Fatty Liver: కాలేయం కొవ్వెక్కితే..

మనం కాలేయం గురించి పెద్దగా పట్టించుకోం గానీ ఇది మనకోసం ఎంత కష్ట పడుతుందో. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యతో (ఫ్యాటీ లివర్‌)

Updated : 09 Jan 2022 14:36 IST

మనం కాలేయం గురించి పెద్దగా పట్టించుకోం గానీ ఇది మనకోసం ఎంత కష్ట పడుతుందో. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యతో (ఫ్యాటీ లివర్‌) బాధపడుతుండటమే దీనికి నిదర్శనం. నిజానికి కాలేయం మహా మొండిది. దెబ్బతిన్నా తిరిగి కోలుకోవటానికే ప్రయత్నిస్తుంది. మరి మనం ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలా? కొవ్వు భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయకపోతే ఎలా?

కాలేయ కణాల్లో ఎంతో కొంత కొవ్వు ఉండటం మామూలే. శరీరంలో మిగతా అవయవాల మాదిరిగానే కాలేయంలోనూ కొవ్వు పోగుపడొచ్చు. కొంతవరకు ఉంటే ఇబ్బందేమీ ఉండదు గానీ మితిమీరితే కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కాలేయం చేసే పనులకు అడుగడుగునా అడ్డు తగులుతూ తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. కాలేయానికి కొవ్వు పట్టినా చాలామందిలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. దీంతో ఇది ఉన్నట్టు చాలామందికి తెలియనే తెలియదు. అందరిలా మామూలుగానే తిరుగుతుంటారు. అలాగని అసలేం కనిపెట్టలేమని కాదు. నిస్సత్తువ, కడుపు పైభాగంలో ఏదో అసౌకర్యం వంటివి కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే.

ఎందుకీ కొవ్వు?

కొన్నిరకాల జబ్బులు, జన్యువులు, ఆహారం, జీర్ణకోశ వ్యవస్థ.. ఇవన్నీ కాలేయానికి కొవ్వు పట్టే సమస్య తలెత్తటంలో పాలు పంచుకునేవే. దీన్నే నాన్‌ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌.. అంటే మద్యంతో సంబంధం లేని జబ్బు అనీ అంటారు. ఇదో దీర్ఘకాల సమస్య. మనదేశంలో 9% నుంచి 32% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. ఊబకాయం, మధుమేహంతో బాధపడేవారికి దీని ముప్పు ఎక్కువ. అధిక బరువు గలవారిలో 75% మందిలో, తీవ్ర ఊబకాయుల్లో 90% మందిలో ఇది కనిపిస్తుంటుంది. మితిమీరి మద్యం తాగటంతోనూ కాలేయానికి కొవ్వు పట్టొచ్చు. దీన్ని మద్యంతో ముడిపడిన కాలేయ సమస్యగా భావిస్తారు. మద్యం కాలేయంలో విచ్ఛిన్నమవుతుంది. అతిగా తాగితే ఇది విషతుల్యంగా మారుతుంది. కాబట్టే మద్యం, ఊబకాయం ఫ్యాటీ లివర్‌కు దారితీస్తాయని చాలాకాలంగా భావిస్తూ వస్తున్నారు. అయితే ఇతర అంశాలూ ఇందుకు దోహదం చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిల్లో ఒకటి రసాయనాల కాలుష్యం. రసాయన పరిశ్రమల్లో పనిచేసేవారిలో కాలేయ కొవ్వు సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్టు బయటపడింది. వీరంతా వినైల్‌ క్లోరైడ్‌ అనే రసాయనంతో పనిచేసినవారే. దీన్ని ప్లాస్టిక్‌ ఉత్పత్తులో వాడే పీవీసీని తయారుచేయటానికి ఉపయోగిస్తుంటారు. ఇదొక్కటే కాదు.. మరెన్నో రసాయనాలు కాలేయం మీద దుష్ప్రభావాలు చూపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మనం రోజూ ఇంట్లో వాడుకునే వస్తువులతో పాటు పర్యావరణంలోనూ ఇలాంటి రసాయనాలు ఉంటుండటం గమనార్హం. వీటికి ఊబకాయం వంటి ఇతరత్రా ముప్పు కారకాలు కూడా తోడైతే సమస్య మరింత జటిలమవుతుంది. రెండు వైపులా పదునున్న కత్తిలా దెబ్బతీస్తుంది. ఉదాహరణకు- అనారోగ్యకర ఆహారం తిన్నారనుకోండి. దీనికి రసాయనాల ప్రభావమూ తోడైతే ఆహారం దుష్ప్రభావాలు మరింత ఎక్కువవుతాయి.

రెండు రకాలు

కొవ్వు పట్టినా అందరికీ కాలేయం దెబ్బతినాలనేమీ లేదు. కానీ కాలేయంలో వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తొచ్చు. దీంతో కాలేయ కణాలు దెబ్బతినొచ్చు. ఇలాంటి దశను నాష్‌ (నాన్‌ఆల్కహాలిక్‌ స్టీటోహెపటైటిస్‌) అంటారు. ఇది ఇక్కడితో ఆగకుండా ముదిరితే కాలేయంలో చెరిగిపోని మచ్చ పడొచ్చు. కణజాలం గట్టిపడొచ్చు. తాళ్ల మాదిరిగా అవ్వచ్చు. దీన్నే సిరోసిస్‌ అంటారు. ఇది మరింత తీవ్రమై కాలేయం విఫలం కావొచ్చు. క్యాన్సర్‌కూ దారితీయొచ్చు. కాలేయ జబ్బు కొందరిలో ఎందుకు తీవ్రమవుతుంది? కొందరికి మామూలుగానే ఎందుకు ఉండిపోతోంది? అనే దానిపై పరిశోధకులు ఇప్పటికీ అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. అదృష్టమేంటంటే- కాలేయం దెబ్బతిన్నా తిరిగి కోలుకోవటానికి అవకాశముండటం. ఎందుకంటే కాలేయానికి తనకు తానే మరమ్మతు చేసుకునే శక్తి ఉంది మరి. అందువల్ల తొలిదశలోనే సమస్యను గుర్తించి, తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం.

గుర్తించేదెలా?

సాధారణంగా ఏదో సమస్య కోసం రక్త పరీక్షలు చేసినప్పుడు కాలేయ జబ్బు బయటపడుతుంటుంది. ఏవైనా లక్షణాలు కనిపించినా, ముప్పు ఎక్కువగా ఉన్నా డాక్టర్లు పరీక్షలు చేయిస్తుంటారు. ఇందుకోసం కాలేయ పనితీరును తెలిపే రక్త పరీక్షలు, స్కానింగ్‌ వంటివి ఉపయోగపడతాయి. ఇవి జబ్బు నిర్ధారణకే కాదు, తీవ్రతను గుర్తించటానికీ తోడ్పడతాయి. కాలేయ జబ్బు నాష్‌గా మారిందో లేదో తెలుసుకోవటానికి ఏకైక మార్గం చిన్న ముక్కను బయటకు తీసి పరీక్షించటం (బయాప్సీ). ఇందులో కాలేయ కణజాలం మీద మచ్చ ఏర్పడిందా? వాపుప్రక్రియ ఆనవాళ్లు కనిపిస్తున్నాయా? అనేవి బయటపడతాయి. అయితే బయాప్సీ చేయటం అంత తేలికైన పనికాదు. నొప్పితో కూడుకున్నది. రక్తస్రావం, కాలేయానికి చిల్లు పడటం, ఇన్‌ఫెక్షన్‌ తలెత్తటం వంటి వాటికీ దారితీయొచ్చు. బయాప్సీ చేసినా చాలామందిలో నాష్‌ బయటపడక పోవచ్చు కూడా. అందుకే శాస్త్రవేత్తలు అధునాతన స్కాన్‌ పరీక్ష పద్ధతిని రూపొందించారు. దీంతో కోత అవసరం లేకుండానే కాలేయంలో పోగుపడిన కొవ్వు మోతాదులను, మచ్చను గుర్తించటం తేలికగా మారిపోయింది.


తిరిగి సరిచేసుకోవచ్చు

తొలిదశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి సరిచేసుకునే అవకాశముంది. వీటిల్లో అన్నింటికన్నా సమర్థమైనవి జీవనశైలి మార్పులే. ముఖ్యంగా బరువు తగ్గించుకోవటం ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీర బరువులో సుమారు 7% తగ్గించుకున్నా చాలు. నాష్‌ నుంచి బయటపడొచ్చు. అదే కనీసం 10% బరువు తగ్గించుకుంటే కాలేయం గట్టిపడటాన్ని, మచ్చను వెనక్కి మళ్లించుకోవచ్చు. బరువు తగ్గితే గుండెపోటు, పక్షవాతం ముప్పులూ తగ్గుతాయి. మద్యంతో సంబంధం లేని కాలేయ కొవ్వు సమస్యతో బాధపడేవారిలో మరణాలకు గుండెజబ్బు ప్రధాన కారణంగా నిలుస్తుండటం గమనార్హం. కాబట్టి అధిక బరువు ఉన్నట్టయితే క్రమంగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

* మంచి పోషకాహారం తీసుకోవాలి. కొవ్వులు, నూనె పదార్థాలు తగ్గించాలి. సంతృప్త కొవ్వులకు బదులు అసంతృప్త కొవ్వులతో కూడిన చేపలు, అవిసె గింజలు, అక్రోట్ల వంటివి తినటం మంచిది. పండ్లు, కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.

* కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. దీంతో పురుగు మందుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు.

* చక్కెర ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులు, స్పోర్ట్స్‌ డ్రింకులు, పానీయాల వంటి వాటికి దూరంగా ఉండాలి.

* మద్యం జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఒకవేళ అలవాటుంటే మితం పాటించాలి.

* పొగ తాగితే మద్యంతో సంబంధం లేని కాలేయ కొవ్వు సమస్య ముప్పు పెరుగుతుంది. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి తాగొద్దు.

* రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలేయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

* నాష్‌తో బాధపడేవారిలో విటమిన్‌ ఇ, కొన్నిరకాల మధుమేహ మందులు బరువు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని