మూత్ర వేదన వద్దు

మహిళలకు మూత్రకోశ ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. వీటి బారినపడితే నొప్పి, మంట, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి...

Published : 12 Jul 2016 01:49 IST

మూత్ర వేదన వద్దు

హిళలకు మూత్రకోశ ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. వీటి బారినపడితే నొప్పి, మంట, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావటం వంటివి తీవ్రంగా వేధిస్తాయి. ఈ ఇన్‌ఫెక్షన్లు యువతుల్లో తరచుగా కనబడుతుంటాయి. మధ్యవయసువారిలోనూ ఎక్కువే. మహిళల్లో వయసుతో పాటు మూత్రకోశ వ్యవస్థ గోడలు బలహీనం అవుతుంటాయి. దీంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పెరుగుతుంది. సాధారణంగా ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ సూక్ష్మక్రిములను చంపే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. మూత్రకోశ వ్యవస్థ గోడలు మందంగా, ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. అయితే నెలసరి నిలిచిన తర్వాత ఈస్ట్రోజెన్‌ స్థాయులు తగ్గుతూ వస్తాయి. దీంతో సూక్ష్మక్రిములను నిర్మూలించే సామర్థ్యమూ తగ్గుతుంది. మూత్రకోశ గోడలూ బలహీనమవుతాయి. అలాగే యోనిలో మంచి బ్యాక్టీరియా తగ్గి, చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవన్నీ మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లను తెచ్చిపెట్టేవే. అయితే తరచుగా మూత్రకోశ ఇన్‌ఫెక్షన్ల బారినపడేవారు కొన్ని జాగ్రత్తలతో వీటి ముప్పును తగ్గించుకోవచ్చు.

* మంచి బ్యాక్టీరియా పెంపు: యోనిలోకి వాడే ల్యాక్టోబాసిలస్‌తో కూడిన మాత్రలు మంచి, చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూస్తాయి. ఇవి తరచుగా మూత్ర ఇన్‌ఫెక్షన్ల బారినపడే మహిళలకు బాగా ఉపయోగపడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

* ముందు నుంచి వెనక్కి: మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాలో ఇ-కొలి ప్రధానమైంది. ఇది మలం నుంచి మూత్రకోశంలోకి వ్యాపిస్తుంది. అందువల్ల మహిళలు మల విసర్జన అనంతరం ముందు నుంచి వెనక్కి కడుక్కోవటం మంచిది.

* సంభోగానంతరం మూత్ర విసర్జన: సంభోగంలో పాల్గొన్న తర్వాత మూత్ర విసర్జన చేస్తే.. మూత్రకోశంలోకి బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం తగ్గుతుంది.

* నీళ్లు బాగా తాగాలి: మూత్రం పోస్తున్నప్పుడు బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి తరచుగా తగినంత నీరు తాగాలి. ముఖ్యంగా మూత్రం ఆపుకోలేని సమస్యతో బాధపడేవాళ్లు దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మరవకూడదు. ఎందుకంటే ఇలాంటి సమస్య గలవారు ఎక్కడ మూత్రం లీకవుతుందోనని భయపడుతూ నీళ్లు అంతగా తాగరు. ఇది ఇన్‌ఫెక్షన్‌ తలెత్తటానికి దారితీస్తుంది.


పురుషుల్లోనూ

మూత్రకోశ ఇన్‌ఫెక్షనుస్త్రీలల్లో ఎక్కువే అయినా పురుషుల్లోనూ కనబడొచ్చు. ఇందుకు వయసుతో పాటు వచ్చే శరీర మార్పులు దోహదం చేస్తాయి. మగవారిలో 50ల్లో ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బే అవకాశం పెరుగుతుంది. దీంతో మూత్రనాళం మీద ఒత్తిడి పెరిగి ప్రవాహం సన్నబడుతుంది. దీంతో తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. మూత్రం బొట్లు బొట్లుగా పడుతుంది. మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోతే ఇన్‌ ఫెక్షన్లకు దారితీస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని