బామ్మ పంచిన విజ్ఞానం!

గుడికి వెళుతున్న బామ్మ చెయ్యి పట్టుకుని అటొకరు, ఇటొకరు నడుస్తున్నారు రవి, గోపి. వాళ్లిద్దరూ ఆమె మనవళ్లు. తొమ్మిది, ఆరో తరగతి చదువుతున్నారు. బామ్మంటే ఊళ్లో అందరికీ ఇష్టమే. ఆవిడకు తెలియని పద్యం, రాని శ్లోకం ఉండదని అంటారు.

Updated : 25 Aug 2022 04:54 IST

గుడికి వెళుతున్న బామ్మ చెయ్యి పట్టుకుని అటొకరు, ఇటొకరు నడుస్తున్నారు రవి, గోపి. వాళ్లిద్దరూ ఆమె మనవళ్లు. తొమ్మిది, ఆరో తరగతి చదువుతున్నారు. బామ్మంటే ఊళ్లో అందరికీ ఇష్టమే. ఆవిడకు తెలియని పద్యం, రాని శ్లోకం ఉండదని అంటారు. ఒక గుడిసె ముందు నుంచి ముగ్గురూ వెళుతుంటే అయిదేళ్ల అమ్మాయికి అన్నం తినిపిస్తున్న మహిళ వీళ్లను చూసింది. అన్నం పళ్లెం పక్కన పెట్టేసి అమ్మాయిని దీవించమని బామ్మ ముందుకు తీసుకొచ్చిందామె. బామ్మ అలాగే చేసింది.

ఆ అమ్మాయి బామ్మ కాళ్లకు చుట్టుకుని, ముద్దు మాటలతో... ‘పాలబువ్వ తింటున్నా’ అని నోరు చూపించింది. అది పాలబువ్వ కాదని బామ్మ కనిపెట్టేసింది. ‘పాలబువ్వేనా?’ అనడిగింది అమ్మాయి తల్లిని. ‘మీ దగ్గర అబద్ధం చెప్పలేను. ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుతుంటే వాళ్లు పాలబువ్వ తిన్నామని చెప్పారట. పాప కూడా పాలబువ్వ కావాలని ఏడుస్తుంటే, సమయానికి ఇంట్లో పాలు లేకపోవడంతో అన్నంలో చిక్కటి గంజి కలిపాను. తీపి కోసం బెల్లం ముక్క కలిపానమ్మా’ అంది బామ్మకు మాత్రమే వినబడేటట్టు.

‘సాయంత్రం వచ్చావంటే గ్లాసుడు పాలిస్తాను. పాపకు పాలబువ్వ తినిపించు’ అనేసి బామ్మ ముందుకు నడిచింది. వాళ్ల మాటలు విన్న గోపి... ‘పాలబువ్వకు, గంజన్నానికి తేడా పాపకు తెలియలేదా బామ్మా?’ అనడిగాడు. ‘చిన్న వయసు కదరా! తేడా తెలుసుకోలేనంత అమాయకత్వం ఉంటుంది. అది తెలియకే పాపం.. హాయిగా తినేస్తోంది’ అని బదులిచ్చింది బామ్మ.

గుడి ముందు కొబ్బరికాయల కొట్టు దగ్గరకు వెళ్లారు ముగ్గురూ. అప్పటికి కొట్టు యజమాని లేడు. పదో తరగతి చదివే అతడి కొడుకున్నాడు. అప్పటికే ఒక భక్తుడు పూజా సామగ్రి కొనేసి రద్దైపోయిన అయిదు వందల కాగితాన్ని కుర్రాడికిచ్చాడు. దాన్ని గల్లా పెట్టెలో పడేసి, మిగతా డబ్బివ్వబోయాడు కుర్రాడు. జరిగిన మోసం గ్రహించిన బామ్మ ఆ కుర్రాడిని హెచ్చరించింది. అప్పుడా భక్తుడు పొరపాటైందని క్షమాపణ చెప్పాడు. నోటు కూడా మార్చాడు.

అది చూసిన రవి... ‘ఈ కుర్రాడిదీ అమాయకత్వమేనా?

రద్దైన నోటుకూ, చెలామణిలో ఉన్న నోటుకూ తేడా తెలుసుకోలేదు’ అనడిగాడు. వెంటనే బామ్మ... ‘ఊహూ.. వాడిది అమాయకత్వం కాదు. అజ్ఞానం’ అంది. ‘అదేంటి బామ్మా.. ఇందాకేమో అమ్మాయిది అమాయకత్వం అన్నావు. ఇప్పుడేమో అబ్బాయిది అజ్ఞానం అంటున్నావు. నాకేమీ అర్థం కావడం లేదు. కాస్త అయోమయంగా ఉంది’ అన్నాడు రవి.

‘మనం దర్శనం చేసుకుని వచ్చాక, ఇంటికెళుతూ మాట్లాడుకుందాం’ అనేసి పూజాసామగ్రి కొనడంలో లీనమైంది బామ్మ. తిరిగి వెళుతున్నప్పుడు రవి.. ‘బామ్మా! అమాయకత్వానికి, అజ్ఞానానికి తేడా ఉందా? ఇప్పుడు చెప్పు బామ్మా’ అనడిగాడు. ‘ఉంది. ఇందాక అన్నం తింటున్న అమ్మాయిది చిన్న వయసు. అభం శుభం తెలియని అమాయకురాలు. ఆ వయసులో పాల రుచి, గంజన్నం రుచి తెలుసుకోలేని అమాయకత్వం వాళ్లలో ఉంటుంది. కొట్లో కుర్రాడేమో పదో తరగతి చదువుతున్నాడు. ఆ వయసు వాడికి రద్దైన నోటేదో, చలామణిలో ఉన్న నోటేదో.. తెలియదంటే అమాయకత్వం అనకూడదు. అజ్ఞానం అనాలి’ అని చెప్పింది బామ్మ.

ఎందుకు అనకూడదో వివరంగా చెప్పమని మనవలిద్దరూ బతిమాలేసరికి, బామ్మ సరేనంది. ‘మేజిక్‌ షోలలో మెజీషియన్‌ డబ్బు నోట్లను సృష్టించడం చూసే ఉంటారు కదా. అలా సృష్టిస్తున్న అతడి కౌశల్యం చూసి ఆనందించడం అమాయకత్వం. అతడెప్పుడూ అలాగే డబ్బునే సృష్టించుకుని ఖర్చులకు వాడుకుంటాడని నమ్మడం అజ్ఞానం. ఒక విధంగా చెప్పాలంటే నష్టం లేని ఆనందం పేరే అమాయకత్వం. నష్టం కలిగించే అమాయకత్వం ఏదైనా సరే అది అజ్ఞానమే’ అంది బామ్మ.

తర్వాత మనవళ్ల ముఖాల వైపు చూసింది. వాళ్ల కళ్లల్లో వెలుగు కానీ, సంతోషం కానీ కనబడకపోయేసరికి వాళ్లకు అర్థం కాలేదని బామ్మ పోల్చుకుని ఇంకా ఇలా చెప్పింది. ‘ఆకాశంలో కనబడే చందమామలో కుందేలు ఉందనుకోవడం అమాయకత్వం. అందాల చందమామ మేఘాల మీద కూర్చుని తిరుగుతున్నాడని భ్రమ పడడం అజ్ఞానం. చంద్రుడు ఓ ఉపగ్రహమని, సూర్యుడి కాంతి పడడం వల్ల వెలుగు ఇస్తున్నాడని తెలుసుకోవడం జ్ఞానం. ఈ మూడింట్లో సున్నితమైన తేడా ఉంది. అది గ్రహించాలి. కొంత వయసు వచ్చేసరికి అమాయకత్వాన్ని వదిలేసి, చదువు నేర్చుకొని తగిన జ్ఞానాన్ని సంపాదించాలి పిల్లలంతా. దాంతోపాటు లోకజ్ఞానం కూడా పెంచుకోవాలి. లేకపోతే చిన్న వయసు పిల్లల అమాయకత్వానికి మురిసిపోయి ముద్దు చేసినవాళ్లే, పెద్దవుతున్న కొద్దీ ప్రవర్తనలో తెలివి చూపకపోతే అవహేళన చేస్తారు. చిన్నవయసులో మాత్రమే ఆనందించి వదిలెయ్యకపోతే, వయసొచ్చాక అదే అజ్ఞానంగా మారిపోతుంది. అందుకే పాఠ్యపుస్తకాలతో పాటు లోకజ్ఞానం పెంచే పుస్తకాలూ, కథలు చదవాలి. తెలియనివి అమ్మానాన్న, గురువుల్ని అడిగి తెలుసుకోవాలి’ అంది బామ్మ. ‘నువ్వు చెప్పినట్టే పుస్తకాలు చదువుతాం. జ్ఞానం పెంచుకుంటాం. అజ్ఞానాన్ని దూరం చేసుకుని తెలివితో ప్రవర్తిస్తాం’ అన్నారు రవి, గోపి ఒకేసారి. మనవళ్లిద్దరినీ మనస్ఫూర్తిగా దీవించింది బామ్మ.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని