రక్త శక్తి!

రక్తహీనత సర్వ సాధారణ సమస్య. వయసు, జాతి, లింగభేదం తేడా లేదు. పసికందుల దగ్గర్నుంచి పండు ముదుసలి వరకూ.. ఎవరికైనా రావొచ్చు, ఎప్పుడైనా రావొచ్ఛు అయినా దీనిపై ఇప్పటికీ అవగాహన తక్కువే. కొందరిని ఇదేమీ పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్ఛు మందులకు త్వరగానూ స్పందించొచ్ఛు కానీ కొందరిని తీవ్రంగా వేధించొచ్ఛు చికిత్సకు లొంగకుండా ప్రాణాల మీదికీ తేవొచ్ఛు కాబట్టి రక్తహీనత (ఎనీమియా) గురించి తెలుసుకొని ఉండటం మంచిది.

Updated : 05 Jul 2022 07:13 IST

రక్తహీనత సర్వ సాధారణ సమస్య. వయసు, జాతి, లింగభేదం తేడా లేదు. పసికందుల దగ్గర్నుంచి పండు ముదుసలి వరకూ.. ఎవరికైనా రావొచ్చు, ఎప్పుడైనా రావొచ్ఛు అయినా దీనిపై ఇప్పటికీ అవగాహన తక్కువే. కొందరిని ఇదేమీ పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్ఛు మందులకు త్వరగానూ స్పందించొచ్చు. కానీ కొందరిని తీవ్రంగా వేధించొచ్ఛు చికిత్సకు లొంగకుండా ప్రాణాల మీదికీ తేవొచ్ఛు కాబట్టి రక్తహీనత (ఎనీమియా) గురించి తెలుసుకొని ఉండటం మంచిది.

కొద్దిసేపు పని చేయగానే నీరసం ముంచుకొస్తుంది. కాసేపు నడిస్తే ఆయాసం వచ్చేస్తుంది. ఏకాగ్రత కుదరదు. పని మీద శ్రద్ధా ఉండదు. చిరాకు, కోపం. ఇలాంటి వాటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. సరిగా తినకపోవటం వల్ల వచ్చిన బలహీనతగానో.. రాత్రి నిద్ర పట్టకపోవటంతో తలెత్తిన అలసటగానో భావిస్తుంటారు. లేదూ వయసు మీద పడినప్పుడు ఒకింత నిస్సత్తువ, ఆందోళన సహజమేననీ అనుకుంటుంటారు. రక్తహీనత ఇలాగే బురిడీ కొట్టిస్తుంది. దీని లక్షణాలు నెమ్మదిగా మొదలై, క్రమంగా తీవ్రమవుతూ రావటం.. శరీరం వీటికి అలవాటు పడటం వల్ల మామూలు ఇబ్బందులుగా పొరపడేలా చేస్తుంది. అందుకే ఎంతోమందికి రక్తహీనత ఉందన్న సంగతైనా తెలియదు. రోజురోజుకీ చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంటుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల ప్రకారం.. 2015-16లో మనదేశంలో 6 నెలల నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో 59 శాతం మంది రక్తహీనతతో బాధపడుతుండగా.. 2019-21లో వీరి సంఖ్య 67 శాతానికి ఎగబాకింది. మహిళల్లోనైతే ఇది 53 శాతం నుంచి 57 శాతానికి ఎగబాకింది. మన జీవన విధానం మెరుగుపడుతోందని, పోషకాహార స్థాయి పెరిగిందని సంతోషిస్తున్న తరుణంలో ఇది నిజంగా ఆందోళన కలిగించేదే. తాజా గ్లోబల్‌ న్యూట్రిషన్‌ నివేదిక సైతం ప్రపంచమంతా రక్తహీనత, పోషణలోపాన్ని ఎదుర్కొంటోందనే ఘోషిస్తోంది. రక్తహీనతతో రాన్రానూ శారీరక, మానసిక సామర్థ్యం తగ్గుతుంది. దీంతో చదువులు, ఉద్యోగాలు, పనుల్లో రాణించటమూ తగ్గుతుంది. రోగనిరోధకశక్తి తగ్గటం మూలంగా వివిధ జబ్బుల ముప్పూ పెరగొచ్ఛు గర్భిణులకు రక్తహీనత ఉంటే పిండం సరిగా ఎదగకపోవచ్చు, నెలలు నిండకముందే కాన్పు కావచ్ఛు పిల్లల్లో రక్తహీనత ఎదుగుదలను దెబ్బతీస్తుంది. ఇది జీవితాంతం ప్రభావం చూపుతుంది. కాబట్టి రక్తహీనతను తేలికగా తీసుకోవటానికి లేదు.


ఎందుకొస్తుంది?

ఎముకమజ్జలోంచి తగినన్ని ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కాకపోవటం, ఉత్పత్తి అయినా త్వరగా క్షీణించటం, లేదూ రక్తం కోల్పోవటం.. రక్తహీనతకు మూలం ఇవే. రకరకాల సమస్యలు, కారణాలు దీనికి దోహదం చేస్తుంటాయి. జన్యుపరంగా పుట్టుకతో తలెత్తే సమస్యలూ కారణం కావొచ్ఛు కొన్నిసార్లు ఎలాంటి కారణమూ ఉండకపోవచ్చు.

తక్కువగా ఉత్పత్తి కావటం: మంచి ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు, హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి కావటానికి ఐరన్‌, విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ సి వంటి పోషకాలు అవసరం. కొన్ని ఖనిజాలు, ప్రొటీన్‌ సైతం ఇందుకు తోడ్పడతాయి. హార్మోన్లు.. ముఖ్యంగా ఎర్ర కణాల ఉత్పత్తిని పెంచే ఎరిత్రోపాయిటిన్‌ సమతులంగానూ ఉండాలి. మంచి పోషకాహారం తినకపోతే ఐరన్‌, విటమిన్ల వంటి పోషకాలు లోపిస్తాయి. దీంతో ఎర్ర రక్తకణాలు సరిగా ఉత్పత్తి కావు. మనదేశంలో రక్తహీనతకు ప్రధాన కారణం ఇదే. మహిళలు, బడికి వెళ్లే వయసు పిల్లలు, వృద్ధుల్లో సుమారు 60% మందిలో కనిపించేది ఇలాంటి రకం సమస్యే. కొందరిలో ఆహారం ద్వారా లభించే విటమిన్‌ బి12ను శరీరం సరిగా గ్రహించుకోదు. మధుమేహ చికిత్సలో ఇచ్చే మెట్‌ఫార్మిన్‌ మందుతోనూ విటమిన్‌ బి12ను గ్రహించుకునే సామర్థ్యం తగ్గొచ్ఛు క్యాన్సర్‌, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, ల్యూపస్‌, కిడ్నీ జబ్బుల వంటివీ ఎర్ర రక్తకణాల తయారీని దెబ్బతీయొచ్చు.

త్వరగా క్షీణించటం: ఎర్ర రక్తకణాలు సగటున 120 రోజుల వరకు జీవిస్తాయి. ఆ తర్వాత చనిపోతాయి. వీటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి పుట్టుకొస్తుంటాయి. ఇదంతా ఒక క్రమపద్ధతిలో సాగుతూ వస్తుంది. కానీ కొన్నిసార్లు ఎర్ర కణాలు ముందుగానే క్షీణిస్తుంటాయి. వీటిని భర్తీ చేయటానికి ఎముకమజ్జలోంచి తగినన్ని కణాలు తయారవ్వకపోవచ్చు. ఎర్ర కణాలు త్వరగా క్షీణించటానికి రకరకాల సమస్యలు దోహదం చేయొచ్ఛు ల్యూపస్‌ వంటి ఆటోఇమ్యూన్‌ జబ్బుల్లో పుట్టుకొచ్చే యాంటీబాడీలు రక్త కణాల మీద దాడి చేసి, త్వరగా క్షీణించేలా చేయొచ్ఛు హెపటైటిస్‌, మలేరియా వంటి ఇన్‌ఫెక్షన్లు.. ప్లీహం పెద్దగా అవ్వటం, కొన్నిరకాల మందుల వంటివీ ఇందుకు కారణం కావొచ్ఛు కొందరికి జన్యుపరంగా వచ్చే సికిల్‌సెల్‌, థలసీమియా వంటి జబ్బులతోనూ ఎర్ర కణాలు త్వరగా క్షీణించొచ్చు.

రక్తం కోల్పోవటం: రక్తహీనతకు మరో కారణం రక్తం పోవటం. రక్తం పోయినప్పుడు ఎర్ర కణాల సంఖ్యా తగ్గుతుంది. ఇది ఒంట్లో ఐరన్‌ మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తుంది. తగినంత ఐరన్‌ లేకపోతే ఎర్ర కణాల ఉత్పత్తీ తగ్గుతుంది. ఇదీ తిరిగి రక్తహీనతకు దారితీస్తుంది. పొట్టలో అల్సర్లు.. జీర్ణాశయంలో పెద్దపేగులో క్యాన్సర్లు గలవారికి లోలోపలే రక్తస్రావం కావొచ్చు. ఇది క్రమంగా రక్తహీనతకు దారితీస్తుంది. ఇటీవల పెద్దపేగులో క్యాన్సర్‌ ఎక్కువగానూ చూస్తున్నాం. కొన్నిసార్లు దీన్ని రక్తహీనతతోనే గుర్తిస్తుండటం గమనార్హం. మొలల సమస్యతో బాధపడేవారు అప్పుడప్పుడు రక్తం పడుతోందని చెబుతుంటారు. కానీ చాలాసార్లు తెలియకుండానే రోజూ కొద్దికొద్దిగా మలంలో రక్తం పోతుండొచ్ఛు దీంతో రక్తహీనత ముప్పు పెరుగుతుంది. మహిళల్లో కొందరికి మామూలు కన్నా ఎక్కువగా రుతుస్రావం కావొచ్చు. ఇదీ సమస్యను తెచ్చిపెట్టొచ్చు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడటం, కాన్పు, రక్తనాళాలు చిట్లటం, సర్జరీ చేసేటప్పుడు పెద్దఎత్తున రక్తస్రావం కావటంతోనూ ఎనీమియా తలెత్తొచ్చు. మనదగ్గర పిల్లల్లోనే కాదు, పెద్దవారిలోనూ పేగుల్లో కొంకి పురుగులు ఉంటుంటాయి. ఇవి రక్తాన్ని పీల్చుకొని జీవిస్తాయి. దీంతో రక్తం తగ్గిపోతుంది. క్రమంగా రక్తహీనత మొదలవుతుంది.


నిర్ధరణ ఎలా?

రక్తహీనత అనుమానిత లక్షణాలు సంపూర్ణ రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు, హిమోగ్లోబిన్‌ మోతాదుల వంటివి బయటపడతాయి. సాధారణంగా హిమోగ్లోబిన్‌ మగవారిలో సగటున 14.5 గ్రాములు, ఆడవారిలో 13.5 గ్రాములు ఉండాలి. ఇంతకన్నా తగ్గితే సమస్య ఉన్నట్టే. స్వల్పంగా తగ్గితే మామూలుగా, కాస్త ఎక్కువగా తగ్గితే మధ్యస్థంగా, 7 గ్రాముల కన్నా తగ్గితే తీవ్ర సమస్యగా భావిస్తారు. ఎర్ర రక్తకణాల పరీక్షలో సంఖ్యతో పాటు వాటి పరిమాణం, ఆకారం కూడా తెలుస్తాయి. దీంతో ఎర్ర కణాలు తక్కువగా ఉత్పత్తి కావటం, త్వరగా క్షీణించటం, రక్తం పోవటం వంటివేవైనా సమస్యకు కారణమవుతున్నాయా అనేదీ బయటపడుతుంది. రక్తహీనత ఉన్నట్టు తేలితే అది ఎలాంటి రకం? ఎంత తీవ్రంగా ఉంది? అనేవి తెలుసుకోవటానికి మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి.

* థలసీమియా, సికిల్‌సెల్‌, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, ల్యూపస్‌, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వంటి జబ్బులున్నాయేమో కూడా పరీక్షిస్తారు. ఎలాంటి కారణం కనిపించకపోతే ఎముకమజ్జ పరీక్ష చేయాల్సి ఉంటుంది. రక్తక్యాన్సర్‌, మైలోడిస్‌ప్లాస్టిక్‌ సిండ్రోమ్‌ (ఎండీఎస్‌), లింఫోమా వంటివి ఉంటే ఇందులో బయటపడుతుంది. ఆరోగ్యంగా ఉండి, ఆహారం బాగానే తీసుకుంటున్నా రక్తహీనత ఉన్నట్టయితే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పరీక్షలు చేయటం తప్పనిసరి. పాలిప్స్‌, క్యాన్సర్లు, అల్సర్ల వంటివి ఉంటే వీటిల్లో తెలుస్తాయి. స్టూల్‌ అకల్ట్‌ బ్లడ్‌ పరీక్ష ద్వారా మలంలో రక్తం పడటాన్ని గుర్తించొచ్చు.


ఏంటీ సమస్య?

ఒక్కమాటలో చెప్పాలంటే- రక్తంలో ఎర్ర రక్తకణాల మోతాదు తగ్గటం. రక్తంలో ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్‌లెట్లు.. ఇలా మూడు రకాల కణాలుంటాయి. రక్తంలో 40-45 శాతం వరకు ఉండేవి ఇవే. ఇవన్నీ ఎముక మజ్జ నుంచే పుట్టుకొస్తాయి. వీటిల్లో సింహభాగం ఆక్రమించేవి ఎర్ర రక్తకణాలే. ఇవి మధ్యలో కాస్త లోతుగా ఉన్న పళ్లెం (డిస్క్‌) మాదిరిగా ఉంటాయి. వీటికి ఈ ఆకారం చాలా ముఖ్యం. లేకపోతే త్వరగా క్షీణించే ప్రమాదముంది. ఎర్ర రక్తకణాలు చేసే ఏకైక పని హిమోగ్లోబిన్‌ అనే ప్రోటీన్‌ను ఆరోగ్యంగా ఉండేలా చూస్తూ, దీన్ని రక్తం ద్వారా వివిధ భాగాలకు చేరవేయటం. ఆక్సిజన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువుల మార్పిడిలో హిమోగ్లోబిన్‌ పాత్ర చాలా కీలకం. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను మోసుకెళ్లి, వివిధ అవయవాలకు చేరవేసేది ఇదే. అలాగే ఆయా భాగాల నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను మోసుకొచ్చి, ఊపిరితిత్తులకు చేరవేస్తుంది కూడా. ఇలా మన ప్రాణాలు నిలవటానికి తోడ్పడుతుంది. ఇంతటి కీలకమైన పనిలో పాలు పంచుకుంటాయి కాబట్టే ఎర్ర రక్తకణాల సంఖ్య ఏమాత్రం తగ్గినా శరీరం జావగారుతుంది. చిన్న చిన్న పనులకే చేతులెత్తేస్తుంది.


లక్షణాలు

రక్తహీనత తీవ్రత, ఎంత వేగంగా మొదలైందనే దాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా దీని లక్షణాలు క్రమంగా ముదురుతూ వస్తుంటాయి. ఇవి ఇతరత్రా జబ్బుల్లోనూ కనిపిస్తుంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం.

స్వల్ప రక్తహీనతలో- ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్ఛు కానీ కొందరిలో నీరసం, నిస్సత్తువ, చర్మం పాలిపోవటం, నాలుక తెల్లగా అవటం, కనురెప్ప లోపలి భాగం తెల్లగా అవటం, నోట్లో పుండ్లు, నాలుక మంట, పెదాల చివర్లు పగలటం, పెదాలు ఉబ్బటం, జుట్టు రాలటం, వెంట్రుకలు కళ తప్పటం, ఏకాగ్రత లోపించటం, చిరాకు, కోపం వంటివి కనిపించొచ్చు. తీవ్ర రక్తహీనతలోనూ ఇవి తలెత్తొచ్చు మరింత స్పష్టంగానూ ఉండొచ్చు.

రక్తహీనత ముదురుతున్నకొద్దీ- తల తేలిపోవటం, దాహం పెరగటం, చెమటలు పట్టటం, బలహీనత, నాడి వేగంగా కొట్టుకోవటం, శ్వాస వేగంగా తీసుకోవటం వంటివి పొడసూపుతాయి.

తీవ్ర రక్తహీనతలో- వ్యాయామం చేస్తున్నప్పుడు పిక్కలు పట్టేయటం, ఆయాసం, మెదడు దెబ్బతినటం వంటివీ ఉండొచ్చు. ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గటం గుండె మీదా విపరీత ప్రభావం చూపుతుంది. ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్‌ చేయటానికి గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా గుండె లయ తప్పటం, గుండె కొట్టుకునేటప్పుడు అసాధారణ చప్పుడు రావటం, గుండె పెద్దగా అవ్వటం, గుండె వైఫల్యమూ సంభవించొచ్చు.


చికిత్స తేలికే!

మంచి విషయం ఏంటంటే- రక్తహీనతను తేలికగా నయం చేసే వీలుండటం. మనదేశంలో ఎక్కువగా కనిపించేది పోషకాల లోపంతో తలెత్తే రక్తహీనతే. ముఖ్యంగా ఐరన్‌, విటమిన్‌ బి12 లోపంతో వచ్చేదే ఎక్కువ. ఎందుకంటే మనదగ్గర శాకాహారం ఎక్కువగా తింటాం. మాంసాహారులు కూడా వారంలో ఒకసారో, రెండుసార్లో మాంసం తింటారు. అందువల్ల విటమిన్‌ బి12 లోపం ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి హిమోగ్లోబిన్‌ పరీక్ష చేయించుకోవాలి. ఇది తక్కువగా ఉంటే కారణమేంటన్నది చూసుకోవాలి. తొలిదశలోనే చికిత్స తీసుకుంటే బాగా నయమవుతుంది. అనర్థాలను ముందే తప్పించుకోవచ్చు. పోషకాల లోపాన్ని సరిచేస్తే రక్తహీనత కూడా తగ్గుతుంది. ఇందుకు మాత్రలు మాత్రమే కాకుండా ఇంజెక్షన్లు అవసరమవ్వచ్చు. అలాగే ఆయా పోషకాలు లభించే ఆహారం తీసుకోవాలి. ఐరన్‌ దండిగా ఉండే ఆకుకూరలు, పప్పులు, బెల్లం.. విటమిన్‌ బి12తో కూడిన మాంసం, పాలు, పెరుగు వంటివి ఎక్కువగా తినాలి. బత్తాయి, నారింజ, జామ, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటి పండ్లు.. నిమ్మ, ఉసిరి, టమోటా వంటి వాటిల్లో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. ఆకుకూరలు, బఠానీలు, వేరుశనగ, దంపుడు బియ్యంతో ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది. ఆహారం, మాత్రలతోనే పోషకాల లోపంతో తలెత్తిన రక్తహీనత కుదురుకుంటుంది.

* కిడ్నీ వైఫల్యం బాధితుల్లో ఎరిత్రోపాయిటిన్‌ హార్మోన్‌ తగ్గితే ఎరిత్రోపాయిటిన్‌ ఇంజెక్షన్లు అవసరమవుతాయి.

* ఎముక మజ్జ దెబ్బతినటం వల్ల తలెత్తే ఎప్లాస్టిక్‌ ఎనీమియా తీవ్రమైన సమస్య. దీనికి రక్తం ఎక్కించటం, మందులు, ఎముక మజ్జ మార్పిడి వంటి చికిత్సలు చేయాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు