చల్‌ చల్‌ గుర్రం.. చలాకీ కర్ర గుర్రం!

గుర్రం తెలుసు కానీ.. ఈ కర్ర గుర్రమేంటి అంటారా! ఒకప్పుడు గుర్రాల మీద ఎక్కి రాజులు రాజ్యంలో తిరిగేవారు. అచ్చు అలానే ఓ ప్రాంతంలోని పిల్లలంతా కలిసి కర్ర గుర్రాలెక్కి ఊరంతా తిరుగుతూ పండగ చేస్తున్నారు. అయితే అవి నిజానికి గుర్రాలు కాదు..

Published : 13 Jun 2021 01:37 IST

గుర్రం తెలుసు కానీ.. ఈ కర్ర గుర్రమేంటి అంటారా! ఒకప్పుడు గుర్రాల మీద ఎక్కి రాజులు రాజ్యంలో తిరిగేవారు. అచ్చు అలానే ఓ ప్రాంతంలోని పిల్లలంతా కలిసి కర్ర గుర్రాలెక్కి ఊరంతా తిరుగుతూ పండగ చేస్తున్నారు. అయితే అవి నిజానికి గుర్రాలు కాదు.. గుర్రాల బొమ్మలు అంతకన్నా కాదు. కేవలం వెదురు కర్రలంతే! ఇంతకీ ఇలా ఎందుకు చేస్తారో తెలుసా?

నేస్తాలూ! అసలు విషయమేంటంటే.. ఆదిలాబాద్‌ జిల్లా ఆదివాసీలు ఏటా శ్రావణమాసంలో కోడంగ్‌ పండగ చేస్తారు. ఈ పండగ రోజున పిల్లలంతా కలిసి కర్ర గుర్రాలు ఎక్కి సందడి చేస్తారు. అంటే వెదురుతో నిల్చోవడానికి వీలుగా చేసిన కర్రలన్నమాట. ఏటా శ్రావణ మాసంలో నెలరోజులపాటు వెదురు కర్రలపై వాళ్ల పిల్లలు నడిస్తే మంచిదట. అంటురోగాలు ఉంటే తొలగిపోతాయనీ, ఏ వ్యాధులూ రావని వాళ్ల నమ్మకమట. ఇది తమ పూర్వీకులు పాటిస్తున్న ఆచారమనీ అక్కడి ఆదివాసీలు చెబుతున్నారు.

వానాకాలంలోనే..
ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువ. దాంతో క్రిములు, కీటకాలు, పాముల్లాంటివి ఎక్కువగా బయటకు వస్తాయి. వీటివల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఎటువంటి వ్యాధులూ రాకూడదనీ, వానాకాలంలోనే ఈ పండగ చేస్తారు. నెలరోజులు ఇలా వెదురు కర్రల మీద తిరిగిన తర్వాత చివరి రోజున ఊరి పొలిమేర దగ్గరకు పిల్లలంతా వెళ్తారు. వాళ్ల వెనకే పెద్దవాళ్లంతా నైవేద్యం పట్టుకుని నడుస్తారు.

నైవేద్యం బాగుంటే..
పొలిమేర దేవత దగ్గరకు చేరుకుని వాళ్లు తెచ్చిన నైవేద్యాన్ని ఒక గుట్టగా తొట్టెలో పోస్తారు. ఆ నైవేద్యం బాగుంటే వాళ్లకే ఆపదలు రావనీ, పాడైతే ఏదో కీడు రాబోతుందనీ వాళ్ల నమ్మకం. ఇలా ఏటా ఈ పండగను నిర్వహిస్తూ తమ ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ ఉంటారు అక్కడి ఆదివాసీలు. బాగుంది కదా! ఫ్రెండ్స్‌.. ఇదీ కర్ర గుర్రాల వెనుక ఉన్న అసలు కథ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని