ఎండ తంటాలు!

ఎండ భగ్గుమంటోంది. ఉదయం నుంచే చురుక్కుమంటోంది. మనదేశంలో 90% భాగం వేడి గాలులకు గురయ్యే ‘ప్రమాద ప్రాంతాల’ పరిధిలోనే ఉందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం తాజా అధ్యయనం పేర్కొంటుండటం మరింత కలవరం కలిగిస్తోంది.

Updated : 25 Apr 2023 04:07 IST

ఎండ భగ్గుమంటోంది. ఉదయం నుంచే చురుక్కుమంటోంది. మనదేశంలో 90% భాగం వేడి గాలులకు గురయ్యే ‘ప్రమాద ప్రాంతాల’ పరిధిలోనే ఉందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం తాజా అధ్యయనం పేర్కొంటుండటం మరింత కలవరం కలిగిస్తోంది. ఎండ వేడి మన శరీరం మీద విపరీత ప్రభావం చూపుతుంది. నిస్త్రాణ, వడదెబ్బ వంటి సమస్యలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదికీ రావొచ్చు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికివి  మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఇప్పటికే కొన్నిచోట్ల వడగాలుల ప్రభావానికి మరణాలూ సంభవించటం గమనార్హం. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది.

యట వేడిగా ఉన్నప్పుడు చెమట పట్టటం తెలిసిందే. ఇది శరీరం చల్లబరచుకోవటానికి చేసే ప్రయత్నమే. వాతావరణం వేడిని తట్టుకునే క్రమంలో రక్తనాళాలు విప్పారి, చర్మానికి రక్త ప్రసరణ పుంజుకుంటుంది. రక్తంతో పాటు ద్రవాలు, లవణాలు పెద్దమొత్తంలో చర్మానికి చేరుకుంటాయి. ఆ వెంటనే స్వేదగ్రంథులు ఉత్తేజితమై చెమటను ఉత్పత్తి చేస్తాయి. బయటి గాలి తగిలి, చెమట ఆవిరయ్యే క్రమంలో శరీరం చల్లబడుతుంది. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల చెమట బాగా పోస్తుంది. దీంతో ఒక్క నీరే కాదు.. లవణాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవటం ముఖ్యం. లేకపోతే ఒంట్లో నీటి శాతం, లవణాల మోతాదులు తగ్గిపోతాయి. ఎండాకాలంలో తలెత్తే సమస్యలకు ఇదే మూలం. నీటిశాతం తగ్గినప్పుడు నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణ మొదలవుతాయి. నీరు మరీ తగ్గితే వడదెబ్బకు దారితీస్తుంది. మన మెదడులోని హైపోథలమస్‌ నిరంతరం శరీరంలో ఎంత వేడి ఉత్పత్తి అవుతోంది? ఎంత బయటకు పోతోంది? అని పర్యవేక్షిస్తుంది. ఉష్ణోగ్రతకు ప్రభావితమయ్యే వెన్నుపాము, కండరాలు, రక్తనాళాలు, చర్మం, గ్రంథుల వంటి వాటి నుంచి సంకేతాలను గ్రహించి.. అవసరానికి తగ్గట్టు స్పందించేలా వాటికి ఆదేశాలు జారిచేస్తుంది. చెమట పట్టటమూ ఇందులోని భాగమే. అయితే వడదెబ్బ తగిలినప్పుడు ఒంట్లో ఉష్ణోగ్రతను నియంత్రించే ఈ వ్యవస్థ సైతం కుప్పకూలుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత ఉన్నట్టుండి బాగా పెరిగిపోతుంది. ప్రాణాపాయమూ సంభవించొచ్చు. పిల్లలు, వృద్ధులు, ఎండను తట్టుకోలేనివారు, ఏసీల్లో గడిపేవారు, శారీరక శ్రమ అంతగా చేయనివారికి ఎండ సమస్యల ముప్పు ఎక్కువ. వీటిపై అవగాహన కలిగుండటం మంచిది. కొన్ని జాగ్రత్తలతో వీటి బారినపడకుండా కాపాడుకోవచ్చు.


వేడి నిస్త్రాణ

ఎండ వేడికి తట్టుకోలేక పోవటం వల్ల తీవ్ర నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణ తలెత్తొచ్చు (హీట్‌ ఎగ్జాషన్‌). శరీరం వేడి గాలిని తట్టుకోలేకపోతోందని, చల్లబడలేకపోతోందని అనటానికిదో హెచ్చరిక. దీనికి కారణం శరీరాన్ని చల్లబరచేందుకు చెమట విపరీతంగా పట్టటం. చెమటతో శరీరం చల్లబడినా నీరు, లవణాలు బాగా తగ్గిపోతాయి. రక్తపోటూ పడిపోతుంది. అప్పుడు దాహం, కళ్లు తిరగటం, బలహీనత, ఏకాగ్రత కుదరకపోవటం, వికారం, మత్తుగా అనిపించటం వంటివి బయలుదేరతాయి. కొందరు దీన్ని వడదెబ్బగానూ పొరపడుతుంటారు. వడదెబ్బలో చెమట పట్టదు. వేడి నిస్త్రాణలో చెమట పడుతుంది. శరీర ఉష్ణోగ్రత మామూలుగానే ఉంటుంది. తాకితే చర్మం చల్లగానూ అనిపిస్తుంది. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. నాడి వేగం పెరగొచ్చు లేదూ మామూలుగానైనా ఉండొచ్చు. అయితే దీన్ని నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బకు దారితీసే ప్రమాదముంది.

ముప్పు ఎవరికి?

పిల్లల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం పూర్తిగా అభివృద్ధి చెందదు. వృద్ధుల్లో కొన్ని జబ్బులు, వేసుకునే మందులు, ఇతర కారణాలతో ఈ సామర్థ్యం కొరవడుతుంది. అందుకే శిశువులు, చిన్నపిల్లలు, వృద్ధులకు వేడి నిస్త్రాణ ముప్పు ఎక్కువ. ఊబకాయులకు, వేడిని తట్టుకోలేనివారికీ దీని ముప్పు పొంచి ఉంటుంది.

నీరు ఎక్కువగా..

* నీరసంగా, బడలికగా అనిపిస్తే వెంటనే చల్లటి ప్రదేశానికి వెళ్లాలి. నీరు ఎక్కువగా తాగాలి. పరిస్థితి కుదురుకున్న వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.


కండరాలు పట్టేయటం

కండరాలు సజావుగా పనిచేయటానికి సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి లవణాలు అవసరం. వీటి మోతాదులు తగ్గిపోతే కండరాల పనితీరు అస్తవ్యస్తమై, బిగుసుకు పోవచ్చు. దీంతో విపరీతమైన నొప్పి పుడుతుంది. చాలావరకు పిక్క కండరాలు పట్టేస్తుంటాయి. చేతులు, కడుపు కండరాలూ పట్టేయొచ్చు. కాళ్లు, చేతులు కొంకర్లు పోవచ్చు కూడా.

ముప్పు ఎవరికి?

ఎండలో ఎక్కువసేపు గడపటం, నడవటం, వ్యాయామం, పనులు చేయటం వంటివి కండరాలు పట్టేయటానికి కారణమవుతుంటాయి. అధిక రక్తపోటు, మధుమేహం గలవారికీ దీని ముప్పు ఎక్కువే. రక్తపోటు తగ్గటానికి వేసుకునే కొన్ని మందులతో మూత్రం ఎక్కువగా రావొచ్చు. దీంతో లవణాల మోతాదులూ తగ్గుతాయి. మధుమేహుల్లో గ్లూకోజు స్థాయులు పెరగటమూ సమస్యకు దారితీయొచ్చు.

ముందు విశ్రాంతి

* కండరాలు పట్టేసినప్పుడు చల్లటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవటం చాలా చాలా ముఖ్యం.
* చల్లటి నీరు, పానీయాలు తాగాలి. నీటిలో కాస్త ఉప్పు, చక్కెర గానీ ఓఆర్‌ఎస్‌ పొడిని గానీ కలిపి తాగితే మంచిది. మజ్జిగలో ఉప్పు, నిమ్మరసం కలిపి అయినా తాగొచ్చు. ఇంట్లోంచి బయలు దేరటానికి ముందే తగినంత నీరు తాగితే ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవచ్చు.
* నీరు, ద్రవాలు తాగినా లక్షణాలు తగ్గకపోతే.. వికారం, వాంతులతో నీరు తాగలేకపోతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇలాంటి పరిస్థితిలో సెలైన్‌ ఎక్కించాల్సి రావొచ్చు. తలతిప్పటం, నిస్సత్తువ, తలనొప్పి, తీవ్రమైన జ్వరం వంటివీ ఉంటే తగు చికిత్స అవసరమవుతుంది.


సొమ్మసిల్లటం

ఎండలోకి వెళ్లినప్పుడు ఉన్నట్టుండి కాసేపు సొమ్మసిల్లటం (హీట్‌ సింకోపీ) మరో సమస్య. దీనికి కారణం మెదడుకు తగినంత రక్తం అందకపోవటం. ఎండలోకి వెళ్లినప్పుడు చెమట పట్టే క్రమంలో చర్మానికి రక్త సరఫరా పెరుగుతుంది. అదే సమయంలో మిగతా అవయవాలకు.. ముఖ్యంగా మెదడుకు రక్త సరఫరా తగ్గుతుంది. ఇది సొమ్మసిల్లేలా చేస్తుంది. తలతిప్పటం, తలనొప్పి, నాడీ వేగం తగ్గటం, చికాకు, వాంతి, వికారం కూడా ఉండొచ్చు.

ముప్పు ఎవరికి?

ఎండను తట్టుకోలేనివారికి.. వృద్ధులకు, రక్తపోటును తగ్గించే బీటా బ్లాకర్ల రకం మందులు వేసుకునే వారికి, ఇతర దీర్ఘకాల సమస్యలు గలవారికి ముప్పు ఎక్కువ. సొమ్మసిల్లటం తాత్కాలికమే అయినా జాగ్రత్త అవసరం.

పాదాల కింద ఎత్తు

* ఎండకు స్పృహ తప్పినవారిని వెంటనే నీడకు చేర్చాలి. పాదాల కింద ఎత్తు పెట్టి పడుకోబెట్టాలి. దుస్తులు వదులు చేయాలి. తెలివి రాగానే నీరు, ద్రవాలు తాగించాలి.
* రక్తపోటు బాగా తగ్గినా, మరీ నీరసంగా ఉన్నా ఆసుపత్రికి చేర్చాలి.


వడదెబ్బ

ఇది చాలా తీవ్రమైన సమస్య. చెమట పట్టే క్రమంలో రక్తంలోని ద్రవం బాగా ఆవిరవ్వచ్చు. ఇదిలాగే కొనసాగితే ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలుతుంది. చివరికి చెమట పట్టడమూ ఆగిపోతుంది. అప్పుడు శరీర ఉష్ణోగ్రత అతి వేగంగా పెరిగిపోతుంది. ఇదే వడదెబ్బ. కొందరికి 106 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత పెరగొచ్చు. ఇందులో చర్మం పొడిబారుతుంది. ముట్టుకుంటే శరీరం కాలిపోతుంటుంది. నీరు, రక్తం పరిమాణం తగ్గటం వల్ల రక్తపోటూ పడిపోతుంది. రక్తం గడ్డకట్టే ప్రక్రియ కూడా అస్తవ్యస్తమవుతుంది. ఉష్ణోగ్రత 107 డిగ్రీలు దాటితే మాంసకృత్తులు, ఫాస్ఫోలిపిడ్లు కరిగిపోవచ్చు. మెదడు, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతినటం మొదలవుతుంది. క్రమంగా అవయవాలు విఫలమై కోమాలోకీ వెళ్లిపోవచ్చు. ఫిట్స్‌ రావచ్చు. పరిస్థితి మరీ విషమించి, ప్రాణాపాయమూ సంభవించొచ్చు. చాలామంది ఎండలోకి వెళ్తేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. వేడి గాలి, వేడి వాతావరణం ప్రభావంతో ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగలొచ్చు.

చల్లబరచటం ప్రధానం

* వడదెబ్బ తగిలినవారి శరీరం చల్లబడేలా చూడటం ప్రధానం. ఎండలో ఉంటే వెంటనే నీడకు చేర్చాలి. వీలుంటే ఏసీ గదిలో పడుకోబెట్టాలి.
* బిగుతైన దుస్తులు.. టెర్లిన్‌, పాలిస్టర్‌ దుస్తులు ధరిస్తే తొలగించాలి. వదులైన, కాటన్‌ దుస్తులు వేయాలి. గాలి బాగా ఆడేలా చూడాలి.
* తడి గుడ్డతో ఒళ్లంతా తుడవాలి. శరీరం మీద నీళ్లు గుమ్మరించి ఫ్యాన్‌ గాలి తగిలేలా చూడాలి. ఐస్‌ ముక్కలను ప్లాస్టిక్‌ బ్యాగులో వేసి ఒళ్లంతా అద్దాలి. చంకల్లో, గజ్జల్లో తడి గుడ్డ గానీ ఐస్‌ ముక్కలు గానీ పెట్టినా మంచిదే.
* తాగగలిగే స్థితిలో ఉంటే లవణాలు, ఓఆర్‌ఎస్‌ కలిపిన నీరు తాగించాలి. మజ్జిగ, ఉప్పు, నిమ్మరసం కలిపిన మజ్జిగ, నీళ్లు అయినా ఇవ్వచ్చు. కొబ్బరి నీళ్లూ ఇవ్వచ్చు.
* ఒళ్లు కాలిపోతోందని పారాసిటమాల్‌, ఐబూప్రొఫెన్‌ వంటి మందులు ఇవ్వకూడదు. వడదెబ్బ తగిలినప్పుడు ఇవి ఉష్ణోగ్రతను తగ్గించవు.
* ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతుంటే, జ్వరం అంతకంతకూ పెరుగుతుంటే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. వడదెబ్బ చాలా త్వరగా ప్రాణాపాయానికి దారితీస్తుంది. కాబట్టి సత్వర చికిత్స అవసరం. ఆసుపత్రిలో ఐస్‌బాత్‌, సెలైన్‌ ఎక్కించటం వంటి వాటి ద్వారా ఉష్ణోగ్రత తగ్గేలా చేస్తారు. సెలైన్‌తో రక్తం పరిమాణం పెరిగి, రక్తపోటు మెరుగవుతుంది. చర్మానికి తగినంత రక్తం సరఫరా అవుతుంది. చెమట పట్టటం మొదలవుతుంది. అపస్మారక స్థితిలో ఉండి, శ్వాస సరిగా తీసుకోకపోతే కృత్రిమ శ్వాస కల్పించి, చికిత్స చేయాల్సి ఉంటుంది కూడా.


ముప్పు ఎవరికి?

చిన్న పిల్లలకు, వృద్ధులకు ముప్పు ఎక్కువ. వీరికి దాహం వేస్తున్న విషయం అంతగా తెలియదు. దీంతో నీరు తగినంత తాగరు. వీరిలో స్వేదగ్రంథులు తక్కువగా ఉండటం వల్ల చెమట అంత ఎక్కువగా పోయదు కూడా. వయసు మీద పడ్డవారిలో చాలామంది అధిక రక్తపోటు, గుండె, కిడ్నీ జబ్బులు, మానసిక సమస్యలకు మందులు వేసుకుంటుంటారు కూడా. వీటితోనూ వడదెబ్బ ముప్పు పెరగొచ్చు. తేమ ఎక్కువగా ఉండే తీర ప్రాంతాల వంటి చోట్ల నివసించేవారికీ దీని ముప్పు ఎక్కువే. ఇలాంటి ప్రాంతాల్లో చెమట బాగానే పోసినప్పటికీ త్వరగా ఆవిరి కాదు. దీంతో ఒళ్లు చల్లబడక, వడదెబ్బకు దారితీసే ప్రమాదముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని