ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటు తీవ్రతను తెలిపే పరీక్ష!

ఊపిరితిత్తుల ధమనుల్లో అధిక రక్తపోటు (పల్మనరీ హైపర్‌టెన్షన్‌) అరుదైన సమస్యే కావొచ్చు. కానీ ప్రాణాల మీదికి తెస్తుంది. దీని తీవ్రతను, బతికి బట్ట కట్టే అవకాశాలను గుర్తించటానికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు కొత్త రక్త పరీక్షను గుర్తించారు.

Published : 30 Aug 2022 01:13 IST

పిరితిత్తుల ధమనుల్లో అధిక రక్తపోటు (పల్మనరీ హైపర్‌టెన్షన్‌) అరుదైన సమస్యే కావొచ్చు. కానీ ప్రాణాల మీదికి తెస్తుంది. దీని తీవ్రతను, బతికి బట్ట కట్టే అవకాశాలను గుర్తించటానికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు కొత్త రక్త పరీక్షను గుర్తించారు. సంప్రదాయ పరీక్షల కన్నా ఇది మరింత మెరుగ్గా ఫలితం చూపుతున్నట్టు ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి. దెబ్బతిన్న కణాల నుంచి వెలువడే డీఎన్‌ఏ పోచలను గుర్తించటం ఈ పరీక్షలో కీలకాంశం. ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటు గలవారిలో కణ రహిత డీఎన్‌ఏ పోచల మోతాదులు పెరుగుతాయి. జబ్బు తీవ్రమైనకొద్దీ ఇవీ ఎక్కువ అవుతాయి. అందువల్ల కొత్త రక్త పరీక్ష ఈ జబ్బు తీవ్రతను గుర్తించటానికి తేలికైన మార్గంగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు. పల్మనరీ హైపర్‌టెన్షన్‌ మూలంగా ఊపిరితిత్తుల్లో సూక్ష్మ రక్తనాళాల లోపలి మార్గం క్రమంగా కుంచించుకుపోతుంది. అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో గుండె కుడివైపు భాగం మీద ఎక్కువ భారం పడుతుంది. గుండె విఫలమై ప్రాణాపాయమూ సంభవించొచ్చు.  ప్రస్తుతం ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటు తీవ్రతను అంచనా వేయటానికి లక్షణాల ఆధారిత స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇది అన్నిసార్లూ కచ్చితంగా తీవ్రతను తెలియజేయలేకపోవచ్చు. ఊపిరితిత్తుల్లోకి గొట్టాన్ని పంపించి రక్తపోటును కొలుస్తుంటారు కూడా. దీని కోసం కోత పెట్టాల్సి ఉంటుంది. కొత్త పరీక్ష అందుబాటులోకి వస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయని, కచ్చితంగా జబ్బు తీవ్రతను తెలుసుకునే వీలుంటుందని ఆశిస్తున్నారు. అధునాతన కణ రహిత డీఎన్‌ఏ పరీక్ష పద్ధతి ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతోంది. అవయవ మార్పిడి చేయించుకున్నవారిలో శరీరం వాటిని తిరస్కరించే అవకాశాన్ని తొలిదశలోనే గుర్తించటానికి దీన్ని వాడుకుంటున్నారు. మున్ముందు ఇది చాలా అవసరాలకు ఉపయోగపడగలదని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని