జ్ఞానోదయం

పూర్వం అవంతీ రాజ్యాన్ని జయవర్ధనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంచి అందగాడు. ఆయన తన అందాన్ని ఎవరైనా పొగిడితే ఉబ్బిపోయేవాడు. దాన్ని ఆసరాగా తీసుకొని అధికారులు, ఇతర రాజోద్యోగులు ఆయన్ను ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడి తమ పబ్బం గడుపుకొంటూ ఉండేవారు. ఒకరోజు ఓ అధికారి ‘ప్రభూ.! మిమ్మల్ని బ్రహ్మ తన శక్తి యుక్తులన్నీ ధారపోసి సృష్టించాడు. అందులో సందేహమే లేదు.

Updated : 21 Dec 2021 06:17 IST

పూర్వం అవంతీ రాజ్యాన్ని జయవర్ధనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంచి అందగాడు. ఆయన తన అందాన్ని ఎవరైనా పొగిడితే ఉబ్బిపోయేవాడు. దాన్ని ఆసరాగా తీసుకొని అధికారులు, ఇతర రాజోద్యోగులు ఆయన్ను ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడి తమ పబ్బం గడుపుకొంటూ ఉండేవారు.

ఒకరోజు ఓ అధికారి ‘ప్రభూ.! మిమ్మల్ని బ్రహ్మ తన శక్తి యుక్తులన్నీ ధారపోసి సృష్టించాడు. అందులో సందేహమే లేదు. ప్రపంచంలో ఇంతటి అందం కలిగిన మరొకరు ఉంటారని మేం అనుకోలేం’ అన్నాడు. తనేం తక్కువ తినలేదని నిరూపించుకోవడానికి.. మరొక రాజోద్యోగి ‘ఇలాంటి అందగాడు.. ఒకప్పుడు ఈ భూమ్మీద పుట్టి పెరిగాడంటే రాబోయే తరాలవారు నమ్మరు. అందుకని మనం రాజ్యం అంతా మీ శిల్పాలు చెక్కించి, వీధుల మధ్యలో ఉంచితే అందరూ కళ్లారా చూసి మీ అందాన్ని వేనోళ్లతో కీర్తిస్తారు’ అన్నాడు. ఆ మాటతో రాజు ఆనందపడిపోయాడు. వెంటనే రాజ్యంలోని శిల్పులందరిని పిలిపించాడు. ఆగమేఘాల మీద తన రూపంతో శిల్పాలు చెక్కమన్నాడు. వారికి తగిన జీతభత్యాలు ఏర్పాటు చేశాడు. వాళ్లు రాత్రింబవళ్లు పనిచేసి, రాజు చెప్పిన పని పూర్తి చేసి, రాజ్యం అంతటా వీధుల మధ్యలో విగ్రహాలను నిలబెట్టారు.

తర్వాత రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన తన రాజ్యంలోని గూఢచారులను పిలిచి విగ్రహాలను చూసిన ప్రజలు తన గురించి, తన అందచందాల గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని రమ్మన్నాడు. వాళ్లు వెళ్లి రాజ్యంలో తిరగసాగారు. ఒకచోట విగ్రహాలను ఉద్దేశించి ఇద్దరు..  ‘విగ్రహాలను శిల్పులు అద్భుతంగా చెక్కారురా.. వాళ్ల ప్రతిభను మనం వేనోళ్లు కీర్తించినా తనివి తీరదు.. అసలు విషయం ఏంటంటే, చాలారోజులుగా మన రాజ్యంలో ప్రతిభావంతులైన శిల్పులు జీవనోపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు.. రాజుగారి అందం సంగతి దేవుడెరుగు, కానీ వాళ్లకు కొంత ఉపాధి దొరికింది. అదే పదివేలు. ఇందుకు మనం రాజుగారికి కృతజ్ఞతలు తెలపాలి’ అంటూ మాట్లాడుకుంటున్నారు.

మరో చోట ‘అందం శాశ్వతమా.. రాజుగారి పిచ్చిగానీ.. ఏమయితేనేం రాళ్లు తొలిచేవారి దగ్గర నుంచీ శిల్పులదాకా అందరికీ బతుకుదెరువు దొరికింది అంతే చాలు’ అని అనుకుంటున్నారు. ఇదంతా విన్న గూఢచారులు.. రాజుగారి దగ్గరకు వెళ్లి ప్రజలు ఏమనుకుంటున్నారో ఉన్నది ఉన్నట్లు చెప్పారు. అది విన్న రాజు ‘ నా అందచందాల గురించి ఒక్కరూ మాట్లాడలేదా’ అంటూ నీరసంగా వాళ్లను ప్రశ్నించాడు. ‘లేదు ప్రభూ..! అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని ఎవరూ విమర్శించలేదు. పైపెచ్చు చాలామందికి బతుకుదెరువు చూపించారని పొగిడారు’ అన్నారు ఆ గూఢచారులు. రాజుకు వారి మాటలు నిరాశ కలిగించాయి. కానీ ఆలోచనలు రేకెత్తించాయి. అధికారులు, రాజోద్యోగులు ఇంతకాలం పొగడ్తలతో తనను తప్పుదోవ పట్టించారు. ‘ప్రజలు రాజు అందచందాల గురించో, రాజు భోగ భాగ్యాల గురించో మాట్లాడుకోరు. ఏ విధంగానైనా వాళ్లకు మేలు కలిగితే ఆనందిస్తారు.. ప్రశంసిస్తారు. అంతే తప్ప వారికి రాజుగారి వ్యక్తిగత గొప్పలతో పనిలేదు’ అని ఆలస్యంగా తెలుసుకున్నాడు రాజు.
ఇక ఆలస్యం చేయకూడదు, తప్పు దిద్దుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. పొగడ్తలకు పొంగే గుణాన్ని వదిలి పెట్టాడు. ప్రజలకు మేలు చేసే పనులకు శ్రీకారం చుట్టాడు. తరతరాలు తనను ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ప్రజల బాగోగులు చూస్తూ తన శరీరంతో పాటూ మనసూ అందమైనదని రుజువు చేసుకున్నాడు.

- గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని