మధు పోటు

మధుమేహం, అధిక రక్తపోటు జంట శత్రువులు. ఇవి రెండూ తోడైతే గుండెకు పెద్ద ముప్పు పొంచి ఉన్నట్టే. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారిలో రాత్రిపూట రక్తపోటు తక్కువగా ఉండేవారితో పోలిస్తే ఎక్కువగా

Updated : 05 Oct 2021 03:17 IST

ధుమేహం, అధిక రక్తపోటు జంట శత్రువులు. ఇవి రెండూ తోడైతే గుండెకు పెద్ద ముప్పు పొంచి ఉన్నట్టే. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారిలో రాత్రిపూట రక్తపోటు తక్కువగా ఉండేవారితో పోలిస్తే ఎక్కువగా ఉండేవారికి మరణించే ముప్పు రెండు రెట్లు అధికంగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. సాధారణంగా రక్తపోటు రాత్రిపూట తగ్గుతుంటుంది. అయితే కొందరికి అంతగా తగ్గదు. పగటి పూట కన్నా ఎక్కువగానే ఉంటుంది (రివర్స్‌ డిపింగ్‌). మధుమేహుల్లో ఇలాంటి అసాధారణ రక్తపోటుకూ గుండెజబ్బులకు, మరణాలకూ సంబంధం ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ పీసా పరిశోధకులు గుర్తించారు. ప్రతి 10 మంది మధుమేహుల్లో ఒకరికి రాత్రిపూట రక్తపోటు ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. సుమారు మూడింట ఒకవంతు మందిలో గుండె, రక్తనాళాలను నియంత్రించే నాడులు దెబ్బతింటున్నట్టూ బయటపడింది. ఈ నాడులు క్షీణించటం వల్ల గుండె వేగం, రక్తపోటు అదుపు తప్పుతాయి. ఇది గుండెపోటు, మరణాలకు దారితీస్తుంది.

రక్తపోటు తగ్గాలంటే?

అధిక రక్తపోటుకు మందులు వాడుకోవటం తప్పనిసరి. అలాగే జీవనశైలిలో కొన్ని మార్పులూ చేసుకోవాల్సి ఉంటుంది.

* అధిక బరువు, ఊబకాయంతో రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలి.

* రోజుకు కనీసం అరగంట చొప్పున క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

* పండ్లు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, వెన్న తీసిన పాలు, పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

* ఉప్పు వాడకం తగ్గించాలి. కూరలు, చిరుతిళ్లు అనిం్నటినీ కలిపినా రోజుకు చెంచాడు ఉప్పు కన్నా మించనీయొద్దు.

* పొగతాగే అలవాటుంటే మానెయ్యాలి.

* మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవాలి.

* ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకు ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులు ఉపయోగపడతాయి.

* అప్పుడప్పుడు రక్తపోటును పరీక్షించుకోవాలి. మందులు వేసుకుంటున్నా తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని