనిపించినా, లోపల్నుంచే ఎక్కువయ్యి ఉండొచ్ఛు నీటిలో తడవటం వల్ల మళ్లీ ఎక్కువవుతుండొచ్ఛు చీము, రసి కారుతుండొచ్ఛు దెబ్బ తగిలినట్టయితే పూర్తికాలం యాంటీబయోటిక్స్‌ వాడుకోవాలి. టీటీ ఇంజెక్షన్‌ తీసుకోవాలి. డ్రెస్సింగ్‌ చేయించుకోవాలి. దీంతో పూర్తిగా తగ్గుతుంది. ఎక్స్‌రే తీసి, ఎముక విరిగిందా అనేదీ చూడాల్సి ఉంటుంది. ఒకవేళ దెబ్బ తగలనట్టయితే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలు కారణమవుతున్నాయేమో పరీక్షించాల్సి ఉంటుంది. వ్యవసాయం, సిమెంటు పనులు, రంగులు వేయటం వంటివి చేసేవారిలో ఇలాంటివి తలెత్తొచ్ఛు అలర్జీలో దురద కూడా ఉంటుంది. దీనికి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ తోడైతే నొప్పి కూడా పుట్టొచ్ఛు అలర్జీలైతే ఒక చోటే ఉండకపోవచ్ఛు ఇతర భాగాలకూ విస్తరించొచ్ఛు అలాంటిదేదైనా ఉందేమో చూసుకోండి. మీకు దెబ్బతగిలి, పుండు పడినట్టయితే ముందు శస్త్రచికిత్స నిపుణులను కలవండి. సమస్యను గుర్తించి, తగు చికిత్స చేస్తారు. ఒకవేళ చర్మ సమస్యలైతే డెర్మటాలజిస్టును సంప్రదించాల్సి ఉంటుంది. తగు మందులు వాడితే సమస్య నయమైపోతుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని