అక్షయంగా మారనీయొద్దు!

సమయం దగ్గర పడుతోంది. అవును. క్షయ నిర్మూలన లక్ష్యాన్ని చేరుకునే గడువు దగ్గర పడుతోంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గడువు కన్నా ఐదేళ్ల ముందుగానే.. అంటే 2025కల్లా మనదేశంలో క్షయను పూర్తిగా నిర్మూలించాలనే  కేంద్ర ప్రభుత్వ సంకల్ప

Updated : 23 Mar 2021 06:17 IST

రేపు ప్రపంచ క్షయ దినం

సమయం దగ్గర పడుతోంది. అవును. క్షయ నిర్మూలన లక్ష్యాన్ని చేరుకునే గడువు దగ్గర పడుతోంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గడువు కన్నా ఐదేళ్ల ముందుగానే.. అంటే 2025కల్లా మనదేశంలో క్షయను పూర్తిగా నిర్మూలించాలనే  కేంద్ర ప్రభుత్వ సంకల్ప సాధనకు రోజురోజుకీ సమయం దగ్గర పడుతోంది. క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఉచితంగా క్షయ నిర్ధారణ పరీక్షలు, చికిత్సను అందించటంతో పాటు మొండి క్షయపై విస్తృత ప్రచారంతో కట్టడి చేస్తున్న తరుణంలో కొవిడ్‌-19 విజృంభణ సరికొత్త సవాలును విసిరింది. ఒకే సమయంలో రెండింటితో పోరాడక తప్పని పరిస్థితుల్లో ఏమాత్రం వెనకడుగు వేసినా ఇప్పటివరకు సాధించిందంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్షయ మీద అవగాహన పెంపొందించుకోవటం, దీని నిర్మూలనను తమ బాధత్యగా భావించటం అవసరం. ప్రపంచ క్షయ దినం ఈ విషయాన్నే గుర్తించాలని సూచిస్తోంది.

మొండి క్షయ సవాలు

క్షయ నిర్మూలనకు మొండి క్షయ పెద్ద సవాలుగా మారింది. క్రమం తప్పకుండా, పూర్తికాలం మందులు వేసుకుంటే క్షయ పూర్తిగా నయమవుతుంది. దీనికి మంచి చికిత్స అందుబాటులో ఉంది. ప్రభుత్వం ఉచితంగానూ అందిస్తోంది. అయితే లక్షణాలు తగ్గుముఖం పట్టగానే జబ్బు నయమైందనుకొని ఎంతోమంది మందులను మధ్యలోనే మానేయటం చిక్కులు తెచ్చిపెడుతోంది. దీంతో క్షయ కారక బ్యాక్టీరియా మందులను తట్టుకొనే శక్తిని సంతరించుకొని మొండిగా (ఎండీఆర్‌టీబీ) మారుతోంది. బరువుకు తగిన మోతాదులో మందులు వేసుకోకపోవటం, డాక్టర్‌ సూచించిన జాగ్రత్తలను పాటించకపోవటం కూడా దీనికి కారణమవుతున్నాయి. మనదేశంలో సుమారు లక్షన్నర మంది మొండి క్షయతో బాధపడుతున్నారని అంచనా. మందులను మధ్యలో మానేసినవారిలో దాదాపు 12% మందికి క్షయ మొండిగా మారుతోంది. రిఫాంపిసిన్‌, ఐఎన్‌హెచ్‌ మందులకు బ్యాక్టీరియా లొంగకపోతే మొండి క్షయ ఉన్నట్టే. దీనికి చికిత్స కష్టం. రెండో శ్రేణి క్షయ మందులు అవసరమవుతాయి. సుమారు 9, 10 మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కాలమూ వేసుకోవాల్సి ఉంటుంది. మామూలు క్షయకు 6 నెలలు మందులు వేసుకుంటే సరిపోతుంది. అదే మొండి క్షయకైతే 24 నెలల పాటు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. అయినా అందరికీ తగ్గకపోవచ్చు. సుమారు 50-60% మందికే ఫలితం కనిపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటితో దుష్ప్రభావాలు ఎక్కువ. మొండి క్షయ బాధితుల్లో మరణాలూ ఎక్కువే. పరిస్థితి అంతవరకూ రాకుండా ముందే జాగ్రత్త పడటం మంచిది. మందులకు లొంగని క్షయ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి అవసరమైన చికిత్స అందటం లేదని గణాంకాలు పేర్కొంటున్నాయి.
* క్షయ తొలిసారి నిర్ధారణ అయినప్పుడే అది మామూలుదా? మొండిదా? అని పరీక్షించి చికిత్స ఆరంభించటం ఉత్తమం. క్యాప్సూల్‌ బేస్డ్‌ న్యూక్లిక్‌ యాసిడ్‌ యాంప్లికేషన్‌ పరీక్షతో దీన్ని తేలికగా, వెంటనే గుర్తించొచ్చు. సుమారు 3% మందికి మొదట్లోనే మొండి క్షయ ఉంటున్న తరుణంలో ఈ పరీక్ష తప్పనిసరి.
* క్షయ చికిత్స ఆరంభించిన రెండు నెలల తర్వాతా.. అలాగే మొత్తం ఆర్నెల్ల చికిత్స తీసుకున్న తర్వాతా కళ్లెలో క్రిములు కనిపిస్తుంటే మొండి క్షయగా అనుమానించాల్సి ఉంటుంది. మందులను పూర్తికాలం వేసుకోకపోయినా, అప్పటికే మొండి క్షయతో బాధపడేవారి కుటుంబంలో ఎవరికైనా క్షయ వచ్చినా, పూర్తి చికిత్స తీసుకున్నాక మళ్లీ సమస్య తిరగబెట్టినా, మందులు వాడుకుంటున్నా గ్రంథుల సైజు పెరుగుతున్నా మొండి క్షయ ఉందేమోనని అనుమానించి, తప్పకుండా పరీక్ష చేయించాలి.

కొవిడ్‌ సెగ!

క్షయ నిర్మూలన లక్ష్యానికి కొవిడ్‌-19 పెద్ద దెబ్బే కొట్టింది. మనదేశంలో 2020లో క్షయ నిర్ధారణ, చికిత్సలు సగటున 23% వరకు తగ్గిపోవటమే దీనికి నిదర్శనం. క్షయ నిర్ధారణ, చికిత్సల విషయంలో 12 ఏళ్లలో సాధించిన పురోగతి ఒక్క దెబ్బకు కుంటుపడిపోయింది. పరిస్థితి ఇప్పుడిప్పుడే క్రమంగా మెరుగవుతున్నప్పటికీ సాధించాల్సింది ఇంకెంతో ఉందనే సంగతిని విస్మరించరాదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని కబళిస్తున్న ఇన్‌ఫెక్షన్‌ జబ్బుల్లో క్షయ ఒకటి. ఏటా కోటి మంది దీని బారినపడుతుండగా.. 15 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. అందుకే దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, చికిత్స ఆరంభించటం చాలా ముఖ్యం. క్షయ బారినపడ్డవారిని గుర్తించటం తగ్గినకొద్దీ చికిత్స ఆలస్యమవుతుంది. దీంతో మరణాలూ ఎక్కువవుతాయి. క్షయ నిర్ధారణ 3 నెలల కాలంలో 50% తగ్గినట్టయితే ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 4 లక్షల వరకు పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. దీని ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది క్షయతో మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. క్షయ బారినడుతున్నవారిలోనూ, దీంతో మరణిస్తున్నవారిలోనూ పావు వంతు మంది మనదేశానికి చెందినవారే.
* కొవిడ్‌-19తో పోరాడుతున్నప్పటికీ క్షయ విషయంలో అలసత్వం పనికిరాదు. అనుమానిత లక్షణాలు గలవారికి క్షయ, కొవిడ్‌ పరీక్షలు రెండూ చేయటం మంచిది. అప్పుడే క్షయ బాధితులను కాపాడుకోవటం సాధ్యమవుతుంది. క్షయ మరణాలు పూర్తిగా నివారించుకోగలిగినవేనని తెలుసుకోవాలి.

ఎక్కడైనా రావొచ్చు.. నిద్రాణంగానూ ఉండొచ్చు

క్షయ ఊపిరితిత్తుల్లోనే కాదు.. గోళ్లు, వెంట్రుకలకు తప్పించి ఎక్కడైనా తలెత్తొచ్చు. దీనికి మూలం మైకోబ్యాక్టీరియమ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌. ఈ బ్యాక్టీరియా ఒంట్లో స్థిరపడిన చోట అక్కడి కణజాలాన్ని తినేస్తూ.. చిన్న చిన్న ఉండలను సృష్టిస్తుంది. క్షయ బాధితులు దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఒంట్లోకి ప్రవేశించినా ఆరోగ్యంగా ఉన్నవారిలో నిద్రాణంగానే ఉండిపోవచ్చు (లేటెంట్‌ టీబీ). రోగనిరోధక శక్తి తగ్గుముఖం పట్టినప్పుడు బ్యాక్టీరియా ఉత్తేజితమై క్షయగా మారే ప్రమాదముంటుంది.

చికిత్స ఆలస్యం కానీయొద్దు

క్షయను త్వరగా గుర్తించి, చికిత్స ఆరంభిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండటమే కాదు.. ఇతరులకు వ్యాపించటాన్నీ అరికట్టొచ్చు. కానీ చాలామందిలో క్షయ తలెత్తినప్పట్నుంచి దాన్ని నిర్ధారించి మందులు వేసుకోవటం మొదలెట్టేసరికే 3 నెలలు గడచిపోతోంది. దీనికి కారణం జబ్బుపై అవగాహన లేకపోవటమే. క్షయ ఉందని తెలిస్తే చుట్టుపక్కల వాళ్లు వెలివేస్తారనే భయంతోనూ కొందరు వెనకాడుతుంటారు. ఇలా చికిత్స ఆలస్యం కావటం వల్ల సమస్య తీవ్రమవటమే కాదు, ఇతరులకు వ్యాపించే ప్రమాదమూ పెరుగుతుంది. మందులు మొదలుపెట్టిన తర్వాత క్షయ ఇతరులకు వ్యాపించటం తగ్గుతుంది.

దగ్గు ప్రధాన లక్షణం

ఊపిరితిత్తుల క్షయలో దగ్గు ప్రధానమైన లక్షణం. దగ్గుతో పాటు కళ్లె పడుతుంది. రక్తమూ పడొచ్చు. నీరసం, నిస్సత్తువ, త్వరగా అలసిపోవటం, ఉత్సాహం కొరవడటం.. క్రమంగా ఆకలి, బరువు తగ్గటం వంటివీ ఉంటాయి. రాత్రిపూట జ్వరం, చెమటలు కూడా వస్తుంటాయి.
కళ్లె పరీక్ష ముఖ్యం
రెండు  వారాలైనా దగ్గు తగ్గకుండా వేధిస్తుంటే క్షయ కావొచ్చని అనుమానించాలి. ఊపిరితిత్తుల క్షయ నిర్ధారణకు కళ్లె పరీక్ష ముఖ్యం. ఉదయం నిద్రలేచాక తొలిసారి వచ్చే కళ్లెను పరీక్ష చేయాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు కళ్లెలో బ్యాక్టీరియా కనిపించకపోవచ్చు. అంతమాత్రాన క్షయ లేదనుకోవటం తగదు. లక్షణాలు ఉన్నప్పుడు ఛాతీ ఎక్స్‌రే తీసి పరిశీలించటం చాలా ముఖ్యం.

నివారణపై శ్రద్ధ

* క్షయతో బాధపడేవారు ఆరుబయట ఎక్కడా ఉమ్మకుండా ఉండటం చాలా చాలా ముఖ్యం.
* సమతులాహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. దీంతో క్షయ ముప్పు తగ్గుతుంది.
* పొగ, మద్యం అలవాట్లుంటే మానెయ్యాలి. పొగ తాగేవారికి క్షయ వచ్చే అవకాశం నాలుగింతలు ఎక్కువ. మద్యం తాగేవారికి పోషణలోపం, రోగనిరోధకశక్తి తగ్గటం వల్ల క్షయ ముప్పు పెరుగుతుంది.
* మధుమేహం గలవారికి క్షయ ముప్పు నాలుగు రెట్లు ఎక్కువ. అందువల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులను నియంత్రణలో ఉంచుకోవాలి. కొందరిలో మధుమేహం, క్షయ రెండూ ఒకేసారి బయటపడుతుంటాయి కూడా.

మందులు మధ్యలో మానేయొద్దు

క్షయకు తొలి రెండు నెలల పాటు 4 మందులు (రిఫాంపిసిన్‌, ఐసోనికోటినిక్‌ యాసిడ్‌ హైడ్రజైడ్‌, ఇథెంబుటాల్‌, పైరజినమైడ్‌).. ఆ తర్వాత మరో నాలుగు నెలల పాటు 2 మందులు (రిఫాంపిసిన్‌, ఐసోనికోటినిక్‌ యాసిడ్‌ హైడ్రజైడ్‌) వేసుకోవాలి. వీటిని డాక్టర్‌ చెప్పినంత కాలం వాడుకోవాలి. మధ్యలో మానేస్తే జబ్బు ఉద్ధృతమవుతుంది. మొండిగానూ మారుతుంది. మందులు వేసుకోవటం మొదలెట్టాక 15 రోజుల వరకు విధిగా మాస్కు ధరించాలి. లేదూ నోటికి, ముక్కుకు గుడ్డ అడ్డం పెట్టుకోవాలి. ఆఫీసుకు, స్కూళ్లకు వెళ్లకూడదు.
విటమిన్‌ డి లోపించినవారికి క్షయ వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల రోజుకు కనీసం 15 నిమిషాలైనా ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని