బాలల్లోనూ హై బీపీ.. భద్రం సుమా!

అధిక రక్తపోటు (హై బీపీ) అనగానే పెద్దవాళ్లే గుర్తుకొస్తారు. నిజమే. ఇది పెద్దవారిలోనే ఎక్కువ కావొచ్చు. అలాగని పిల్లల్లో ఉండకూడదనేమీ లేదు. కొందరికి వంశ పారంపర్యంగా.. కొందరికి ఇతరత్రా జబ్బులతో ఇది రావొచ్చు. కారణమేదైనా బాల రక్తపోటుపై నిర్లక్ష్యం తగదు. సకాలంలో గుర్తించి, చికిత్స చేయటం అత్యవసరం.

Updated : 24 Dec 2022 14:42 IST

అధిక రక్తపోటు (హై బీపీ) అనగానే పెద్దవాళ్లే గుర్తుకొస్తారు. నిజమే. ఇది పెద్దవారిలోనే ఎక్కువ కావొచ్చు. అలాగని పిల్లల్లో ఉండకూడదనేమీ లేదు. కొందరికి వంశ పారంపర్యంగా.. కొందరికి ఇతరత్రా జబ్బులతో ఇది రావొచ్చు. కారణమేదైనా బాల రక్తపోటుపై నిర్లక్ష్యం తగదు. సకాలంలో గుర్తించి, చికిత్స చేయటం అత్యవసరం. లేకపోతే తీవ్ర దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదముంది.

పిల్లలకా? అధిక రక్తపోటా? చాలామంది ఇలాగే ప్రశ్నిస్తుంటారు. ‘చాల్లే పెద్ద చెప్పొచ్చా’వని పెదవి విరుస్తుంటారు. పిల్లల్లో అధిక రక్తపోటుపై మనదగ్గర సరైన అవగాహన లేదనటానికి ఇలాంటి వ్యాఖ్యలే నిదర్శనం. దీని గురించి తెలియకపోవటానికి, నిర్లక్ష్యం చేయటానికి కారణాలు చాలానే ఉన్నాయి. పెద్దవాళ్లు ఎలాంటి సమస్యతో ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్లు విధిగా రక్తపోటునూ పరీక్షిస్తుంటారు. పిల్లల్లో ఇలాంటిది ఎక్కడా కనిపించదు. ఆ మాటకొస్తే వైద్య కేంద్రాల్లో పిల్లల రక్తపోటును కొలిచే సదుపాయాలే ఉండవు. ఒకవేళ ఉన్నా పిల్లలకు రక్తపోటు పరీక్ష చేయటం అంత తేలికైన పని కాదు. పిల్లలు ఒక దగ్గర కుదురుగా ఉండరు. చిన్న పిల్లలైతే డాక్టర్‌ను చూడగానే ఏడుపు లంకించుకోవచ్చు. వీరిని సముదాయించి, బీపీ పరీక్షకు ఒప్పించటానికి తల ప్రాణం తోకకు వచ్చినంత పనవుతుంది. దీంతో ఎందుకొచ్చిందిలే అనుకొని మిన్నకుండిపోతుంటారు. అంతేకాదు, అసలు బీపీ పరీక్ష ఎవరికి అవసరమనేది నిర్ణయించటమూ కష్టమే. ఇవన్నీ బాల బీపీని గుర్తించలేకపోవటానికి దారితీస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్తో కూస్తో అవగాహన పెరుగుతోంది. గత పదేళ్లుగా పిల్లల్లో రక్తపోటునూ నమోదు చేయటం ఒక పద్ధతిగా సాగుతోంది. గణాంకాలూ అందుబాటులోకి వస్తున్నాయి. నిజానికి పిల్లల్లో రక్తపోటు పెరుగుతోందనే విషయాన్ని అమెరికాలో 90ల్లోనే పసిగట్టారు. అప్పట్లో అక్కడ 5 శాతానికన్నా ఎక్కువ మంది పిల్లలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని గుర్తించారు. ఇప్పుడది దాదాపు 10 శాతానికి చేరుకుంది. మనదేశంలోనూ తక్కువేమీ కాదు. సుమారు 7% మంది పిల్లలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని అంచనా.

పిల్లల బీపీ తీరే వేరు!
వయసుతో నిమిత్తం లేకుండా పెద్దవారిలో రక్తపోటును ఓ కచ్చితమైన సంఖ్యతో సూచిస్తాం. బీపీ 120/80 లోపుంటే నార్మల్‌. అదే 120/80 నుంచి 129/80 వరకు ముందస్తు రక్తపోటు దశ. అదే 130/80 నుంచి 139/89 వరకు మొదటి దశ.. 140/90, అంతకన్నా ఎక్కువైతే రెండో దశ హై బీపీగా పరిగణిస్తారు. పిల్లల్లో ఇలాంటి గంపగుత్త విధానం కుదరదు. అప్పుడే పుట్టిన శిశువు దగ్గర్నుంచి 13 ఏళ్లలోపు వరకు ఒక బృందంగా, 13-18 ఏళ్లు ఒక బృందంగా విభజించి చూడాల్సి ఉంటుంది. సాధారణంగా 13 ఏళ్లు పైబడ్డవారికి పెద్దవాళ్ల మాదిరి కొలమానాలే వర్తిస్తాయి. అదే 13 ఏళ్లలోపువారిలోనైతే వయసు, ఎత్తు, లింగ బేధం, బరువులను బట్టి రక్తపోటు నిష్పత్తిని (పర్సంటైల్‌) ప్రామాణికంగా తీసుకుంటారు. పర్సంటైల్‌ 90 కన్నా తక్కువగా ఉంటే నార్మల్‌గా భావిస్తారు. పర్సంటైల్‌ 90-95 ఉంటే ముందస్తు రక్తపోటు దశ అంటారు. ఒకరకంగా దీన్ని 120/80, అంతకన్నా ఎక్కువ అనుకోవచ్చు. పర్సంటైల్‌ 95-99 అయితే  మొదటి దశ అధిక రక్తపోటుగా భావిస్తారు. అదే 99 కన్నా మించిపోయి, రక్తపోటు 12 ఎం.ఎం. హెచ్‌జీ దాటితే రెండో దశగా భావిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన దశ.


కారణాలేంటి?

పిల్లల్లో అధిక రక్తపోటు కారణాలను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.
1. జబ్బులతో సంబంధం లేనిది (ప్రైమరీ హైపర్‌టెన్షన్‌): ఇది చాలావరకు పెద్ద పిల్లల్లోనే.. అంటే ఆరేళ్లు పైబడ్డవారిలోనే కనిపిస్తుంది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసులో అరుదు. దీనికి ఇదమిత్థమైన కారణాలంటూ లేవు. అధిక బరువు, కుటుంబంలో ఎవరికైనా రక్తపోటు ఉండటం, అధిక కొలెస్ట్రాల్‌, ఉప్పు ఎక్కువగా తినటం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం, శారీరక శ్రమ చేయకపోవటం వంటివన్నీ దీనికి దోహదం చేసేవే. అరుదుగా జన్యు పరమైన అంశాలూ కారణం కావొచ్చు.

2. జబ్బులతో ముడిపడినది (సెకండరీ హైపర్‌టెన్షన్‌): ఇది ఆరేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువ. దీనికి దోహదం చేసే సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కిడ్నీ, రక్తనాళ జబ్బులు. దాదాపు 80% వరకూ ఇవే కారణం. మెదడు మూలం వద్ద రక్తనాళాల్లో అడ్డంకి (మోయామోయా డిసీజ్‌), రక్తనాళాల గోడలు మందంగా, గట్టిగా అవటం (ఆర్టీరియోస్క్లిరోసిస్‌), గుండె నుంచి రక్తాన్ని తీసుకొచ్చే బృహద్ధమని, దాని శాఖల్లో వాపు ప్రక్రియ తలెత్తటం (టకయాస్‌ డిసీజ్‌), మూత్ర ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాల్లో తిత్తులు, వడపోత ప్రక్రియకు తోడ్పడే భాగాలు దెబ్బతినటం, కిడ్నీలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు గట్టిపడటం (రీనల్‌ ఆర్టరీ స్టెనోసిస్‌) వంటివి అధిక రక్తపోటుకు దారితీస్తాయి. కిడ్నీల మీదుండే అడ్రినల్‌ గ్రంథి వద్ద ఏర్పడే కణితులతోనూ (ఫియోక్రోమోసైటోమా) రక్తపోటు పెరుగుతుంది. మెదడులో రక్తనాళాలు చిట్లిపోవటమూ ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. దీంతో మెదడులో వాపు సైతం తలెత్తొచ్చు (హైపర్‌టెన్షన్‌ ఎన్‌కెఫలోపతి). ఇది ఫిట్స్‌కూ దారితీయొచ్చు. పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు.. ముఖ్యంగా బృహద్ధమని సంకోచించటమూ (కోఆర్‌క్టేషన్‌ ఆఫ్‌ అయోర్టా) అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇది చిన్నప్పుడు పెద్దగా ఇబ్బంది పెట్టదు గానీ వయసు పెరుగుతున్నకొద్దీ ఎక్కువవుతూ వస్తుంది. దీంతో వ్యాయామాలు, కష్టమైన పనులు చేసేటప్పుడు తలకు, చేతులకు రక్తపోటు బాగా పెరిగిపోతుంది. కానీ కాళ్లలో రక్తపోటు తగ్గుతుంది. అందుకే పరుగెత్తటం వంటివి చేస్తున్నప్పుడు కాళ్లు బలహీనపడతాయి. ఎక్కువ దూరం పరుగెత్తలేరు.


కొలిచే పద్ధతి వేరే

పిల్లలకు బీపీని కొలవటానికి పెద్దవాళ్ల చేతికి చుట్టే పట్టీలు సరిపడవు. వయసులను బట్టి.. 1-5 ఏళ్లు, 5-10 ఏళ్లు, పదేళ్లు దాటినవారు.. ఇలా పిల్లల వయసులను బట్టి పట్టీల సైజును ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకు పాదరసంతో కూడిన స్ఫిగ్మోమానోమీటర్‌తో కొలవకూడదు. ప్రమాదవశాత్తు పరికరం పగిలిపోతే, పిల్లలు పాదరసాన్ని మింగొచ్చు. ఇది ప్రమాదకరంగా పరిణమించొచ్చు. అందుకే పాదరసం లేని అనరాయిడ్‌ మానోమీటరు, డైనామ్యాప్‌ పరికరంతో రక్తపోటు కొలవాల్సి ఉంటుంది.


రెండు రకాలు

* తాత్కాలిక రక్తపోటు (ట్రాన్సియెంట్‌ హైపర్‌టెన్షన్‌): దీనికి మూలం డెంగీ, మెదడు వాపు వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు స్వయం చాలిత నాడీ వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదముంది. గుండెకు వెళ్లే సింపాథటిక్‌, పారాసింపాథటిక్‌ నాడులు ప్రభావితమైతే రక్తపోటు పెరిగిపోవచ్చు. ఇన్‌ఫెక్షన్లు తగ్గగానే ఇదీ తగ్గుతుంది. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స చేయటం అవసరం. లేకపోతే గుండె వైఫల్యం తలెత్తొచ్చు. మెదడుకు రక్త సరఫరా తగ్గచ్చు.

* ఉత్తుత్తి హైబీపీ (వైట్‌కోట్‌ హైపర్‌టెన్షన్‌): కాస్త పెద్ద పిల్లల్లో ఇది తరచూ కనిపిస్తుంటుంది. వీరిలో ఆందోళన ఎక్కువ. డాక్టర్‌ దగ్గరకు వచ్చినప్పుడు మరింత ఎక్కువవుతుంది. దీంతో పరీక్ష చేసేటప్పుడు రక్తపోటు పెరుగుతుంటుంది. మిగతా సమయంలో మామూలుగానే ఉంటుంది. అలాగని దీన్ని నిర్లక్ష్యం చేయటం తగదు. ఇలాంటివారిలో చాలామంది మున్ముందు అధిక రక్తపోటు బారినపడే ప్రమాదముంది. అందువల్ల ఇతర సమయాల్లో రక్తపోటు ఎలా ఉంటుందన్నది తెలుసుకోవటం ముఖ్యం. ఇందుకు చేతికి ధరించే పరికరంతో (ఆంబులేటరీ బ్లడ్‌ ప్రెషర్‌ మానిటర్‌) రక్తపోటును నమోదు చేయాల్సి ఉంటుంది. ఉత్తుత్తి రక్తపోటు గలవారిలో ఇతరత్రా సమయాల్లో బీపీ అంత ఎక్కువగా ఉండదు. దీన్ని బట్టి సమస్యను గుర్తిస్తారు.


నిర్ధారణ ఎలా?

పిల్లల్లో అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధారణ చేయటం చాలా ముఖ్యం. దీంతో అనవసరంగా మందులు ఇవ్వకుండా చూసుకోవచ్చు. పిల్లలకు ఒకసారి పరీక్ష చేస్తే చాలదు. కనీసం రెండు సార్లయినా పరీక్షించి, రెండుసార్లూ బీపీ ఎక్కువుంటేనే అధిక రక్తపోటు ఉందని అనుకోవచ్చు. ఇలా వేర్వేరు రోజుల్లో కనీసం మూడు సార్లు పరీక్ష చేసి సమస్యను నిర్ధారించాల్సి ఉంటుంది. అవసరమైతే ఆంబులేటరీ పరికరంతోనూ రోజంతా బీపీని పరిశీలించాల్సి ఉంటుంది.


ఇతర పరీక్షలు

ధిక రక్తపోటును నిర్ధారించిన తర్వాత ఈసీజీ.. కిడ్నీ పనితీరు, రక్తంలో గ్లూకోజు, హార్మోన్ల మోతాదులు తెలుసుకోవటానికి రక్త పరీక్షలు.. కిడ్నీ అల్ట్రాసౌండ్‌ వంటి పరీక్షలూ చేయాల్సి ఉంటుంది. అవసరమనుకుంటే సీటీ/మామూలు యాంజియోగ్రామ్‌ లేదా ఎంఆర్‌ఐ చేయాల్సి రావొచ్చు.


లక్షణాలు ఇవీ..

ధిక రక్తపోటు ఉన్నా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీన్ని గుర్తించటం కష్టం. అయితే గుండె దడ, ఛాతీ నొప్పి, తలనొప్పి, తల తిప్పు, పడుకొని లేవగానే తలనొప్పి, ఆయాసం వంటి లక్షణాల ఆధారంగా అధిక రక్తపోటును పోల్చుకోవచ్చు. అకారణ తలనొప్పిని అసలే నిర్లక్ష్యం చేయరాదు.
* వీలున్నప్పడల్లా పిల్లలకు రక్తపోటు పరీక్ష చేయించటం మేలు. ఆటల పోటీలకు వెళ్లే ముందు ఒకసారి రక్తపోటును పరీక్షించటం మంచిది. ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లినా, జలుబు దగ్గు వంటి వాటి కోసం వెళ్లినప్పుడైనా.. కనీసం ఏడాదికి ఒకసారైనా రక్తపోటు పరీక్ష చేయటం ఉత్తమం.


ఎన్నెన్నో దుష్ప్రభావాలు

దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు గుండె కండరం మందం కావొచ్చు. ఇది గుండె వైఫల్యానికి దారితీయొచ్చు. కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతిని, వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవ్వచ్చు. కంట్లోని రెటీనా దెబ్బతినే ప్రమాదమూ ఉంది. మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతింటే తలనొప్పి, తలతిప్పు తలెత్తొచ్చు. రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ ముంచుకురావొచ్చు.


చికిత్స- జీవనశైలి మార్పు ముఖ్యం

జబ్బులతో ముడిపడని హైబీపీ గలవారికి రక్తపోటును 90 పర్సంటైల్‌ కన్నా తక్కువకు తీసుకురావటం ముఖ్యం. ఇందుకు కుటుంబ సభ్యుల తోడ్పాటు చాలా కీలకం.

* ఇంట్లో తగవులాడుకోవటం.. మార్కులు, ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకురావటం తగదు.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయించాలి. వారానికి 8-12 గంటల సేపు వ్యాయామం అవసరం. పరుగెత్తటం వంటి ఆటలు ఆడించినా మంచిదే.  పరుగు, షటిల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, ఈత వంటి ఐసోటోనిక్‌ వ్యాయామాలు మేలు. బరువులెత్తుటం వంటి ఐసోమెట్రిక్‌ వ్యాయామాలు తగవు.
* ఆహారంలో మార్పులేవీ అవసరం లేదు గానీ కూరల్లో ఉప్పు తగ్గించుకోవాలి. ఉప్పు వాడకం రోజుకు 2-3 గ్రాముల కన్నా మించనీయొద్దు. చిప్స్‌, బర్గర్లు, పిజ్జాలు, పచ్చళ్లు, వేపుళ్లు, సముద్రపు చేపల వంటివి తిననీయొద్దు.
* యోగా, ధ్యానం చాలా ముఖ్యం. ఇవి ఆందోళన తగ్గటానికి బాగా తోడ్పడతాయి. ఫలితంగా రక్తపోటూ తగ్గుముఖం పడుతుంది.

అవసరమైతే మందులు
చిప్స్‌ వంటి చిరుతిళ్లు మానేసి, రోజూ వ్యాయామం, యోగా చేస్తుంటే 90% మందికి మందుల అవసరమే ఉండదు. క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ రక్తపోటు పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఆహార, వ్యాయామ నియమాలు పాటించినా రక్తపోటు అదుపులోకి రాకపోతే కొద్దిరోజుల తర్వాత మళ్లీ పరీక్షిస్తారు. అప్పటికీ రక్తపోటు ఎక్కువగా ఉంటే ఏసీఈ ఇన్‌హిబాటార్స్‌, బీటా బ్లాకర్లు, క్యాల్షియం చానల్‌ బ్లాకర్ల వంటి మందులు సూచిస్తారు. వీటితో పాటు ఆహార, వ్యాయామాలు తప్పనిసరి. ఇలా 4-6 వారాల పాటు పరిశీలించి, అవసరమైతే మందుల మోతాదు మారుస్తారు. మూడు నెలల తర్వాత ఆంబులేటరీ పరికరం ద్వారా రక్తపోటు పరీక్షిస్తారు. రక్తపోటు తీరును బట్టి మందుల మోతాదు తగ్గించుకుంటూ వస్తారు.

* జబ్బులతో ముడిపడినదైతే.. అడ్రినల్‌ గ్రంథి మీద కణితి గలవారికి శస్త్రచికిత్సతో కణితిని తొలగించాల్సి ఉంటుంది. బృహద్ధమని కుంచించుకుపోయినవారికి బెలూన్‌తో ఉబ్బించి లేదా స్టెంట్‌ అమర్చి సమస్యను సరిచేస్తారు. కిడ్నీ రక్తనాళాలు గట్టిపడినవారికి రీనల్‌ ఆర్టరీ బెలూన్‌ లేదా కిడ్నీ బైపాస్‌ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కిడ్నీ సమస్యలు గలవారికి మందులు ఉపయోగపడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని