ఏ విటమిన్ మాత్ర ఎప్పుడు వేసుకోవాలి?
మన శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, లవణాల వంటి ఎన్నెన్నో పోషకాలు అవసరం. వీటిని తగిన మోతాదులో పొందటానికి ఉత్తమమైన మార్గం మంచి పోషకాహారం. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పుల వంటి అన్ని పదార్థాలను సమతులంగా తీసుకుంటే అన్ని పోషకాలూ అందుతాయి.
మన శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, లవణాల వంటి ఎన్నెన్నో పోషకాలు అవసరం. వీటిని తగిన మోతాదులో పొందటానికి ఉత్తమమైన మార్గం మంచి పోషకాహారం. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పుల వంటి అన్ని పదార్థాలను సమతులంగా తీసుకుంటే అన్ని పోషకాలూ అందుతాయి. అయితే కొందరికి కొన్నిరకాల పోషకాలు తగ్గిపోవచ్చు. ఇలాంటి సమయంలో విటమిన్ల మాత్రలు బాగా ఉపయోగపడతాయి. అయితే ఇవి సమర్థంగా పనిచెయ్యాలంటే సరైన పద్ధతిలో తీసుకోవటం చాలా ముఖ్యం.
సమయాన్ని బట్టి
వివిధ విటమిన్ల మాత్రలను రోజులో ఎప్పుడైనా వేసుకోవచ్చు. అయితే మన శరీరం కొన్ని విటమిన్లను ఆహారంతో పాటు తీసుకుంటేనే బాగా గ్రహిస్తుంది. కాబట్టి భోజనం చేశాకో, అల్పాహారం తిన్నాకో వేసుకోవటం మంచిది. దీంతో పరగడుపున మాత్రలను వేసుకున్నప్పుడు తలెత్తే ఇబ్బందులనూ తప్పించుకోవచ్చు. ఉదయం పూట టిఫిన్ తినే అలవాటు లేనివారైతే మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత వేసుకుంటే మేలు.
నీటిలో కరిగేవైతే..
నీటిలో కరిగే విటమిన్లను మన శరీరం నిల్వ ఉంచుకోలేదు. కాబట్టి వీటిని రోజూ విధిగా తీసుకోవాల్సిందే. విటమిన్ సి, థయమిన్ (బి1), రైబోఫ్లావిన్ (బీ2), నియాసిన్ (బీ3), పాంటోథెనిక్ ఆమ్లం (బీ5), పైరిడాక్సిన్ (బీ6), బయోటిన్ (బీ7), ఫోలిక్ ఆమ్లం (బీ9), కోబలమిన్ (బీ12) వంటివన్నీ నీటిలో కరిగే విటమిన్లే. వీటిని ఆహారంతో గానీ విడిగా గానీ వేసుకోవచ్చు. అయితే ఆహారంతో పాటు తీసుకుంటే బీ12ను శరీరం బాగా గ్రహిస్తుంది. విటమిన్ సి కూడా వేసుకునే వారైతే వీటి మధ్య 2 గంటల ఎడం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే బీ12ను శరీరం వినియోగించుకోకుండా విటమిన్ సి అడ్డుకుంటుంది.
కొవ్వులో కరిగేవైతే
ఏ, డీ, ఈ, కే విటమిన్లు కొవ్వులో కరిగే రకానికి చెందినవి. మనం ఆహారం ద్వారా తీసుకునే కొవ్వుతో కలిసినప్పుడు శరీరం వీటిని శోషించుకుంటుంది. కాబట్టి కొవ్వుతో కూడిన పదార్థాలతో కలిపి వేసుకుంటే మంచిది. అలాగని మాంసం వంటి అధిక కొవ్వు పదార్థాలేమీ అక్కర్లేదు. బాదం, జీడిపప్పు వంటి గింజపప్పుల్లోని కొవ్వులైనా చాలు.
విటమిన్ ఏతో జాగ్రత్త
విటమిన్ ఏ విషయంలో మోతాదు గురించి జాగ్రత్తగా ఉండాలి. గర్భిణులు రోజుకు 10వేల ఐయూ కన్నా ఎక్కువ డోసులో దీన్ని తీసుకుంటే పుట్టబోయే పిల్లల్లో అవకరాలు ఏర్పడొచ్చు. పొగతాగే అలవాటు గలవారు గానీ పొగ అలవాటు మానేసినవారు గానీ పెద్దమొత్తంలో విటమిన్ ఏ తీసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది.
గర్భధారణ సమయంలో
ఫోలిక్ ఆమ్లం, ఐరన్తో కొందరు గర్భిణులకు వికారం వంటి ఇబ్బందులు కలగొచ్చు. దీనికి ప్రధాన కారణం ఐరనే. ఇలాంటి ఇబ్బందితో బాధపడుతుంటే పడుకునే ముందు కాస్త ఏదైనా తిని మాత్రలు వేసుకోవటం మంచిది.
ఖనిజాల మాత్రలైతే
పెద్దమొత్తంలో ఖనిజాల మాత్రలను వేసుకుంటే వాటిని శరీరం గ్రహించుకునే ప్రక్రియలో ఒకదాంతో మరోటి పోటీ పడొచ్చు. క్యాల్షియం, జింక్, మెగ్నీషియం మాత్రలను ఒకేసారి కలిపి వేసుకోవటం తగదు. వీటిని ఆహారంతో పాటు తీసుకుంటేనే బాగా ఒంట పడతాయి. ఒకవేళ డాక్టర్లు ఈ మూడింటినీ వేసుకోవాలని సూచిస్తే విడివిడిగా భోజనం లేదా అల్పాహారం చేశాక వేసుకోవటం మంచిది.
ఐరన్ మాత్రలైతే
మన శరీరం పరగడుపుననే ఐరన్ను బాగా గ్రహించుకుంటుంది. కాబట్టి ఐరన్ మాత్రలను వేసుకొని నీరు తాగినా చాలు. బత్తాయి, నిమ్మ వంటి పుల్లటి రసాలతో కలిపి తీసుకుంటే ఇంకా మేలు. ఎందుకంటే ఐరన్, విటమిన్ సి రెండూ కలిస్తే శరీరం వీటిని మరింత సమర్థంగా శోషించుకుం టుంది. కానీ క్యాల్షియం, క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలతో ఐరన్ను కలపటం మంచిది కాదు. ఇవి ఐరన్ను శరీరం గ్రహించుకోకుండా అడ్డుపడతాయి.
వేరే మందులు వేసుకుంటుంటే
పోషకాల మాత్రలు ఇతరత్రా జబ్బుల మందుల పనితీరులో జోక్యం చేసుకోవచ్చు. ఉదాహరణకు- విటమిన్ కె రక్తాన్ని పలుచగా ఉంచే వార్ఫారిన్ వంటి మందుల ప్రభావాన్ని తగ్గించొచ్చు. వీరు రోజుకు 1,000 ఎంజీ కన్నా ఎక్కువ మోతాదులో విటమిన్ ఇ తీసుకుంటే రక్తస్రావమయ్యే ముప్పు పెరగొచ్చు. థైరాయిడ్ మందులు వేసుకునే వారైతే నాలుగు గంటల తర్వాతే క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వేసుకోవాలి. ఇవి థైరాయిడ్ మందు ప్రభావాన్ని తగ్గిస్తాయి మరి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM