వారికి ఆస్థమా ముప్పు ఎక్కువ

నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తులు, శ్వాసమార్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవటం పెద్ద సమస్య.

Published : 04 Apr 2023 00:21 IST

నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తులు, శ్వాసమార్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవటం పెద్ద సమస్య. అందుకే వీరిలో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇవి బాల్యానికే పరిమితమవుతాయని అనుకోవద్దు. మధ్యవయసు వచ్చేవరకూ కొనసాగే అవకాశముందని తాజా అధ్యయనంలో బయటపడింది. వీరికి ముఖ్యంగా ఆస్థమా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీవోపీడీ) ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. ఇవి రెండూ శ్వాస తీసుకోవటంలో చాలా ఇబ్బందులు సృష్టిస్తాయి. గర్భం ధరించాక 37 వారాల్లోపు అయ్యే ప్రసవాన్ని ముందస్తు కాన్పు అంటారు. మరీ ముందుగా.. అంటే 28 వారాల్లోపు పుట్టినవారికి పెద్దయ్యాక ఆస్థమా, సీవోపీడీ ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. తల్లి గర్భంలో ఉండే సమయం పెరుగుతున్నకొద్దీ వీటి ముప్పు తగ్గుతున్నప్పటికీ 37-38 వారాల్లో పుట్టినవారికీ కొద్దోగొప్పో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉండటం గమనార్హం. శైశవదశలో ఊపిరితిత్తుల్లో, శ్వాసమార్గాల్లో కణజాలం దెబ్బతిన్నవారికైతే వీటి ముప్పు 8 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 కోట్ల మంది పిల్లలు నెలలు నిండక ముందే పుడుతున్నారన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. ఆధునిక చికిత్సల పుణ్యమాని ఇప్పుడు వీరిలో చాలామంది బతికి బట్ట కడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు ఆస్థమా పెద్ద సమస్యగా మారే అవకాశముందని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు