బరువుకు మందు కోత

ఏదైనా అదుపులో ఉంటేనే ఆరోగ్యం! బరువుకు ఇది అతికినట్టు సరిపోతుంది. అధిక బరువు, ఊబకాయం రకరకాల జబ్బులకు దారితీస్తాయి మరి. నిజానికి ఊబకాయమే ప్రత్యేకించి ఒక జబ్బు. బరువు తగ్గటం అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి తిండి తగ్గించటం, వ్యాయామం చేయటం.

Published : 22 Nov 2022 00:03 IST

ఏదైనా అదుపులో ఉంటేనే ఆరోగ్యం! బరువుకు ఇది అతికినట్టు సరిపోతుంది. అధిక బరువు, ఊబకాయం రకరకాల జబ్బులకు దారితీస్తాయి మరి. నిజానికి ఊబకాయమే ప్రత్యేకించి ఒక జబ్బు. బరువు తగ్గటం అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి తిండి తగ్గించటం, వ్యాయామం చేయటం. ఇవీ ఉపయోగపడకపోతే? చికిత్సలు ఆదుకుంటున్నాయి. అయితే బేరియాట్రిక్‌ ఎండోస్కోపీ పద్ధతులు, శస్త్రచికిత్సలు అందరికీ కుదరకపోవచ్చు. కొందరు వీటిని ఇష్టపడకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బరువును తగ్గించే మందులతో ప్రయోజనం ఉంటోందని, అవసరమైనవారికి వీటిని వాడుకోవటం ఎంతైనా మంచిదని అమెరికన్‌ గ్యాస్ట్రోఎంటెరోలాజికల్‌ అసోసియేషన్‌ (ఏజీఏ) తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది.

కప్పుడు లావుగా, బొద్దుగా ఉంటే సంపన్న కుటుంబానికి చెందినవారని, మంచి ఆహారం తింటుంటారని అనుకునేవారు. కానీ ఊబకాయంతో తలెత్తే దుష్ప్రభావాలపై అవగాహన పెరగటంతో ఇప్పుడు దీన్ని ఒక సమస్యగా గుర్తిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఊబకాయాన్ని జబ్బుగా గుర్తించి, ప్రకటించింది. ఊబకాయం దీర్ఘకాల సమస్య. ఇది తల నుంచి పాదాల వరకూ.. శరీరంలోని ప్రతి అవయవాన్నీ ఏదో ఒక స్థాయిలో ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఇది మోసుకొచ్చే జబ్బులు అన్నీ ఇన్నీ కావు. గురక.. నిద్రలో కాసేపు శ్వాస ఆగటం.. ముక్కు ఇన్‌ఫెక్షన్లు, శ్వాసగదుల్లో వాపు.. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గటం.. కాలేయానికి కొవ్వు పట్టటం.. క్లోమగ్రంథి వాపు.. శృంగారంపై ఆసక్తి తగ్గటం, స్తంభనలోపం.. ఎముకలు గుల్లబారటం, కీళ్ల నొప్పులు.. పాదాల మంటలు, నొప్పుల వంటి సమస్యలెన్నో చుట్టుముడుతుంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌, గ్లూకోజు మోతాదులు పెరగటం వల్ల అధిక రక్తపోటు, గుండెజబ్బులు, మధుమేహం ముప్పులూ పెరుగుతాయి. క్యాన్సర్లు.. ముఖ్యంగా మలద్వార క్యాన్సర్‌ వచ్చే అవకాశమూ ఎక్కువవుతుంది. కాబట్టే అధిక బరువు, ఊబకాయానికి చికిత్స అనివార్యంగా మారింది. బరువు పెరగటంలో కేలరీలదే కీలకపాత్ర. ఆహారం ద్వారా లభించే కేలరీలకు తగినట్టుగా శరీరం వాటిని ఖర్చు చేసుకోలేకపోతే.. అవన్నీ ఒంట్లో కొవ్వుగా స్థిరపడిపోయి బరువు పెరిగేలా చేస్తాయి. బరువును తగ్గించుకోవటానికి జీవనశైలి మార్పులే ప్రధానం. మితగా ఆహారం తినటం.. వ్యాయామం, శారీరక శ్రమ ఎక్కువగా చేయటం చాలా ముఖ్యం. దీంతో తీసుకునే కేలరీలు తగ్గుతాయి. ఖర్చయ్యే కేలరీలు పెరుగుతాయి. ఫలితంగా కేలరీల లోపం ఏర్పడి బరువు తగ్గటానికి వీలవుతుంది. అయితే జీవనశైలి మార్పులు చాలామందికి పెద్దగా ఉపయోగపడటం లేదని.. నూటికి పది కన్నా తక్కువ మందిలోనే ఫలితం చూపుతున్నాయని ప్రఖ్యాత న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. ఆహారం, వ్యాయామాల మీద ఎక్కువ శ్రద్ధ చూపే దేశాల్లోనే అలా ఉంటే మనదగ్గర పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఊబకాయ చికిత్సలో మందుల వాడకానికి ప్రాధాన్యం పెరుగుతోంది.


మధుమేహం మందుల ఆసరా

నిజానికి ఊబకాయ చికిత్సలో మందుల వాడకం కొత్తేమీ కాదు. పది, పదిహేను ఏళ్లుగా వాడుతూనే వస్తున్నాం. అయితే వీటితో దుష్ప్రభావాలు ఎక్కువ. ఉదాహరణకు- ఆర్లిస్టాట్‌తో జిగట విరేచనాలు, వాంతి, వికారం వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. మానసిక చికిత్సలో వాడే కొన్ని మందులు ఆకలిని తగ్గించటం ద్వారా బరువు తగ్గేలా చేస్తాయి. కానీ నిద్రమత్తు వంటి దుష్ప్రభావాలకు దారితీస్తాయి. ఇక్కడే మధుమేహ చికిత్సలో వాడే జీఎల్‌పీ1 ఎనలాగ్‌ రకం మందులు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. చిన్నపేగుల మొదటిభాగం ఆంత్రమూలం (డ్యుయోడినం) గోడల్లో ఇంట్రికిన్స్‌, యాంటి ఇంక్రిటిన్స్‌ ఉంటాయి. ఇవి సమతులంగా ఉంటే రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉంటుంది. కొవ్వు పదార్థాల వంటివి ఎక్కువగా తిన్నప్పుడు యాంటీ ఇంక్రిటిన్స్‌ తగ్గి, ఇంక్రిటిన్స్‌ పెరుగుతాయి. ఫలితంగా ఇన్సులిన్‌ నిరోధకత తలెత్తుతుంది. ఇది మధుమేహం, ఊబకాయానికి దారితీస్తుంది. ఇదే పరిశోధకులను ఆకర్షించింది. ఆంత్రమూలంలోని జీఎల్‌పీ1, జీఐపీ1 హార్మోన్లపై పరిశోధనలు ఊపందుకున్నాయి. ఈ హార్మోన్లు రక్తంలో గ్లూకోజు మోతాదులను నియంత్రించటంలో పాలు పంచుకుంటాయి. సెమాగ్లుటైడ్‌, లిరాగ్లుటైడ్‌ వంటి మధుమేహ మందులు వీటి పనితీరును మార్చి, రక్తంలో గ్లూకోజు మోతాదులను నియంత్రిస్తాయి. ఇవి మధుమేహంతో పాటు బరువు తగ్గటానికీ తోడ్పడుతున్నట్టు తేలటం గమనార్హం. మధుమేహం లేనివారిలోనూ బరువు తగ్గిస్తుండటం విశేషం. దీంతో ఊబకాయ చికిత్సకు వాడుకోవటమూ మొదలైంది. అయితే అవసరమైనవారూ వీటిని అంతగా వాడుకోవటం లేదు. మందులపై అవగాహన లేకపోవటం, విస్తృతంగా అందుబాటులో లేకపోవటమే దీనికి కారణం. వీటిని దృష్టిలో పెట్టుకునే ఏజీఏ మార్గదర్శకాలను జారీచేసింది. బరువును తగ్గించే సెమాగ్లుటైడ్‌, లిరాగ్లుటైడ్‌, ఫెంటర్మైన్‌-టోపిరమేట్‌ ఈఆర్‌, నైట్రెక్జోన్‌-బుప్రోపియాన్‌ ఈఆర్‌, ఓర్లిస్టాట్‌, ఫెంటర్మైన్‌, డైథీల్‌ప్రోపియాన్‌ వంటి మందులను వాడుకోవాల్సిన విధానాన్ని నిర్దేశించింది. జీవనశైలి మార్పులతో పాటు వీటిని వాడుకోవాలని సూచించింది.


ఎవరికీ మందులు?

సాధారణంగా శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఊబకాయాన్ని నిర్ధరిస్తారు. ఇది 27.5 నుంచి 30 లోపుంటే అధిక బరువుగా.. 30 నుంచి 35 లోపుంటే ఒకటో దశ ఊబకాయంగా పరిగణిస్తారు. బీఎంఐ 35-40- రెండో దశ.. 40 కన్నా ఎక్కువ- మూడో దశ ఊబకాయంగా లెక్కిస్తారు. బరువుతో ముడిపడిన సమస్యలతో బాధపడుతూ.. ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తున్నా బరువు తగ్గని అధిక బరువు, ఒకటో దశ ఊబకాయం (బీఎంఐ 35 వరకు ) గలవారికి మందులు వాడుకోవాలన్నది ఏజీఏ సిఫారసు. జీవనశైలి మార్పులకు ఇవి అదనమే గానీ ఒక్క మందులతోనే బరువు తగ్గుతుందని అనుకోరాదు.
* బీఎంఐ 35 కన్నా ఎక్కువ గలవారికివి అంతగా ఉపయోగపడవు. వీరికి మందులతో పాటు బేరియాట్రిక్‌ పద్ధతులు, బేరియాట్రిక్‌ సర్జరీలతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటి చికిత్సలకు భయపడేవారికి.. వీటిని చేయించుకొని, తిండి తగ్గించుకోలేనివారికి బరువు తగ్గించే మందులతో ప్రయోజనం ఉంటుంది. ఇవి ఆంత్రమూలంలోని హార్మోన్ల పనితీరును మార్చటమే కాదు.. తిన్న ఆహారాన్ని ఎక్కువసేపు జీర్ణాశయంలో ఉండేలా చేస్తాయి కూడా. అందువల్ల ఆహారం త్వరగా పేగుల్లోకి వెళ్లదు. ఇలా ఆకలిని తగ్గిస్తాయి. తినటమూ తగ్గుతుంది.
* ఆహారం మామూలుగా తినేవారూ ఊబకాయం బారినపడొచ్చు. ముఖ్యంగా ఆడవారిలో నెలసరి నిలిచే సమయంలో హార్మోన్ల మోతాదులు అస్తవ్యస్తం కావటం వల్ల బరువు పెరిగే అవకాశముంది. మందుల విషయంలో ఇలాంటి వాటినీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నవారికి మందులు అంతగా పనిచేయవు.

దుష్ప్రభావాలుంటాయా?

బరువు తగ్గించే మందులతో కొందరికి వాంతి, వికారం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. మలబద్ధకం, తూలటం వంటి ఇబ్బందులూ ఉండొచ్చు. ఇది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. వాంతి, వికారం వంటివి ఎక్కువగా ఉంటే కొద్దిరోజుల పాటు ఆపేయటం మంచిది. వాంతులు ఎక్కువైతే వృద్ధుల్లో లవణాలు, ఖనిజాల సమతుల్యత దెబ్బతిని ఇబ్బందులు తలెత్తొచ్చు.
* మందులకు అలవడుతున్నకొద్దీ చాలామందిలో దుష్ప్రభావాలు తగ్గిపోతుంటాయి. అందువల్ల తక్కువ మోతాదులో ఆరంభించి, శరీరం వాటికి అలవడిన తర్వాత మోతాదు పెంచుకుంటూ వస్తారు. ఎవరికైనా మందు పడకపోతే ఆపేస్తారు.
* అరుదుగా కొందరికి క్లోమగ్రంథి వాపు, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదముంది. కాబట్టి ఇలాంటి జబ్బులేవైనా ఉన్నాయేమో పరీక్షించాకే మందులను ఆరంభించాల్సి ఉంటుంది. డాక్టర్ల పర్యవేక్షణలోనే వీటిని వాడుకోవాలి.


బరువెందుకు తగ్గటం లేదు?

ఆహార నియమాలు పాటిస్తున్నాం, వ్యాయామమూ చేస్తున్నాం. అయినా బరువు తగ్గటం లేదని చాలామంది వాపోతుంటారు. వ్యాయామం, ఆహార నియమాలను ఎంత చక్కగా ఆచరిస్తున్నామనేది ముఖ్యం. పదార్థాల విషయంలో కేలరీలనూ దృష్టిలో పెట్టుకోవాలి. అన్నింటిలోనూ కేలరీలు ఒకేలా ఉండవు. ఉదాహరణకు ఒక చాక్లెట్‌ తిన్నారనుకోండి. భోజనంతో సమానమైన కేలరీలు అందుతాయి. అలాగే వేడుకలు, విందుల్లో ఎక్కువగా తినటం సరికాదు. రెండోది- శరీర స్వభావం. సహజంగానే కొందరికి ఎముక బరువు ఎక్కువగా ఉంటుంది. వీరిలో కొవ్వు, కండరాల మోతాదు తక్కువున్నా బరువు ఎక్కువే ఉంటుంది. కొవ్వు ఎక్కువగా ఉన్నవారిలో మామూలుగానే బరువు ఎక్కువగా ఉంటుంది. బాడీ కంపోజిషన్‌ విశ్లేషణ పరికరం ద్వారా వీటిని తెలుసుకోవచ్చు. దీంతో ఉజ్జాయింపుగా శరీరంలో కొవ్వు, కండరాలు, ఎముక మోతాదులను అంచనా వేయొచ్చు.


మాత్రల రూపంలోనూ..

బరువు తగ్గించే మందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సెమాగ్లుటైడ్‌ గురించే. దీన్ని ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. వారానికి ఒకసారే తీసుకునే ఇంజెక్షన్‌ కూడా ఉంది. ఇప్పుడు మనదేశంలో ఇది మాత్రల రూపంలోనూ అందుబాటులోకి రావటం గమనార్హం. దీన్ని రోజూ వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువెక్కువ ఆహారం తినేవారికిది బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువ. బరువు ఎంతకీ తగ్గనివారికి దీంతో ఒనగూరే ప్రయోజనాలతో పోలిస్తే ఖర్చు అంత ఎక్కువ కాదనే చెప్పుకోవచ్చు. లిరాగ్లుటైడ్‌నైతే ఇంజెక్షన్‌ రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఓర్లీస్టాట్‌ వంటి మాత్రలతో దుష్ప్రభావాలు కాస్త ఎక్కువగా ఉంటుండటం వల్ల మనదగ్గర పెద్దగా వాడటం లేదు.


తొలి చికిత్స- జీవనశైలి మార్పులే

బరువు తగ్గటానికి ముందుగా సూచించే చికిత్స జీవనశైలి మార్పులే. రోజుకు కనీసం గంట సేపు.. శరీరానికి చెమట పట్టేంతవరకు వ్యాయామాలు చేయాలి. ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు తగ్గించుకోవాలి. ప్రొటీన్‌ పెంచుకోవాలి. కిడ్నీజబ్బుల వంటివి గలవారు మాత్రం పోషకాహార నిపుణల సలహా మేరకు ఆహార నియమాలు పాటించాలి. జీవనశైలి మార్పులతో  ఫలితం కనిపించకపోతే మందులు, బేరియాట్రిక్‌ ఎండోస్కోపీ పద్ధతులు, శస్త్రచికిత్సల మార్గం ఎంచుకోవాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని