సన్నద్ధతే సగం విజయం!

సిద్ధిపురి రాజ్యాన్ని కూర్మదేవ మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు విష్ణుదేవుడు, చిన్నవాడు రాజశేఖరుడు. ఇద్దరినీ గురుకులంలో చదివించాడు తండ్రి.

Published : 28 May 2023 00:06 IST

సిద్ధిపురి రాజ్యాన్ని కూర్మదేవ మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు విష్ణుదేవుడు, చిన్నవాడు రాజశేఖరుడు. ఇద్దరినీ గురుకులంలో చదివించాడు తండ్రి. తన మరణానంతరం రాజ్యాన్ని కుమారులిద్దరూ సమానంగా పంచుకోవాలని మహారాజు ముందే నిర్ణయించాడు. అదే విషయాన్ని రాజ్య ప్రజలకు చెప్పసాగాడు. కుమారులిద్దరూ గురుకులంలో క్రమశిక్షణతో అన్ని విద్యల్లోనూ మేటిగా నిలిచారు. కానీ, వారి గుణాల్లో మాత్రం తేడా ఉంది. విష్ణుదేవుడికి ముందుచూపుతోపాటు తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎక్కువ. చిన్నవాడికి కాస్త గర్వం, చెడు తిరుగుళ్లు ఉండేవి. పైగా ఎవరైనా చెబితే అసలేమాత్రం లెక్కచేసేవాడు కాదు.

కుమారులిద్దరూ విద్య ముగించుకొని రాజ్యానికి వచ్చిన కొద్దిరోజులకే కూర్మదేవ మహారాజు మరణించాడు. తండ్రి నిర్ణయం ప్రకారం రాజ్యాన్ని కుమారులిద్దరూ సమానంగా పంచుకున్నారు. సిద్ధిపురానికి రాజుగా విష్ణుదేవుడు, బుద్ధిపురానికి రాజుగా రాజశేఖరుడు పరిపాలన సాగిస్తున్నారు. చిన్నవాడు విలాస మందిరంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. మంత్రులు, సేనాధిపతి సమర్థులు కావడంతో పరిపాలన సక్రమంగా సాగుతోంది. విష్ణుదేవుడు ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటూ.. మంత్రులు, సేనాధిపతితో చర్చిస్తూ.. రాజ్య విస్తరణకు ప్రణాళికలు రచించసాగాడు. పదునైన వ్యూహాలతో చుట్టుపక్కలనున్న రెండు మూడు రాజ్యాలను హస్తగతం చేసుకున్నాడు.

సోదరుడి విజయాలు రాజశేఖరుడికి తెలిశాయి. తను కూడా వెంటనే మంత్రులు, సేనాధిపతితో సమావేశం ఏర్పాటు చేశాడు. తన అన్నలాగే రాజ్య విస్తరణ చేయదలుచుకున్నానని వారికి వివరించాడు. ‘మీ అన్నగారి పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. మీరు రాజ్యం గురించి పట్టించుకోకుండా.. విలాస మందిరానికే పరిమితమయ్యారు. మన సైనిక బలం కూడా అంతంతమాత్రంగానే ఉంది’ అని వారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ, రాజశేఖరుడికి అది నచ్చలేదు. ‘మా సోదరుడి కంటే నేను ఎందులోనూ తక్కువ కాదు’ అంటూ పక్క రాజ్యం రామాపురం మీదకు యుద్ధానికి సమాయత్తమయ్యాడు. పూర్తి సన్నద్ధత, సరైన ప్రణాళిక లేకపోవడంతో యుద్ధంలో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. దాంతో తన రాజ్యమంతా రామాపురం రాజు వశమైంది.

రాజ్యాన్ని కోల్పోయిన రాజశేఖరుడు బాధపడుతూ సోదరుడి వద్దకెళ్లి, విషయాన్నంతా వివరించాడు. ‘అన్నయ్యా.. నేను కూడా రాజ్య విస్తరణ చేయాలనుకున్నాను. కానీ, అందుకు తగినట్లుగా నా శక్తిసామర్థ్యాలను సిద్ధం చేసుకోలేదు. ఫలితంగా ఓడిపోయాను. మంత్రి, సేనాధిపతి చెబుతున్నా వినకుండా.. గుడ్డిగా ముందుకెళ్లాను. నా రాజ్యాన్ని రామాపురంలో కలిపేసుకున్నాడు. నన్ను క్షమించి నీ రాజ్యంలో తలదాచుకోనివ్వు’ అని బతిమిలాడాడు. విష్ణుదేవుడు పెద్దమనసుతో తమ్ముడిని చేరదీశాడు. ‘సోదరా.. ముందు నువ్వు నీ చెడు అలవాట్లను మానుకో.. తొందరపాటుతనాన్ని వదులుకుంటే సగం గెలిచినట్లే..’ అని హితవు చెప్పాడు.

ఆ మాటలతో రాజశేఖరుడు తన తప్పు ఏంటో తెలుసుకొని పశ్చాత్తాపం చెందాడు. ఆ మరుసటి రోజే విష్ణుదేవుడు రాయబారికి ఓ లేఖ ఇచ్చి రామాపురం రాజు వద్దకు పంపించాడు. ఆ లేఖలో ‘మా తమ్ముడు రాజశేఖరుడి తప్పుని మన్నించి అతని రాజ్యాన్ని తిరిగి అప్పగించండి. ఈ వర్తమానానికి మీరు అంగీకరించకపోతే స్వయంగా నేనే వచ్చి యుద్ధంలో ఓడించి, బుద్ధిపురంతోపాటు మీ రాజ్యాన్ని కూడా చేజిక్కించుకుంటాను’ అని పేర్కొన్నాడు. విష్ణుదేవుడి శక్తిసామర్థ్యాలు తెలిసిన వ్యక్తి కావడంతో.. రాజశేఖరుడికి అతడి రాజ్యాన్ని తిరిగి అప్పగించాడా రాజు. అప్పటి నుంచి సోదరుడి అడుగుజాడల్లో పాలన సాగిస్తూ, మంచి పేరు తెచ్చుకున్నాడు రాజశేఖరుడు.  

ఐతా చంద్రయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని