Covid 19 పిల్లలు జర భద్రం

పిల్లల్లో కొవిడ్‌-19 విషయంలో మన నమ్మకాలు పటా పంచలైపోతున్నాయి. రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటూ వస్తున్న సార్స్‌-కొవీ-2 రెండో దశలో చిన్నారుల మీదా విరుచుకుపడుతోంది. తొలిదశతో పోలిస్తే ఇప్పుడు 20 రెట్లు ఎక్కువగా పిల్లలకు సోకుతుండటం గమనార్హం. చాలామంది చిన్నారులను ఇది పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే నయమవటం సంతోషం కలిగించే మాట నిజమే అయినా కొందరికి మాత్రం

Updated : 09 Jun 2021 13:57 IST

పిల్లల్లో కొవిడ్‌-19 విషయంలో మన నమ్మకాలు పటా పంచలైపోతున్నాయి. రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటూ వస్తున్న సార్స్‌-కొవీ-2 రెండో దశలో చిన్నారుల మీదా విరుచుకుపడుతోంది. తొలిదశతో పోలిస్తే ఇప్పుడు 20 రెట్లు ఎక్కువగా పిల్లలకు సోకుతుండటం గమనార్హం. చాలామంది చిన్నారులను ఇది పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే నయమవటం సంతోషం కలిగించే మాట నిజమే అయినా కొందరికి మాత్రం తీవ్రంగానూ పరిణమిస్తోంది. సరైన సమయంలో సరైన చికిత్స ఆరంభిస్తే వీరిని పూర్తిగా కాపాడుకోవచ్చు. కాబట్టి అప్రమత్తత అత్యవసరం. మన భవిష్యత్తును రక్షించుకోవటమే మన తక్షణ కర్తవ్యం కావాలి.

పిల్లలకు తీవ్రమైన కొవిడ్‌-19 ముప్పు తక్కువే కావొచ్చు. చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఒకవేళ మొదలైనా తేలికపాటి లక్షణాలకే పరిమితం కావొచ్చు. అంతమాత్రాన నిర్లక్ష్యం పనికిరాదు. ఎందుకంటే కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవీ-2 రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటూ వస్తోంది. బి.1.1.7 (బ్రిటన్‌ రకం), బి.1.351 (దక్షిణాఫ్రికా రకం), పి.1 (బ్రెజిల్‌), బి.1.427, బి.1.429 (అమెరికా రకాలు) ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఇవన్నీ మనదేశానికీ విస్తరించాయి. ఇవి మనల్ని పెద్దగా బాధపెట్టలేదు గానీ జన్యుపరంగా మారుతూ కొత్త రూపు సంతరించుకుంది. అదే బి.1.167 అనే రకం. డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌గా పిలుచుకుంటున్న ఇది శరవేగంగా విస్తరిస్తోంది. ఇది ముంబయిలో తొలిసారి వెలుగు చూసింది. అక్కడ బయటపడుతున్న 60-70% కేసులకు కారణం ఇదే. మనదగ్గరా ఇదే విలయం సృష్టిస్తోంది. పిల్లల మీదా పంజా విసురుతోంది.
20 రెట్లు ఎక్కువగా..
నిజానికి మన శరీరం మీద వైరస్‌ ఉన్నా అదేమీ చేయదు. లోపలికి ప్రవేశిస్తేనే సమస్య. ఇది ఒంట్లోకి ప్రవేశించటానికి మార్గం చూపేవి ఆయా అవయవాల కణజాలంలోని ఏస్‌-2 గ్రాహకాలు. వైరస్‌ మీదుండే ముల్లు ప్రొటీన్‌ ఏస్‌-2 గ్రాహకాలకు అంటుకోవటం ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం తామరతంపరగా వృద్ధి చెందుతూ ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. చిన్న పిల్లల్లో ఏస్‌-2 గ్రాహకాలు చాలా చాలా తక్కువ. ఉన్నా అంత చురుకుగా ఉండవు. మొదట్నుంచీ పిల్లలను కరోనా ముప్పు నుంచి కాపాడుతోంది ఇదే. కానీ ఇప్పుడిది పిల్లలకూ ఎక్కువగానే సోకుతోంది. గత సంవత్సరం 100 మందిలో ఒక చిన్నారికి సార్స్‌-కోవీ-2 పాజిటివ్‌గా కనిపించేది. ఇప్పుడు 20 మంది పిల్లల్లో పాజిటివ్‌గా తేలుతోంది. అంటే 20 రెట్లు పెరిగిందన్నమాట. ప్రస్తుతం 6-15 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నెలల పిల్లల్లోనే కాదు, అప్పుడే పుట్టిన పిల్లల్లోనూ దీన్ని చూస్తున్నాం. దీనికి కారణమేంటి? కొవిడ్‌-19 నివారణ పట్ల నిర్లక్ష్యం చూపటం. మొదట్లో మాస్కులు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం, చేతులు కడుక్కోవటం వంటి జాగ్రత్తలు బాగానే పాటించారు. రాన్రాను కేసులు తగ్గటం, అంత ఉద్ధృతంగా దాడి చేయకపోవటం వల్ల ‘ఇదేం చేస్తుందిలే’ అనే భావన నెలకొనటమే ఇప్పుడు కొంప ముంచుతోంది. తొలిదశలో కరోనా జబ్బు పిల్లలకు అంతగా సోకకపోవటం, సోకినా లక్షణాలేవీ లేకుండానే సురక్షితంగా బయటపడటం కూడా కొంత ధైర్యం కలిగించింది. ఇవన్నీ ఒకరకంగా నిర్లక్ష్యానికే దారితీశాయి. ఇదే మలిదశలో వైరస్‌ విస్తృతంగా దాడి చేయటానికి, పిల్లలకూ హానికరంగా పరిణమించటానికి వీలు కల్పిస్తోంది. మరో ముఖ్య కారణం- సార్స్‌-కోవీ2 కొత్తరూపు సంతరించుకోవటం. వైరస్‌ తన మనుగడ కోసం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అది దాని సహజ గుణం. సాధారణంగా 95% మార్పులు పెద్దగా హాని కలిగించవు. ఏస్‌-2 గ్రాహకాలతో అంటుకునేలా చేసే మార్పులే ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. బి.1.167 రకం వైరస్‌తో జరుగుతోంది ఇదే.
గాలి ద్వారా వ్యాపించటంతోనూ..
ఇంతకుముందు వైరస్‌ పెద్ద తుంపర్లతోనే వ్యాపిస్తుందని, ఇతరులకు 6 మీటర్ల దూరంలో ఉంటే సురక్షితమని భావించేవారు. కానీ కరోనా వైరస్‌ సూక్ష్మ తుంపర్లతోనూ.. అంటే మాట్లాడినప్పుడు, శ్వాస వదిలినప్పుడు బయటకు వచ్చే కంటికి కనిపించని తుంపర్లతోనూ వ్యాపిస్తున్నట్టు లాన్సెట్‌ వైద్యపత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. ఇలాంటి సూక్ష్మ తుంపర్లు గాలిలో చాలాసేపు తేలియాడగలవు. ఇలా ఇది గాలి ద్వారానూ వ్యాపిస్తోందన్నమాట. పిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్లకపోయినా కూడా కరోనా సోకుతుండటానికి కారణమిదే. రకరకాల పనుల మీద బయటకు వెళ్లి వచ్చే పెద్దవాళ్ల ద్వారా పిల్లలకు అంటుకుంటోంది. వైరస్‌ సోకినా అందరిలో అన్నిసార్లూ లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి వాళ్లు వదిలే శ్వాస ద్వారా పిల్లలకు సోకుతోందని గుర్తించటం అవసరం. కాబట్టే రెండో దశలో కరోనా వైరస్‌ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
ఎక్కడి పిల్లలు అక్కడే
మొదట్లో పిల్లల నుంచి పెద్దవాళ్లకు వైరస్‌ అంతగా వ్యాపించదనే భావించేవారు. కానీ పిల్లల ద్వారానూ ఎక్కువగానే ఇతరులకు సోకుతున్నట్టు ఇటీవలి అనుభవాలు చెబుతున్నాయి. పిల్లల గొంతు, ముక్కులో అంత ఎక్కువగా వైరస్‌ లేకపోవచ్చు. లక్షణాలు లేకపోవచ్చు. అలాగని ఇతరులకు వైరస్‌ సోకదని అనుకోవటానికి లేదు. లక్షణాల తీవ్రతకు వైరస్‌ సంఖ్యకు సంబంధం లేదు. లక్షణాలు కనిపించనంత మాత్రాన పిల్లల్లో వైరస్‌ లేదనుకోవద్దు. లక్షణాలున్నా లేకపోయినా వైరస్‌ను వ్యాపింపజేసే అవకాశముంది. పిల్లలు ఒకదగ్గర కుదురుగా కూర్చోరు. అందరి దగ్గరికీ వెళ్తుంటారు. అందువల్ల వైరస్‌ను మరింత త్వరగా, ఎక్కువగా వ్యాపింపజేసే ప్రమాదమూ ఉంది. ప్రస్తుతం గాలి ద్వారా వ్యాపిస్తుండటం వల్ల ఇంట్లో పెద్దవాళ్ల నుంచైనా, బయట ఇతర పిల్లల నుంచైనా ఎక్కడ్నుంచైనా వైరస్‌ అంటుకునే అవకాశముందని గుర్తించాలి. చాలామంది చేస్తున్న పొరపాటు ఇంట్లో ఎవరికైనా కొవిడ్‌ లక్షణాలు కనిపించగానే పిల్లలను ఊళ్లకు పంపించేయటం. ఇది మంచి పద్ధతి కాదు. ఇంట్లో ఒకరికి కొవిడ్‌ వచ్చినా, కొవిడ్‌ అనుమానిత లక్షణాలు కనిపించినా అందరికీ జబ్బు వచ్చినట్టుగానే పరిగణించాలి. పిల్లలను ఊళ్లకు పంపిస్తే అక్కడి వాళ్లకూ వైరస్‌ అంటుకునే అవకాశముంది. కాబట్టి ఎక్కడి పిల్లలను అక్కడే ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో వాళ్లంతా విధిగా సర్జికల్‌ మాస్కులు ధరించాలి. ఎత్తుకోవటం, ముద్దు పెట్టుకోవటం వంటివేవీ చేయొద్దు.

ప్రమాదం ఎవరికి ఎక్కువ?

దీర్ఘకాల కిడ్నీ జబ్బు, కాలేయ జబ్బు, పుట్టుకతో గుండె లోపాలతో బాధపడేవారు.. క్యాన్సర్‌ బాధితులు, రోగనిరోధక శక్తి తక్కువగా గలవారు, మతి స్థిమితం లేనివారు, టైప్‌1 మధుమేహులు, తీవ్రమైన ఊబకాయం, పోషణలోపం గలవారికి కొవిడ్‌-19 వస్తే వేగంగా విషమించే ప్రమాదముంటోంది. కాబట్టి వీరి విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి.

ఆసుపత్రికి ఎప్పుడు?

ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లటం ప్రమాదకరం కాబట్టి ముందు వీడియో ద్వారా డాక్టర్‌ను సంప్రదించాలి. లక్షణాలన్నీ వివరించాలి. కొవిడ్‌ అనుమానిత లక్షణాలున్నప్పుడే నిర్ధరణ పరీక్ష చేయించాలి. తగు చికిత్స ఆరంభిస్తే నూటికి 90 మంది పిల్లలకు కొవిడ్‌-19 పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుంది. అయితే జ్వరం తగ్గకపోతున్నా, దగ్గు పెరుగుతున్నా, ఆయాసం మొదలైనా, మత్తుగా నీరసంగా పడుకుంటున్నా, తిండి తినలేకపోతున్నా, నిద్ర సరిగా పోకపోతున్నా, ఆటలు ఆడకపోతున్నా, చిరాకు పడుతున్నా, ఒంట్లో నీటిశాతం తగ్గుతున్నా, మూత్రం రావటం తగ్గినా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వీరిని అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది.
* కొందరు పిల్లల్లో కొవిడ్‌-19 మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ (ఎంఐఎస్‌-సి) సమస్యకు దారితీస్తోంది. కాబట్టి ఎప్పుడూ మగతగా ఉంటున్నా, శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నా, తికమక పడిపోతున్నా.. చర్మం, పెదవులు, గోళ్ల చివర్లు పాలి పోతున్నా, నీలిరంగులోకి మారుతున్నా, తీవ్రమైన కడుపు నొప్పి వేధిస్తున్నా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

ఎప్పుడు అనుమానించాలి?

ఆరేళ్లు దాటిన పిల్లల్లో పెద్దవాళ్లలో మాదిరి లక్షణాలే కనిపించినప్పటికీ కొన్నిసార్లు అంత స్పష్టంగా ఉండకపోవచ్చు. మామూలు జలుబు, వైరల్‌ జబ్బులాగా అనిపించొచ్చు. చాలామంది పిల్లలు ఒకట్రెండు వారాల్లో వీటి నుంచి కోలుకుంటారు. అయినా ఆయా లక్షణాల గురించి తెలుసుకొని ఉండటం మంచిది. ప్రధానమైన లక్షణాలు ఇవీ..
* జ్వరం
* చలి ఉండొచ్చు/లేకపోవచ్చు.
* నిస్సత్తువ, అలసట
* తలనొప్పి, ఒళ్లు నొప్పులు
* ముక్కుదిబ్బడ, దగ్గు, గొంతునొప్పి
* శ్వాస వేగంగా తీసుకోవటం
* వికారం, వాంతి, విరేచనాలు
* విడవకుండా కడుపునొప్పి
* ఆహారం సరిగా తినకపోవటం, ఆకలి లేకపోవటం.. రుచి, వాసన తగ్గటం

మూడు రకాలు

పిల్లల్లో లక్షణాలను బట్టి  కరోనా జబ్బును మూడు రకాలుగా విభజించుకోవచ్చు.
మామూలు: సాధారణ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలను మామూలు జబ్బుగా భావించొచ్చు. వీరిలో కొద్దిగా జ్వరం, గొంతునొప్పి, ముక్కు కారటం, దగ్గు.. అలాగే విరేచనాలు, వాంతి, నలతగా ఉండటం కనిపిస్తుంటాయి. ఆయాసం ఉండదు.
ఒక మాదిరి: జబ్బు ముదురుతున్నకొద్దీ శ్వాస వేగంగా తీసుకోవటం మొదలవుతుంది. ఈ దశలో కొందరికి రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కన్నా తక్కువకు పడిపోవచ్చు. కొందరిలో న్యుమోనియా ఆరంభం కావొచ్చు.
తీవ్రం, విషమం: తీవ్ర దశలో న్యుమోనియా ఎక్కువవుతుంది. ఆక్సిజన్‌ శాతం 90 కన్నా పడిపోవచ్చు. శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి కావటం, డొక్కలు ఎగరేయటం వంటివీ ఉండొచ్చు. ఇలాంటి సమయంలో బయటి నుంచి ఆక్సిజన్‌ అందించాల్సి ఉంటుంది. సమస్య ఇంకా తీవ్రమవుతున్నకొద్దీ నిస్సత్తువ, మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందక మత్తుగా నిద్రపోవటంతో పాటు కొందరికి మూర్ఛ తలెత్తొచ్చు. విడవకుండా విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి సైతం వేధించొచ్చు. సమస్య మరీ విషమిస్తే- శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, షాక్‌లోకి వెళ్లిపోవటం.. కిడ్నీ, కాలేయం వంటి అవయవాలు విఫలం కావటం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు ఏర్పడటం వంటివి తలెత్తుతాయి. వీరిని అత్యవసర విభాగంలో చేర్చి, వెంటిలేటర్‌ మీద పెట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.

పండ్లే ఔషధం

కొవిడ్‌-19 బాధిత పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవటం తప్పనిసరి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలి. కూరగాయల గుజ్జు ఎక్కువగా తినేలా చూసుకోవాలి. ఉత్త కూరలు తినిపించినా మంచిదే. పండ్లు, కూరగాయల్లోని విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, ఖనిజ లవణాలు, ట్రేస్‌ ఎలిమెంట్స్‌ వైరస్‌ను అరికట్టటానికి బాగా తోడ్పడతాయి. వైరస్‌కు పండ్లే మంచి ఔషధమన్నా అతిశయోక్తి కాదు.

మనసునూ చిత్తు చేస్తోంది

కరోనా పిల్లలను మానసిక ఒత్తిడికీ గురి చేస్తోంది. కాస్త జ్వరం, ఒళ్లునొప్పులు అనిపించినా కొవిడ్‌ వచ్చేసిందనే భయంలో మునిగిపోతున్నారు. నిద్రలో పక్క తడపటం, భయంతో నిండా ముసుగు పెట్టుకొని పడుకోవటమూ కనిపిస్తోంది. దీంతో చిరాకు, కోపం, దుందుడుకుతనం, నిద్ర పోకపోవటం, మూడ్‌ మాటిమాటికీ మారిపోవటం, మంకుపట్టు వంటి ప్రవర్తన సమస్యలూ బయలుదేరుతున్నాయి. శారీరక శ్రమ తగ్గిపోవటం, రోజువారీ కార్యకలాపాలు మారిపోవటం.. గంటల కొద్దీ టీవీలు, మొబైల్‌ ఫోన్లు చూడటం, పెద్దవాళ్లతో గొడవలు పడటం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి.
* టీవీలు, మొబైల్‌ ఫోన్లను చూడటానికి కచ్చితమైన సమయాన్ని నిర్ణయించుకోవాలి. అలాగే ఒకే సమయానికి భోజనం చేసేలా చూడటం చాలా ముఖ్యం. వ్యాయామం, ఆటల కోసం రోజూ ప్రత్యేక సమయం కేటాయించాలి.
* బొమ్మలు గీయటం, పాటలు పాడటం వంటి హాబీలను ప్రోత్సహించాలి. పెద్దవాళ్లను చూసే పిల్లలు నడచుకుంటారు. కాబట్టి ఒత్తిడిని ఎదుర్కోవటంలో పిల్లలకు పెద్దవాళ్లే మార్గదర్శకులుగా ఉండాలి.
* చుట్టుపక్కల గానీ బంధువుల్లో గానీ ఎవరైనా మరణిస్తే పిల్లల ముందు చర్చించకుండా ఉండటం మంచిది. వీలైనంత వరకు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.

చికిత్స- లక్షణాలను బట్టి

మామూలు జబ్బుకు పిల్లలకు ఎలాంటి ప్రత్యేక చికిత్స అవసరం లేదు. మంచి ఆహారం తినేలా, తగినంత నీరు తాగేలా, విశ్రాంతి తీసుకునేలా చూసుకుంటే చాలు. అవసరమైతే ఆయా లక్షణాలను బట్టి.. జ్వరానికి పారాసిటమాల్‌, దగ్గుకు దగ్గు మందు, గొంతునొప్పికి ఉప్పునీరు పుక్కిలించటం, కడుపునొప్పి, విరేచనాలకు తగు మందులు అవసరమవుతాయి. పెద్దవాళ్ల మాదిరిగా వీరికి యాంటీబయోటిక్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండు, మూడు రోజులు దాటినా జ్వరం తగ్గకుండా, ఇంకా ఎక్కువవుతూ వస్తున్నప్పుడే యాంటీబయోటిక్స్‌ ఆరంభించాలి. అదీ రక్త పరీక్ష చేసి, సీఆర్‌పీ వంటివి ఎక్కువగా ఉంటేనే వీటిని ఇవ్వాల్సి ఉంటుంది.
* ఒక మాదిరి, తీవ్ర జబ్బు గలవారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. వీరికి బయటి నుంచి ఆక్సిజన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి తగు ఇంజెక్షన్లు, స్టిరాయిడ్లు, ఇమ్యునోగ్లోబులిన్లు, సెలైన్‌ ఇస్తారు. పిల్లలకు రెమ్‌డెసివిర్‌,.టొసిలిజుమాబ్‌ లాంటి ఇంజెక్షన్ల అవసరం చాలా అరుదు. వీటి విషయంలో గాబరా పడొద్దు.

పరీక్షలతో నిర్ధారణ

పిల్లలకు లక్షణాలు పొడసూపితేనే పరీక్ష చేయించాలి. కరోనా నిర్ధారణకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షే ప్రామాణికం. కాకపోతే ప్రస్తుతం ఫలితాలు రావటానికి రెండు, మూడు రోజులు పడుతోంది. అందువల్ల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష చేయించటం మంచిది. పాజిటివ్‌గా తేలితే వెంటనే చికిత్స ఆరంభించటానికి వీలవుతుంది. ఒకవేళ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ ఫలితం నెగెటివ్‌గా వస్తే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించాలి. మరింత త్వరగా ఫలితం తెలుసుకోవాలంటే సార్స్‌-కోవీ-2 జీన్‌ఎక్స్‌పర్ట్‌, ట్రూనాట్‌ పరీక్షలు చేయించుకోవచ్చు.
* ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌గా వచ్చినప్పటికీ కొవిడ్‌ అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తరచూ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించాల్సి ఉంటుంది.
* ఎక్కువరోజుల నుంచి కొవిడ్‌తో బాధపడుతున్నవారికి, మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎంఐఎస్‌-సి) అనుమానిత లక్షణాలు గలవారికి సార్స్‌-కోవీ-2 యాంటీబాడీ పరీక్ష చేయించాల్సి ఉంటుంది.
* లక్షణాలు విడవకుండా కొనసాగుతూ వస్తూ, ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌గా ఉంటేనే ఛాతీ సీటీస్కాన్‌ చేయాలి. అంతే తప్ప ముందే ఛాతీ సీటీ స్కాన్‌ చేయటం తగదు. సీటీ స్కాన్‌ ఫలితాలను బట్టి చికిత్స ఆధారపడి ఉండదనే విషయాన్ని అంతా గుర్తించాలి. లక్షణాలు, రక్త పరీక్షల ఫలితాలను బట్టే చికిత్స చేస్తారని తెలుసుకోవాలి. సీటీ స్కాన్‌ ఫలితాలు ఎంత బాగా లేకపోయినా రక్తంలో ఆక్సిజన్‌ శాతం మెరుగ్గా ఉంటున్నట్టయితే బయటి నుంచి తగినంత ఆక్సిజన్‌ అందిస్తూ చికిత్స చేయాల్సి ఉంటుంది. అత్యవసరంగా వెంటిలేటర్‌ మీద పెట్టాల్సిన అవసరమేమీ ఉండదు.

ఇతర పరీక్షలు

అవసరమైతే మరికొన్ని పరీక్షలూ చేయాల్సి ఉంటుంది. ఇవి జబ్బు తీవ్రతను గుర్తించటానికి, చికిత్స తీరుతెన్నులను నిర్ణయించుకోవటానికి ఉపయోగపడతాయి.
* సీఆర్‌పీ: వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తీవ్రతకు సూచికైన ఇది 0-6 ఎంజీ/డీఎల్‌ ఉంటే నార్మల్‌. 26 లోపుంటే మామూలు, 26-100 ఒక మాదిరి, 100 కన్నా ఎక్కువుంటే తీవ్రం.
* డీడైమర్‌: ఇది రక్తం గడ్డకట్టే తీరును తెలిపే పరీక్ష. ఇది 0.5 ఎన్‌జీ/ఎంఎల్‌ కన్నా తక్కువుంటే నార్మల్‌. ఒకటికి లోపుంటే మామూలు, ఒకటి కన్నా మించితే ఒక మాదిరి నుంచి తీవ్రం.
* న్యూట్రోఫిల్‌-లింఫోసైట్‌ నిష్పత్తి: ఇది 3.5 లోపుంటే మామూలు, 3.5కు మించితే తీవ్రం.
* ఫెరిటిన్‌: 13-150 ఎన్‌జీ/ఎంఎల్‌కు మించితే సమస్య తీవ్రమే.
* ఎల్‌డీహెచ్‌: 0-250 యూ/ఎల్‌ ఉంటే నార్మల్‌.
* ఈఎస్‌ఆర్‌: 0-22 ఎంఎం/గంటకు ఉంటే నార్మల్‌.
* ఐల్‌6: ఇదీ వాపు ప్రక్రియ తీవ్రతను సూచించిదే. ఇది 0-7 పీజీ/ఎల్‌ ఉంటే నార్మల్‌. 15 లోపు మామూలు, 15-100 ఒక మాదిరి, 100-500 తీవ్రం, 500 కన్నా మించితే విషమం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని