పిల్లలకు జబ్బుచేస్తే?

పిల్లలకు ఏదైనా జబ్బు చేస్తే చాలామంది తల్లిదండ్రులు వారిని మంచం మీది నుంచి లేవనీయరు. జబ్బు తగ్గేవరకు పడుకోమనే చెబుతుంటారు. కానీ...

Published : 08 Nov 2016 01:26 IST

పిల్లలకు జబ్బుచేస్తే?

పిల్లలకు ఏదైనా జబ్బు చేస్తే చాలామంది తల్లిదండ్రులు వారిని మంచం మీది నుంచి లేవనీయరు. జబ్బు తగ్గేవరకు పడుకోమనే చెబుతుంటారు. కానీ చాలారకాల జబ్బుల్లో రోజంతా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరమేమీ ఉండదు. పిల్లలు కాస్త కోలుకున్నామని, లేచి ఆడుకోగలమని భావిస్తే.. వారిని ఇంట్లో ఆడుకోనివ్వటం మంచిది.

ఒకవేళ పిల్లలు మంచం మీది నుంచి లేవలేకపోతున్నా, విశ్రాంతి అవసరమని డాక్టర్‌ చెప్పినపుడు మాత్రం పిల్లలకు విసుగు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. నిజానికి జబ్బుతో ఉన్నప్పుడు పిల్లల్లో ఏకాగ్రత తగ్గుతుంది. ఎక్కువసేపు ఆడుకోవాలని ఉన్నా ఆడుకోలేరు. కొన్నిసార్లు పిల్లలు పెద్దవాళ్లు దృష్టి తమ మీద పడేందుకూ ప్రయత్నిస్తుంటారు. అందువల్ల వారిని దగ్గరుండి సముదాయిస్తే సంతోషిస్తారు. ఒక్కరినే పడకగదిలో పడుకోబెట్టటం కన్నా అందరూ తిరిగే చోట సోఫా మీద పడుకోబెట్టటం మంచిది. దీంతో పిల్లలు సంతోషిస్తారు. ఇంట్లోవాళ్లకు వారిని కనిపెట్టుకోవటమూ తేలికవుతుంది. పిల్లలకు వినోదం కలిగించే ప్రయత్నం చేస్తే వారిలో కొత్త హుషారు వస్తుంది. బొమ్మలు గీయటం, నోటుబుక్‌లో బొమ్మలు అతికించటం వంటి పనులు చేయించొచ్చు. వారికి ఇష్టమైన ఆటబొమ్మలను అందుబాటులో ఉంచాలి. వీలైతే దగ్గరుండి ఆడించాలి. ప్రేమగా నిమురుతూ సముదాయించాలి. ఇలాంటి పనులతో పిల్లలు ఎంతగానో సంతోషిస్తారు. జబ్బు నుంచి త్వరగా కోలుకోవటానికీ తోడ్పడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని