జీబీఎస్‌ టీకా సత్వర అవసరం

సాధారణమే కావొచ్చు. చాలావరకు హాని చేయకపోవచ్చు. అలాగని నిర్లక్ష్యం పనికిరాదు. గ్రూప్‌ బి స్ట్రెప్టోకాకస్‌ (జీబీఎస్‌) బ్యాక్టీరియా విషయంలో అలాంటి అప్రమత్తతే అవసరమని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. దీనికి అత్యవసరంగా టీకా రూపొందించాల్సిన అవసరముందని సూచిస్తోంది.

Updated : 09 Nov 2021 00:59 IST

సాధారణమే కావొచ్చు. చాలావరకు హాని చేయకపోవచ్చు. అలాగని నిర్లక్ష్యం పనికిరాదు. గ్రూప్‌ బి స్ట్రెప్టోకాకస్‌ (జీబీఎస్‌) బ్యాక్టీరియా విషయంలో అలాంటి అప్రమత్తతే అవసరమని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. దీనికి అత్యవసరంగా టీకా రూపొందించాల్సిన అవసరముందని సూచిస్తోంది.

గ్రూప్‌ బి స్ట్రెప్టోకాకస్‌ పేగుల్లో, జననాంగాల కింది భాగంలో ఉంటుంది. ఆరోగ్యవంతులైన పెద్దవారినిది అంతగా ఇబ్బంది పెట్టదు. ఈ బ్యాక్టీరియా ఉన్నా కూడా చాలామంది గర్భిణులకు కీడు చేయదు. ప్రపంచవ్యాప్తంగా సగటున 15% మంది.. ఏటా సుమారు 2 కోట్ల మంది గర్భిణులకు జీబీఎస్‌ సోకుతున్నట్టు అంచనా. ఇది ఉన్నా చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కానీ పుట్టకముందు, పుట్టే సమయంలో, పుట్టిన తొలినాళల్లో తల్లి నుంచి పిండానికి, బిడ్డకు సోకొచ్చు. ఇది కొన్నిసార్లు తీవ్ర అనర్థాలకు దారితీయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా దీని అనర్థాలు ఊహించిన దాని కన్నా ఎక్కువగానే ఉంటున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజా నివేదిక పేర్కొంటోంది. జీబీఎస్‌ కారణంగా నెలలు నిండకముందే పుట్టటం, సెరిబల్‌ పాల్సీ, వినికిడి, చూపు లోపాల వంటి నాడీ సమస్యలను తొలిసారిగా నివేదికలో విశ్లేషించారు. జీబీఎస్‌ ఇన్‌ఫెక్షన్‌ మూలంగా ఏటా 5 లక్షల మందికి పైగా శిశువులు నెలలు నిండకముందే పుడుతున్నారు. సుమారు 1.5 లక్షల మంది శిశువులు మరణిస్తున్నారు. వీరిలో 46వేల మంది తల్లి గర్భంలోనే మరణిస్తుండటం ఆందోళనకరం.

పనిచేయని ముందు జాగ్రత్త మందులు

గర్భిణులకు జీబీఎస్‌ సోకినట్టు తేలితే- శిశువుకు సంక్రమించకుండా ముందు జాగ్రత్తగా యాంటీబయోటిక్‌ మందులు ఇస్తుంటారు. అయినప్పటికీ శిశువులు పుట్టుకతోనే మరణించటం, నెలలు నిండకముందే పుట్టటం, పుట్టిన తర్వాత మరణించటం వంటివి ఆగటం లేదు. అందుకే వీటిని నివారించటానికి సత్వరం టీకా తీసుకు రావాల్సిన  అవసరముందని ప్రపంచ ఆరోగ్యసంస్థ నొక్కి చెబుతోంది. జీబీఎస్‌కు మూడు దశాబ్దాలుగా చాలా టీకాలు అభివృద్ధి చేస్తున్నప్పటికీ ఇంకా ఏదీ అందుబాటులోకి రాలేదు. వీటిని రూపొందించినట్టయితే.. 70% మంది గర్భిణులకు టీకా ఇచ్చినా ఏటా 50వేల జీబీఎస్‌ సంబంధ శిశు మరణాలను అరికట్టొచ్చని నివేదిక సూచించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని