బస్సే బడి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘బడి బస్సు’ అంటే తెలుసు కానీ ఈ ‘బస్సే బడి’ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే.. ఓ రాష్ట్ర ప్రభుత్వం తుక్కుగా అమ్మాల్సిన బస్సులను తరగతి గదులుగా

Published : 04 Jun 2022 02:35 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘బడి బస్సు’ అంటే తెలుసు కానీ ఈ ‘బస్సే బడి’ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే.. ఓ రాష్ట్ర ప్రభుత్వం తుక్కుగా అమ్మాల్సిన బస్సులను తరగతి గదులుగా మార్చేస్తోంది మరి. ఏదో ఒక పనిమీద వేరే ఊరికి వెళ్తేనే బస్సు ఎక్కే మనలాంటి పిల్లలిప్పుడు.. అదే బస్సులో ఎంచక్కా తరగతులు వింటున్నారు. ఆ వివరాలే ఇవీ..

కేరళ రాష్ట్రంలో చాలా బస్సులు డొక్కుగా మారడంతో కొన్ని నెలలుగా మూలకు చేరాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో గదుల కొరతతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారట. దాంతో ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా.. తుక్కుగా మారాల్సిన పాత బస్సులను.. అక్కడి రవాణా, విద్యాశాఖ ఆధ్వర్యంలో తరగతి గదులుగా తీర్చిదిద్దుతున్నారు.

టీవీ, ఏసీ కూడా..
తిరువనంతపురం పట్టణంలోని మనకౌడ్‌ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తరగతి గదిగా మార్చిన ఓ ఆర్టీసీ బస్సును ఇటీవలే ప్రారంభించారు. ఈ బడిలో దాదాపు 1600 మంది విద్యార్థులున్నారు. వారిలో కొందరు ఈ నూతన విద్యాసంవత్సరం నుంచి.. కొత్తగా ఆకట్టుకునే రంగులతోపాటు రకరకాల బెంచీలూ, వివిధ బొమ్మల చిత్రాలతో ముస్తాబైన ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సులోనే పాఠాలు విననున్నారట. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ బస్సులో టీవీ, ఏసీ సౌకర్యం కూడా కల్పించారట. పిల్లలంతా ఎంచక్కా ఆడుతూపాడుతూ చదువుకునేలా టీచర్లు అన్ని ఏర్పాట్లు చేశారు.

గ్రంథాలయ సౌకర్యమూ..
ఇప్పటికే ఒక బస్సును తరగతి గదిగా మార్చగా.. త్వరలోనే మరోదాన్నీ సిద్ధం చేయనున్నారట. కొత్తగా రాబోయే బస్సు రెండో అంతస్తులో గ్రంథాలయాన్నీ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. పిల్లలు పాఠశాలకు రావాలంటే ఆసక్తి చూపేలా.. ఈ బడి బస్సుల ఆవరణల్లో పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ‘క్లాస్‌రూం ఆన్‌ వీల్స్‌’ పేరిట కాలం చెల్లిన బస్సులన్నింటినీ తరగతి గదులుగా మార్చి.. ప్రభుత్వ బడులకు అందిస్తామని కేరళ రాష్ట్ర రవాణా శాఖ ఇప్పటికే ప్రకటించింది. ప్లేస్కూల్‌ మాదిరి ఉన్న ఇలాంటి తరగతి గదులూ మన దగ్గరా ఉంటే బాగుండు అని అనిపిస్తోంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని