మంత్రి ఎంపిక

విదర్భ దేశపు మంత్రి ముకుందుడు వృద్ధుడు కావడంతో.. బాధ్యతల నుంచి తప్పుకుంటానని, తన కొడుకు శోభితుడికి ఆ పదవిని ఇమ్మని మహారాజును కోరాడు. అలా కాకుండా పోటీలు నిర్వహిద్దామని, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేద్దామన్నాడు రాజు. శోభితుడిని కూడా పోటీల్లో పాల్గొనమన్నాడు. మంత్రి పదవికి జరిపిన ఎంపిక పరీక్షల్లో శోభితుడు, సైన్యాధిపతి కుమారుడు వరుణుడు సహా యువకులెందరో పాల్గొన్నారు.

Updated : 29 May 2022 00:32 IST

విదర్భ దేశపు మంత్రి ముకుందుడు వృద్ధుడు కావడంతో.. బాధ్యతల నుంచి తప్పుకుంటానని, తన కొడుకు శోభితుడికి ఆ పదవిని ఇమ్మని మహారాజును కోరాడు. అలా కాకుండా పోటీలు నిర్వహిద్దామని, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేద్దామన్నాడు రాజు. శోభితుడిని కూడా పోటీల్లో పాల్గొనమన్నాడు. మంత్రి పదవికి జరిపిన ఎంపిక పరీక్షల్లో శోభితుడు, సైన్యాధిపతి కుమారుడు వరుణుడు సహా యువకులెందరో పాల్గొన్నారు.

వాళ్లందరిలో రైతు కుమారుడు విజయుడు అసాధారణ ప్రతిభ చూపించి పదవికి ఎంపికయ్యాడు. ఆరుమాసాల తరువాతనే విజయుడికి పదవీ బాధ్యతలనిద్దామని, అంతవరకు శిక్షణ ఇమ్మని ముకుందుడికి చెప్పాడు రాజు. మంత్రిగారి నివాసం పక్కనే ఉన్న వసతిగృహాన్ని విజయుడికి ఇవ్వమని ఆజ్ఞాపించాడు.

‘అవన్నీ నేను చూసుకుంటాను’ అని రాజుగారితో చెప్పాడు మంత్రి. భటుల నివాస గృహాల మధ్యన ఉన్న పాడుబడిన ఇంటిని విజయుడికి కేటాయించాడు మంత్రి. ఒక చాప, బొంత, పరిమితమైన వంట సామగ్రి మాత్రమే ఉన్నాయక్కడ. రాజుగారు చెప్పింది పెడచెవిన పెట్టి, ఇలాంటి ఇంటిలో ఉండమన్నందుకు బాధపడ్డాడు విజయుడు.

ఆ రాత్రి పడుకోబోయే ముందు ఒక భటుడు... ‘ఉదయాన్నే పదిహేను కోసుల దూరంలోని రాజవరం గ్రామానికి తనిఖీల కోసం వెళ్లాలి.. మంత్రిగారు బయల్దేరమన్నారు’ అని విజయుడితో చెప్పాడు. తొందరగా లేచి మంత్రిగారి నివాసానికి వెళ్లాడు విజయుడు. అప్పటికే ఆయన వెళ్లిపోయినట్టు, రెండు రోజుల తరువాత తిరిగొస్తారని వాళ్లింట్లో వారు చెప్పారు.

కాబోయే మంత్రిని తనతోపాటు గుర్రపు బగ్గీలో తీసుకెళ్లొచ్చు కదా. ఎందుకిలా చేశాడు? ఇప్పుడెలా వెళ్లాలని బాధపడ్డాడు విజయుడు. కొంత దూరం కాలినడకన, ఇంకొంత దూరం ఎడ్లబండి మీద ప్రయాణించి ఎలాగో ఊరు చేరుకున్నాడు. విజయుడిని చూసి కూడా చూడనట్టే ప్రవర్తించాడు మంత్రి. పరిచయమేదీ చెయ్యకుండా సాధారణ పౌరుడిలాగా నిలబెట్టాడు. అదంతా అవమానంగా భావించాడు విజయుడు. పదిరోజుల తర్వాత ఆనకట్ట నిర్మాణ పనుల పర్యవేక్షణకు వెళదామని చెప్పాడు మంత్రి.

విజయుడు వెళ్లే సరికే వెళ్లిపోయాడాయన. ఎంతో కష్టపడి ఆయన చెప్పిన చోటుకు వెళ్లాడు విజయుడు. అక్కడా విజయుడెవరో తెలియనట్టే ప్రవర్తించాడు మంత్రి. మధ్యాహ్న భోజన ఏర్పాట్లప్పుడు కూడా తనకొక్కడికే చెయ్యమన్నాడు మంత్రి. పూటకూళ్ల ఇల్లు వెతుక్కుని భోంచేసి వచ్చాడు విజయుడు.

ఇంకొన్ని రోజుల తరువాత మరో గ్రామంలో కొట్లాటలవుతున్నాయని, వాటిని పరిష్కరించి రమ్మని విజయుడితో చెప్పాడు మంత్రి. భటుల సాయం కావాలని అడిగిన విజయుడితో ‘నువ్వెళుతున్నది యుద్ధానికి కాదు. కొట్లాట పరిష్కారానికి.. భటులెందుకు’ అన్నాడాయన. ఆ ఊళ్లోకెళ్లి తనను పరిచయం చేసుకుని సమస్యను పరిష్కరించాడు విజయుడు. ‘నా పక్కన కనీసం ఓ భటుడున్నా బాగుండేది. నన్ను పరిచయం చేసేవాడు’ అనుకున్నాడు మనసులో. మొత్తానికి విజయుడి ఆరునెలల శిక్షణ కష్టంగా పూర్తైంది. ఆయన కొడుక్కి దక్కాల్సిన పదవిలోకి వచ్చినందుకు కోపంతోనే మంత్రిగారు అలా ప్రవర్తించారని అనుకున్నాడు విజయుడు.

పదిరోజుల్లో మంత్రి బాధ్యతలు అప్పగిస్తారనగా మంత్రిగారిలో మార్పు వచ్చింది. కాబోయే మంత్రి అని పరిచయాలు చేయడం, తన పక్కనే ఆసనం వేయించి గౌరవించడం, గుర్రపు బగ్గీలో పక్కనే స్థానమివ్వడం, విందు భోజనాల్లో సమాన స్థాయి కల్పించడం చేశాడు.

తనలోని కోపాన్ని తగ్గించి మంచి చేసుకోవడానికే ఇదంతా చేస్తున్నాడని అనుకున్నాడు విజయుడు. బాధ్యతలు అప్పగించే రోజు ఉదయం విజయుడితో ఏకాంతంగా మాట్లాడాడు మంత్రి ముకుందుడు. ‘శిక్షణ కాలంలో నిన్ను కావాలనే దూరంగా ఉంచాను. అందుకు ఎంతో బాధ పడేవాణ్ని. కానీ తప్పలేదు. నువ్వు పని నేర్చుకోవాలంటే కష్టాలు తప్పవు. నా పక్కనే గుర్రపు బగ్గీలో నిన్ను తిప్పుతుంటే నిన్ను కూడా మంత్రి లాగానే చూస్తారు పౌరులు. మనస్సు విప్పి ఏమీ చెప్పుకోలేరు. అందుకే మంత్రిగా కాకుండా విజయుడిగానే వారితో తిరిగేలా చేశాను. ప్రజలతో కలవాలని, జరుగుతున్నవన్నీ తెలుసుకోవాలని, కింది వాళ్ల మంచి చెడులు, కష్టసుఖాలు స్వయంగా చూసి, అనుభవించి విషయాలను నువ్వు అర్థం చేసుకోవాలనే ఇదంతా చేశాను. భటుల నివాసగృహంలో ఉంచడానికి కారణమూ అదే. ఇప్పుడు నీకొచ్చిన అనుభవం పదవిలో ఉండగా పదేళ్లకు కూడా రాదు. అందువల్ల ఇబ్బందులు వచ్చేవి కూడా. చేద్దామనుకున్నది చేయలేకపోయేవాడివి. ఇప్పుడు ఎంతో నేర్చుకున్నావు. అందుకు సంతోషిస్తున్నాను. ముఖ్యమైన మాట చెబుతాను విను. రాజసేవ పూలపాన్పు కాదు. పదవి అనేది ముళ్ల కిరీటం. కష్టాన్ని కూడా సులువుగా తీసుకునే ఓర్పు ఇప్పుడు నీకుంది. కాబట్టి అంతా మంచి జరుగుతుంది’ అని భరోసానిచ్చాడు. అనుభవజ్ఞుడైన మంత్రిగారు ముందుచూపుతో వ్యవహరించాడని, ఆయన ప్రవర్తనను అపార్థం చేసుకున్నానని గ్రహించాడు విజయుడు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని పాదాభివందనం చేశాడు.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు