ఈ బడి.. ఒక ప్రయోగశాల..

నేస్తాలూ..! అక్కడి పిల్లలు బడికి వెళ్లడానికి అస్సలు మారాం చేయరు. ఎప్పుడెప్పుడు స్కూలుకు వెళదామా అని ఎదురు చూస్తారు. అంత ప్రత్యేకత ఏముందబ్బా అంటారా? అయితే చదివేయండి..

Updated : 29 Oct 2021 00:23 IST

నేస్తాలూ..! అక్కడి పిల్లలు బడికి వెళ్లడానికి అస్సలు మారాం చేయరు. ఎప్పుడెప్పుడు స్కూలుకు వెళదామా అని ఎదురు చూస్తారు. అంత ప్రత్యేకత ఏముందబ్బా అంటారా? అయితే చదివేయండి..

కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని భుతరమనహట్టి అనే ఊళ్లో ఉందీ పాఠశాల. ఇదొక ప్రభుత్వ పాఠశాల. కానీ ప్రైవేట్‌ పాఠశాలకు ధీటుగా ఉంటుంది. ఇందులో ఆరువేల పుస్తకాలతో లైబ్రరీ ఉంది. అన్ని సౌకర్యాలతో సైన్స్‌ లేబొరేటరీ ఉంది. ఇందులో డీఎన్‌ఏ నమూనాలు, మట్టి నమూనాలతో పాటు సూక్ష్మదర్శిని వంటి పరికరాలూ ఉన్నాయి. ఇంకా విశాలమైన ఆట స్థలం, రంగు రంగుల తరగతి గదులు, ఆధునిక మరుగుదొడ్లు ఇలా అన్ని సౌకర్యాలతో ఉంటుంది.

ప్రయోగాల నిలయం..

ఇక్కడ పాఠాలన్నీ ప్రయోగాత్మకంగానే చెబుతారు. ఉదాహరణకు అంతరిక్షం గురించి చెప్పాలనుకో.. గ్రౌండ్‌లోకి తీసుకెళ్లి నక్షత్రాలు, గ్రహాలకు సంబంధించిన నమూనాలను గీసి, పాఠం చెబుతారు. పర్యావరణం గురించి తెలియాలంటే అక్కడ మొక్కల్ని వాళ్లతోనే నాటించి, ప్రయోగాత్మకంగా మొక్కల పెరుగుదల, ఎరువుల వాడకం, తెగుళ్ల నివారణ ఇలా అన్నింటిని మన నేస్తాల చేతనే చేయించి పాఠం చెబుతారు. చూసి నేర్చుకోవడం ద్వారా ఎంతో ఆసక్తి చూపించడంతో పాటు పరీక్షల్లో అందరూ మంచి మార్కులు సాధిస్తున్నారు ఇక్కడి విద్యార్థులు.

ఆ మాస్టారి వల్లనే సాధ్యమైంది..

ఇంతకు ముందు ఈ పాఠశాల అన్నింటిలానే ఉండేది. కానీ బసవరాజు సుంగారి అనే మాస్టారు.. ఈ పాఠశాలలో అడుగు పెట్టాక అంతా మార్చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యారులకు లేనిది ప్రతిభ కాదు వసతులు అని అందరిలో అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడి పిల్లలకు కావల్సిన వసతుల్ని కల్పిస్తే మంచి మార్కులే కాక స్కూలుకు కూడా మంచి పేరొస్తుందని వాళ్లను ఒప్పించారు. అలా మొదటగా ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ అనే చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారానికి ఒకసారి ఈ ప్రోగ్రామ్‌లో పది ప్రశ్నలు అడుగుతారు. ఎవరైతే సమాధానం చెబుతారో వాళ్లకు ప్రశ్నకు పది రూపాయల చొప్పున ఇచ్చేలా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీనికి ప్రధానోపాధ్యాయుడే స్పాన్సర్‌ అన్నమాట. పిల్లల్లోని ఉత్సాహం చూశాక, ఇలాంటి మరిన్ని ఈవెంట్లు పెడుతూ వాళ్లలో బడికి రావాలనే ఆసక్తిని( పెంచారు. అలా మొదలు పెట్టిన ఈ బడి.. ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏదైనా అనుకుంటే సాధ్యమే కదా... నేస్తాలూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని