మౌనంగానే ఎదగమనీ.. తాబేలు నీకు చెబుతుంది!

‘మౌనంగానే ఎదగమనీ.. మొక్క నీకు చెబుతుంది.. ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్థమందులో ఉంది..’

Published : 06 Jun 2022 00:13 IST

‘మౌనంగానే ఎదగమనీ.. మొక్క నీకు చెబుతుంది..
ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్థమందులో ఉంది..’
ఇదీ కదా పాట.. మధ్యలో తాబేలు ఎక్కడ నుంచి వచ్చిందబ్బా.. అని ఆలోచిస్తున్నారు కదూ... ఇంతకీ విషయం ఏంటంటే...

అది అమెరికాలోని న్యూజెర్సీ. అప్పుడే పుట్టిన బుజ్జి తెల్ల తాబేలు కళ్లు తెరిచి చూసింది. తను ఒక వెచ్చని చేతుల్లో ఉంది. ఆ వ్యక్తి కళ్లు మాత్రం కాస్త ఆశ్చర్యాన్ని, కాస్త బాధను వ్యక్తపరుస్తున్నాయి. కారణం సరైన రక్షణ లేకుండానే ఆ బుజ్జి తాబేలు పుట్టింది. అంటే దాని డొప్ప అడుగున సరిగ్గా గుండె ఉండే స్థానంలో రక్షణ కవచం లేదు. గుండె స్పష్టంగా బయటకు కనిపిస్తోంది. మనుషుల్లో ఈ పరిస్థితిని ఎక్టోపియా కార్డిస్‌ అని పిలుస్తారు. కానీ జంతువుల్లో ఇలాంటివి చాలా చాలా అరుదు. అందుకే ఈ విచిత్ర జబ్బుకు పేరే లేదు. బహుశా ఇలాంటి తాబేలు ప్రపంచంలో ఇంకోటి లేదేమో!

కంటికి రెప్పలా..
ఈ తాబేలు ఇప్పటికీ బతికి ఉందంటే దానికి కారణం మైఖేల్‌ అక్వెలినా అనే అంకులే కారణం. ఆయనే దీన్ని 2018 నుంచి కంటికి రెప్పలా పరిరక్షిస్తున్నారు. దీని దైనందిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వీడియోలు, ఫొటోలు తీసి ఇన్‌స్టాలో షేర్‌ కూడా చేస్తుంటారు. ఈ తాబేలును ఆయన ముద్దుగా హోప్‌ అని పిలుస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో దీన్ని అనుసరించేవారు కూడా లక్షల్లోనే ఉన్నారు. నిజానికి మైఖేల్‌ ఆ తాబేలు గుండె చుట్టూ రక్షణగా కృత్రిమ కవచం ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. కానీ అది సాధ్యం కాకపోవచ్చని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

లబ్‌.. డబ్‌.. లబ్‌.. డబ్‌...
డొప్ప అడుగు భాగంలో రంధ్రం ఉండటం వల్ల హోప్‌ గుండె కొట్టుకునేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఏదైనా బలమైన గాయమైతే అది చనిపోయే ప్రమాదం ఉంది. మొదట్లో అయితే మైఖేల్‌ అక్వెలినాది వృథా ప్రయాస అని, ఆ తాబేలు ఎక్కువ రోజులు బతకదని.. చాలా మంది సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టారు. కానీ అది ఇప్పటికీ బతికి ఉండటంతో అందరూ మైఖేల్‌ను, హోప్‌ను ప్రశంసిస్తున్నారు. ఇంకొందరైతే ‘హోప్‌’ పేరుతో ఏకంగా బొమ్మల్నీ తయారు చేస్తున్నారు. పట్టుదలకు, కృషికి దాన్ని చిహ్నంగా భావిస్తున్నారు. నేస్తాలూ... ఇప్పటికైనా ఒప్పుకుంటారా... ‘మౌనంగానే ఎదగమనీ తాబేలు నీకు చెబుతుంది..’ అని కూడా పాడుకోవచ్చు అని!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని