మనవళ్లకు తాతల పాఠం!

గోపాలం, భూపాలం ఇరుగుపొరుగున ఉంటారు. ఇద్దరికీ ఒకే వయసున్న మనవళ్లు ఉన్నారు. పేర్లు గోపి, గిరి. ఇద్దరూ ఏడో తరగతి చదువుతున్నారు. గోపి హుషారుగా, చలాకీగా ఉంటాడు. గిరి మాత్రం నీరసంగా, నిస్సత్తువగా కనబడుతుంటాడు. ‘గిరి ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటాడు’ అని గోపాలంతో ఓసారి మాటల సందర్భంలో అన్నాడు భూపాలం.

Updated : 12 Sep 2022 06:32 IST

గోపాలం, భూపాలం ఇరుగుపొరుగున ఉంటారు. ఇద్దరికీ ఒకే వయసున్న మనవళ్లు ఉన్నారు. పేర్లు గోపి, గిరి. ఇద్దరూ ఏడో తరగతి చదువుతున్నారు. గోపి హుషారుగా, చలాకీగా ఉంటాడు. గిరి మాత్రం నీరసంగా, నిస్సత్తువగా కనబడుతుంటాడు. ‘గిరి ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటాడు’ అని గోపాలంతో ఓసారి మాటల సందర్భంలో అన్నాడు భూపాలం.

‘చదువుకు సంబంధించిన ఒత్తిడి అయి ఉంటుంది’ అని బదులిచ్చాడు గోపాలం. ‘గోపిది కూడా అదే తరగతి. బాగానే ఉంటాడుగా మరి’ తిరిగి అడిగాడు భూపాలం. ‘అవును.. నిజమే’ అని జవాబిచ్చాడు గోపాలం. అలా భూపాలాన్ని కొన్ని ప్రశ్నలడిగి జవాబులు రాబట్టాడు గోపాలం. ‘రేపు తెల్లారుతూనే గిరిని నిద్ర లేపు. నేను గోపిని తీసుకొస్తాను. కలిసి అలా బయట తిరిగొద్దాం’ అని చెప్పాడు గోపాలం. సరేనన్నాడు భూపాలం.  
మర్నాడు పొద్దున్నే మనవళ్లతో కలసి బయల్దేరారు తాతయ్యలు. గోపాలం చేతిలో వస్త్రంతో చేసిన సంచి ఉంది. బయట సన్నగా మంచు కురుస్తుండడంతో పిల్లలకు చలిగా ఉంది. అరచేతులు రుద్దుకోమని తాతయ్యలు చెప్పగానే.. పిల్లలు అలాగే చేశారు. కాస్త నయంగా అనిపించడంతో హుషారుగా నడిచారు మనవళ్లు.

కొంత దూరం వెళ్లేసరికి ఒక కూడలి వచ్చింది. అక్కడ మూసివేసి ఉన్న దుకాణం ముందు ఇద్దరు బిచ్చగాళ్లు చలికి వణుకుతూ కూర్చున్నారు. సంచిలో చెయ్యి పెట్టి రెండు దుప్పట్లు తీశాడు గోపాలం. పిల్లలిద్దరి చేతుల్లో పెట్టి వాళ్లకు ఇమ్మన్నాడు. పిల్లల చేతుల మీదుగా వాటిని అందుకుని దీవించారు బిచ్చగాళ్లు.

అక్కడికి కాస్త దూరంలో నాలుగు ఆవులు కూర్చొని నెమరు వేస్తున్నాయి. ఈసారి అరటి పండ్లను బయటకు తీసి పిల్లలకిచ్చి, ఆ ఆవులకు పెట్టమన్నాడు గోపాలం. ఆ పండ్లను నోటితో అందుకుని తిన్నాయవి. పిల్లల ముఖాల్లో సంతోషం కనబడింది.

ఇంకోచోట కుక్కలున్నాయి. సంచిలో చెయ్యి పెట్టి బిస్కెట్లను తీసిచ్చాడు గోపాలం. గిరి భయపడుతుంటే.. ‘ఫర్వాలేదు.. అవేమీ చెయ్యవు’ అని ధైర్యంగా బిస్కెట్లను కుక్కల నోటికి అందించాడు గోపి. బిస్కెట్లను తిన్న కుక్కలు తోక ఊపుతూ వాళ్లిద్దరి చుట్టూ తిరిగాయి. వాటిని చూసి పిల్లలిద్దరూ ఆనందించారు.

తర్వాత కాసేపటికి కొంత దూరంలో ఉన్న ఓ ఉద్యానవనంలోకి వెళ్లారు. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. పిల్లలను ఆడుకోమని వదిలేసి, తాతయ్యలు నడక దారిలో వేగంగా నడవసాగారు. కాసేపయ్యాక.. మనవళ్లు దగ్గరకు రాగానే ఉద్యానవనానికి మరో వైపున్న పెద్ద వృక్షం దగ్గరకు తీసుకెళ్లాడు గోపాలం. అక్కడ కాకులు, ఇతర పక్షులు ఉన్నాయి. సంచి నుంచి తిండి గింజలున్న పొట్లం తీసి పిల్లలకిచ్చాడు. పక్షుల వైపు చల్లమనగానే.. పిల్లలిద్దరూ అలాగే చేశారు.

ఇంటికి తిరిగి వెళుతుండగా.. మనవళ్లను ఓ పాల వ్యాపారి ఇంటికి తీసుకెళ్లాడు గోపాలం. మూత ఉన్న పాత్రను ఇచ్చి పాలు పోయించుకున్నాడు. పశువులు, చెంగుచెంగున ఎగురుతున్న దూడల్ని చూస్తూ కొత్త అనుభూతి పొందారు పిల్లలు. అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు గిరి ముఖంలో ఏదో తెలియని కళను గమనించాడు భూపాలం. అతడి నడక, ప్రవర్తన ఆయనకు ఎంతో తృప్తిగా అనిపించాయి. ‘వెంటనే ఏం మాయ చేశారో కానీ గిరి ప్రవర్తన ఆశ్చర్యంగా మారిపోయింది’ అని గోపాలంతో అన్నాడు భూపాలం.

గోపాలం నవ్వేసి ‘ఏ మాయా లేదు. బడిలో చదువులు, ఇంటి పని అంటూ పిల్లలపై విపరీతమైన ఒత్తిడి పెడుతున్నాం. దాన్ని దూరం చేసేందుకు ఒకప్పుడు ఆటలు ఆడించేవారు. ఇప్పుడు బడిలో ఆట స్థలం కనబడటం లేదు. వీధిలో ఆడుకోవాలంటే ఖాళీ స్థలమే కరవైంది. వినోదం అనగానే టీవీ, సెల్‌ఫోన్‌ ఇస్తున్నారు పెద్దలు. అదే పనిగా తెరని చూడడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే పిల్లలను తరచుగా బయటకు తీసుకొని వెళ్తుండాలి. ప్రకృతిని పరిచయం చేస్తుండాలి. అప్పుడే వాళ్లకు శారీరక శ్రమ తెలుస్తుంది. చెరువులు, జలపాతాల దగ్గరకు తీసుకెళ్లాలి. తమ మీద పడే నీటి తుంపర్లకు ఎంతో మురిసిపోతారు. నీటిలో ఈదే చేపలను, కప్పలను చూసి ఉత్సాహం పొందుతారు. ఉన్న దాంట్లోనే పరులకు దానం చెయ్యడం, మూగ జీవులతో ప్రేమగా మెలగడం నేర్పించాలి. తాత్కాలిక కష్టాలను మరిపించే శక్తి వాటికుంది. ఇవన్నీ పిల్లల్లోని ఒత్తిడిని దూరం చేస్తాయి. అందుకే వీలున్నప్పుడల్లా గోపిని బయట తిప్పుతుంటాను. గిరి విషయంలో ఈరోజు చేసిందీ అదే. పిల్లల్లో ఒత్తిడి దూరమైతే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువు మీద శ్రద్ధా పెరుగుతుంది’ అనగానే నిజమేనన్నట్టు తలూపాడు భూపాలం.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని