కాన్పు తర్వాత దిగులు

నవ మాసాలు గర్భాన్ని మోసి, ఎప్పుడెప్పుడు బిడ్డను చేతుల్లోకి తీసుకుంటానా ఎదురుచూసిన తల్లికి  కాన్పు కన్నా మించిన సంబరం ఏముంటుంది? ఆమే కాదు.. ఇంటిల్లిపాదీ మనసు ఆనందంతో పరవశిస్తుంది. అదేంటో.. కొందరికి అదే కాన్పు గుబులు పుట్టిస్తుంది. దీన్నుంచి తేరుకోకపోతే నిరాశా నిస్పృహల్లోకీ విసిరేస్తుంది.....

Published : 01 Feb 2022 00:45 IST

పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌

నవ మాసాలు గర్భాన్ని మోసి, ఎప్పుడెప్పుడు బిడ్డను చేతుల్లోకి తీసుకుంటానా ఎదురుచూసిన తల్లికి  కాన్పు కన్నా మించిన సంబరం ఏముంటుంది? ఆమే కాదు.. ఇంటిల్లిపాదీ మనసు ఆనందంతో పరవశిస్తుంది. అదేంటో.. కొందరికి అదే కాన్పు గుబులు పుట్టిస్తుంది. దీన్నుంచి తేరుకోకపోతే నిరాశా నిస్పృహల్లోకీ విసిరేస్తుంది. మనసులో తీవ్ర కల్లోలం రేసి ప్రసవానంతర కుంగుబాటుకూ (పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌) దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే తల్లికి, బిడ్డకు..  ఇద్దరికీ చేటు చేస్తుంది.

కాన్పు అవుతున్న సమయంలో, ఆ తర్వాతా తల్లి శరీరం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఒకవైపు దీన్నుంచి కోలుకోవటానికి ప్రయత్నిస్తూనే.. మరోవైపు బిడ్డ ఆలనా పాలనా ఎలా అన్న ఆలోచనలతో మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. అదే సమయంలో ఒంట్లో హార్మోన్ల మార్పులూ జరుగుతుంటాయి. గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల మోతాదులు పదింతలు ఎక్కువవుతాయి. కాన్పు తర్వాత ఇవి చాలా వేగంగా పడిపోతూ వస్తాయి. మూడో రోజు నాటికే గర్భధారణ ముందు స్థితికి చేరుకుంటాయి. ఉత్సాహం తగ్గటం, అలసట, నిరాశ వంటి భావనలు కలుగుతాయి. ఇలా శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా తలెత్తే మార్పులు ప్రసవానంతర జీవితం మీద బాగా ప్రభావం చూపుతాయి. ఇలాంటివన్నీ సహజంగానే ఒకరకమైన దిగులుకు దారితీస్తుంటాయి. దీన్ని కాన్పు అనంతర దిగులు (పోస్ట్‌పార్టమ్‌/బేబీ బ్లూస్‌) అంటారు. దాదాపు 80-90% మంది బాలింతలు దీన్ని ఎదుర్కొనేవారు. ఇందులో ఒకరకమైన విచారం, దిగులు, భయం, బెంగ, నిద్ర పట్టకపోవటం, చిరాకు, అస్థిమితం వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. కొందరు అకారణంగా భయపడొచ్చు, ఏడవచ్చు. త్వరతర్వగా అలసిపోతుండొచ్చు. బిడ్డను తాను సరిగా చూసుకోలేమోననీ బాధపడొచ్చు. అయితే ఈ ప్రసవానంతర దిగులు ప్రమాదకరమైందేమీ కాదు. ఎక్కువకాలం ఉండేదీ కాదు. ఈ సమయంలో పెద్దవాళ్లు, కుటుంబసభ్యులు తోడుగా ఉండి భరోసా, ధైర్యం కల్పిస్తే నాలుగైదు రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి. కొందరికి ఒకట్రెండు వారాల వరకూ ఉండొచ్చు. కొందరికి కాన్పుకు ముందే.. రెండో, మూడో త్రైమాసికంలోనే కుంగుబాటు మొదలవ్వచ్చు. బాధ, బెంగ, నిద్ర పట్టకపోవటం వంటి లక్షణాలు కనిపించొచ్చు. ఇవి నెమ్మదిగా పెరుగుతూ ప్రసవం తర్వాత మరింత ఎక్కువ కావొచ్చు. జాగ్రత్తగా గమనిస్తే కాన్పుకు ముందే దీన్ని పట్టుకోవచ్చు.  

దిగులు తీవ్రమైతే కుంగుబాటు
కాన్పు తర్వాత దిగులు నుంచి చాలామంది కోలుకుంటారు గానీ కొందరికి విడవకుండా వేధిస్తూ వస్తుంది. కుంగుబాటుకు దారితీస్తుంది. దీన్నే పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ అంటారు. ఇది ప్రసవం తర్వాత 4-6 వారాల్లో మొదలవుతుంటుంది. ఇది మానసిక సమస్య. బాలింతల్లో సుమారు 10% మందిలో దీన్ని చూస్తుంటాం. ఇందులో బాధ, విచారం తీవ్రంగా ఉంటాయి. తమ మీద, బిడ్డ మీద శ్రద్ధ తగ్గుతుంది. ఎప్పుడూ ఏడవాలని అనిపిస్తుంటుంది. ఏ పని చేయటానికి ఓపిక లేకపోవటం, దేని మీదా ఆసక్తి లేకపోవటం, దేన్నీ ఆనందించలేకపోవటం, నిద్ర పట్టకపోవటం, ఆకలి వేయకపోవటం వంటివీ వేధిస్తుంటాయి. నిర్ణయాలు తీసుకోవటంలోనూ ఇబ్బంది పడుతుంటారు. సమస్య మరీ తీవ్రమైతే జీవితమే వ్యర్థమని అనిపించొచ్చు. ‘నన్ను నేనే చూసుకోలేకపోతున్నాను. ఇక బిడ్డనేం చూసుకుంటాను’ అనే నిరాశలో కూరుకుపోవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలూ పుట్టుకురావొచ్చు. బిడ్డకూ హాని చేయాలని అనుకోవచ్చు.

ఎందుకొస్తుంది?
ప్రసవానంతర కుంగుబాటు విషయంలో తమను తాము నిందించుకొని ప్రయోజనం లేదు. ఇదొక మానసిక సమస్యని తెలుసుకోవాలి. దీనికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు.

* కొందరిలో వంశపారంపర్యంగా రావొచ్చు. అమ్మ, అమ్మ తరపు తోబుట్టువుల వంటివారు ఇంతకుముందు దీని బారినపడి ఉన్నట్టయితే వచ్చే అవకాశముంది.

* ఒకవేళ గర్భం ధరించటానికి ముందు నుంచే కుంగుబాటు ఉన్నట్టయితే కాన్పు తర్వాత మళ్లీ రావొచ్చు. గతంలో ప్రసవాంతర కుంగుబాటుకు లోనైనా మున్ముందు కాన్పుల తర్వాతా తలెత్తొచ్చు.

* ఉద్యోగం కోల్పోవటం, ఏవైనా జబ్బులతో బాధపడటం వంటి తీవ్ర ఒత్తిడికి గురిచేసే పరిస్థితులూ కారణం కావచ్చు.

* కుటుంబ తోడ్పాటు లేకపోవటం, ఒంటరిగా జీవించటం, దాంపత్య జీవితంలో ఇబ్బందుల వంటివీ కారణం కావొచ్చు.

భయమొద్దు- చికిత్స ఉంది
ప్రసవానంతర కుంగుబాటుకు మంచి చికిత్సలు, సురక్షితమైన మందులు అందుబాటులో ఉన్నాయి. దీనికి కుంగుబాటును తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి. లక్షణాల ఆధారంగా కుంగుబాటు తీవ్రతను అంచనా వేసి వీటిని సూచిస్తారు. బిడ్డకు ఏమైనా అవుతుందేమోనని కొందరు మందులు వేసుకోవటానికి భయపడుతుంటారు. ఇది తగదు. తల్లి పాల నుంచి బిడ్డకు మందులు చేరుకోవటమనేది చాలా తక్కువ. మందులు వేసుకోకపోతేనే ఎక్కువ హాని జరుగుతుందని తెలుసుకోవాలి. తల్లిని, బిడ్డను గమనిస్తూ సరైన మోతాదులో మందులు వాడుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సమయానికి చికిత్స తీసుకుంటే సమస్యను అంతటితోనే ఆపేయొచ్చు. కుంగుబాటు నుంచి బయటపడితే తల్లి, బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. తల్లి ఆరోగ్యమే కాదు, బిడ్డ ఆరోగ్యమూ మెరుగవుతుంది. తల్లి ఆనందంతో, సంతోషంతో ఉంటే బిడ్డ ఆరోగ్యమూ పుంజుకుంటుంది.

కౌన్సెలింగ్‌ కూడా ముఖ్యమే: మందులతో పాటు కౌన్సెలింగ్‌ తీసుకోవటం ఎంతగానో మేలు చేస్తుంది. దీన్నే కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ అంటారు. ఇందులో ప్రతికూల ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలి? రోజువారీ పనులు ఎలా చేసుకోవాలి? బిడ్డను ఎలా చూసుకోవాలి? అనేవి నేర్పిస్తారు. తల్లితో పాటు కుటుంబసభ్యులకూ కౌన్సెలింగ్‌ ఇస్తారు.

కుటుంబం తోడ్పాటు అవసరం
మన కుటుంబాల్లో గర్భిణుల మీద చాలా శ్రద్ధ పెడతారు. కానీ కాన్పయ్యాక అదంతా బిడ్డ మీదికి మళ్లుతుంది. దీంతో తల్లి భావోద్వేగాలను పెద్దగా పట్టించుకోరు. ఈ క్రమంలో కుంగుబాటు లక్షణాలను విస్మరించే అవకాశముంది. కాబట్టి తల్లినీ ఓ కంట కనిపెట్టుకొని ఉండటం ఎంతైనా అవసరం. కుంగుబాటుతో సతమతమవుతున్నప్పుడు తల్లి బిడ్డ మధ్య అనుబంధం అంతగా ఏర్పడదు. బిడ్డను సరిగా చూసుకోకపోవచ్చు. సమయానికి పాలు పట్టకపోవచ్చు. దీంతో బిడ్డ ఆరోగ్యమూ క్షీణిస్తుంది. పెద్దవాళ్లు తోడుగా లేకపోతే ఇదింకాస్త ఎక్కువవుతుంది.

* కాన్పయ్యాక దిగులుగా, భయంగా ఉన్నట్టు అనిపిస్తుంటే కుటుంబ సభ్యులకు వీటి గురించి చెప్పటం చాలా ముఖ్యం. దీంతో బిడ్డ అవసరాలను కుటుంబ సభ్యులు, పెద్దవాళ్లు చూసుకోవటానికి వీలుంటుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. తగినంత ప్రశాంతత లభిస్తుంది. మనసు కుదుటపడుతుంది.

* కుటుంబసభ్యులు కూడా తల్లి చెప్పిన విషయాలను అర్థం చేసుకోవాలి. కాన్పు తర్వాత అందరికీ ఎదురయ్యేదే అని కొట్టిపారేయటం తగదు. తల్లికి దన్నుగా ఉండాలి. మానసికంగా భరోసా కల్పించాలి. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలి. రాత్రి సరిగా నిద్రపోనట్టయితే ‘బిడ్డను మేం చూసుకుంటాం. నువ్వు కాసేపు హాయిగా నిద్రపో’ అని సముదాయించొచ్చు. ఇలాంటి తోడ్పాటు లభిస్తే తల్లికి చాలా హాయిగా ఉంటుంది. బిడ్డను చూసుకోవటానికి ఒకరు ఉన్నారనే ధైర్యం కలుగుతుంది. అమ్మనో, అత్తనో, అమ్మమ్మనో.. ఎవరో ఒకరు తోడుగా ఉంటే ఆ ధైర్యమే వేరు. వారి అనుభవాలనూ చెబుతుంటే ఇంకాస్త ధైర్యం వస్తుంది. మనో నిబ్బరం పెరుగుతుంది.

* ప్రసవానంతర కుంగుబాటు తీవ్రమైతే ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదముంది. బిడ్డకూ హాని తలపెట్టే ప్రమాదముంది. అందువల్ల కోలుకునేంతవరకు తల్లిని, బిడ్డను నిరంతరం ఎవరో ఒకరు కనిపెట్టుకొని ఉండటం మంచిది.

* కాన్పు తర్వాత సహజంగానే తండ్రి బాధ్యత కూడా పెరుగుతుంది. తల్లి, బిడ్డ ఇద్దరి అవసరాలను చూసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో తల్లి కుంగుబాటుకు లోనైతే తండ్రి మీద ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. ఆందోళన ఎక్కువవుతుంది. తండ్రికీ కుంగుబాటు సమస్య మొదలవ్వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబసభ్యులు తండ్రికీ అండగా నిలవాలి.


తీవ్రమైతే భ్రాంతులు

ప్రసవానంతర కుంగుబాటుకు తగు చికిత్స తీసుకోకపోతే కొందరిలో సమస్య మరీ విషమించి భ్రాంతులకు లోనయ్యే స్థితికీ చేరుకుంటుంది. దీన్నే ‘పోస్ట్‌పార్టమ్‌ సైకోసిస్‌’ అంటారు. దీని బారినపడ్డవారికి భ్రాంతులు కలుగుతుంటాయి. చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా చెవిలో ఏవేవో మాటలు వినిపిస్తున్నట్టు భ్రమిస్తుంటారు. అనవసరమైన అనుమానాలూ వస్తుంటాయి. తన గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారనో, తన మీద ఎవరో కుట్ర చేస్తున్నారనో అని భావించొచ్చు. ఇవన్నీ అబద్ధమని, అలాంటివారెవరూ లేరని చెప్పినా నమ్మకపోవటం గమనార్హం. తమకు నిజంగానే మాటలు వినిపిస్తున్నాయనీ వాదిస్తుండొచ్చు.

* పోస్ట్‌పార్టమ్‌ సైకోసిస్‌ అత్యవసర సమస్య. వెంటనే చికిత్స ఆరంభించాలి. లేనిపోని అనుమానాలు, భ్రాంతులు కలుగుతున్నాయని గుర్తించినా, ఏం చెప్పినా వినకపోతున్నా, తీవ్రంగా కోపగించుకుంటున్నా ఏమాత్రం తాత్సారం చేయరాదు. ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి.


నిర్లక్ష్యం చేయొద్దు

ప్రసవానంతర కుంగుబాటును నిర్లక్ష్యం చేయొద్దు. సమస్య తీవ్రమైతే ప్రమాదకరంగా పరిణమించే అవకాశముంది. కాబట్టి దిగులు, విచారం, బాధ, నిరాశ, నిస్పృహల వంటివి రెండు వారాలు దాటినా తగ్గకపోతే వెంటనే అప్రమత్తం కావాలి. రోజువారీ పనులు చేసుకోవటానికి ఇబ్బంది పడుతున్నా, పరిస్థితులను తట్టుకోలేకపోతున్నా, ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నా, బిడ్డకూ హాని తలపెట్టే సూచనలు కనిపిస్తున్నా, రోజులో ఎక్కువసేపు తీవ్రమైన భయం, ఆందోళనలకు గురవుతున్నా తాత్సారం చేయరాదు. వెంటనే మానసిక నిపుణులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తున్నకొద్దీ లక్షణాలు పెరుగుతూ వస్తాయే తప్ప తగ్గవు. ఇది తల్లికి, బిడ్డకు ఇద్దరికీ మంచిది కాదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని