పిల్లల్లో హైబీపీ కట్టడి జీవనశైలితోనే!

అధిక రక్తపోటు(హైబీపీ)ను ఎంతసేపూ పెద్దవాళ్ల సమస్యగానే చూస్తుంటాం. నిజానికి ఇప్పుడీ సమస్య పిల్లల్లోనూ ఎక్కువగానే కనిపిస్తోంది. ఇది చాలావరకు  జీవనశైలితో సంభవిస్తున్నదే. అనారోగ్యకరమైన ఆహారం, అలవాట్లే దీనికి దోహదం చేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది.

Published : 02 Aug 2022 01:06 IST

అధిక రక్తపోటు(హైబీపీ)ను ఎంతసేపూ పెద్దవాళ్ల సమస్యగానే చూస్తుంటాం. నిజానికి ఇప్పుడీ సమస్య పిల్లల్లోనూ ఎక్కువగానే కనిపిస్తోంది. ఇది చాలావరకు  జీవనశైలితో సంభవిస్తున్నదే. అనారోగ్యకరమైన ఆహారం, అలవాట్లే దీనికి దోహదం చేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. అధిక రక్తపోటు గల పిల్లల్లో నూటికి 90 మందిలో శారీరక శ్రమ లేకపోవటం.. ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తినటం.. అధిక బరువులే కారణం అవుతున్నాయని హెచ్చరిస్తోంది. అందుకేనేమో పిల్లల్లో హైబీపీ చికిత్సలో మందుల కన్నా జీవనశైలి మార్పులకే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. తాజా కూరగాయలు, పండ్లు, పీచుతో కూడిన ఇతర పదార్థాలు ఎక్కువగా తినటం.. చక్కెరతో చేసే పానీయాలకు, సంతృప్త కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం రక్తపోటు నియంత్రణకు తోడ్పడతాయి. అలాగే రోజూ కనీసం గంటసేపు ఒక మాదిరి నుంచి తీవ్ర వ్యాయామాలు (పరుగెత్తటం, సైకిల్‌ తొక్కటం, ఈత కొట్టటం వంటివి) చేయాలి. రోజుకు రెండు గంటల కన్నా ఎక్కువసేపు ఒకేచోట కూర్చోకుండా చూసుకోవాలి. వీటి విషయంలో తల్లిదండ్రుల బాధ్యతే కీలకమని పరిశోధకులు చెబుతున్నారు. చాలాసార్లు అధిక రక్తపోటు, అధిక బరువు కుటుంబ సభ్యుల్లో కలిసే కనిపిస్తుంటాయి. అలా లేకపోయినా కూడా పిల్లల జీవనశైలి మార్పుల విషయంలో కుటుంబ సభ్యులంతా పాలు పంచుకోవటమే మంచిది. పిల్లలు టీవీల ముందు ఎంతసేపు కూర్చుంటున్నారు? స్మార్ట్‌ఫోన్లతో ఎంత సమయం గడుపుతున్నారు? అనేవి గమనిస్తుండాలి. మరీ ఎక్కువసేపు కూర్చుంటున్నట్టయితే ఆరుబయట ఆటలాడటం వంటి ప్రత్యామ్నాయ పనులకు ప్రోత్సహించాలి. ఎందుకంటే శారీరక శ్రమ తగ్గితే బరువు పెరుగుతుంది. అధిక బరువు, అధిక రక్తపోటు రెండూ కవల పిల్లల వంటివి. మామూలు బరువు గల పిల్లల్లో 2% మందిలోనే హైబీపీ కనిపిస్తుండగా.. అధిక బరువు గలవారిలో 5% మంది, ఊబకాయుల్లో 15% మంది దీని బారినపడుతుండటం గమనార్హం. నిరంతరం రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండెజబ్బులు తలెత్తే ప్రమాదముందని తెలుసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు