శిలాజాలకో మ్యూజియం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మీరు పుస్తకాల్లో శిలాజాల గురించి చదువుకొనే ఉంటారు. జీవుల అవశేషాల ఆధారంగా అవి ఎన్నేళ్ల క్రితానివో తెలుస్తుందన్నమాట.

Updated : 08 Dec 2022 06:31 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మీరు పుస్తకాల్లో శిలాజాల గురించి చదువుకొనే ఉంటారు. జీవుల అవశేషాల ఆధారంగా అవి ఎన్నేళ్ల క్రితానివో తెలుస్తుందన్నమాట. ఆ నమూనాలతో శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనలు చేసి, చరిత్రకు సంబంధించిన అంశాలను ప్రపంచానికి వివరిస్తుంటారు. అలాంటి శిలాజాలకూ ఓ మ్యూజియం ఉంది.  ఆ విశేషాలు తెలుసుకుందాం..!

మిళనాడు రాష్ట్రం పెరంబలూరు జిల్లాలోని సతనూరుతోపాటు సమీప గ్రామాలు ఇప్పుడున్న ప్రాంతంలో ఒకప్పుడు సముద్రం ఉండేదట. కాలక్రమేణా సముద్రం వెనక్కి వెళ్లిపోవడం, అక్కడ గ్రామాలు ఏర్పడటం జరిగింది. ఇప్పుడు విషయం ఏంటంటే.. ఆయా గ్రామాల పరిధిలో సముద్రం ఉన్నప్పుడు అందులో జీవించిన జంతువుల అవశేషాలు తరచుగా కనిపిస్తుంటాయట. కొన్ని దశాబ్దాలైనా చెక్కుచెదరకుండా ఉండే వాటినే శిలాజాల్బు (fossil) గా పిలుస్తుంటారు. అటువంటి శిలాజాలతో సతనూరులో ఇటీవల ఓ మ్యూజియాన్ని ప్రారంభించారు. దేశంలోనే ఇది మొట్టమొదటిదిగా చెబుతున్నారు.

కలెక్టర్‌ చొరవతో..

గతంలో తమ ఊరితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు సముద్రమనీ, అక్కడక్కడా కనిపించే జీవుల అవశేషాల ప్రాధాన్యం తదితర వివరాలన్నీ సతనూరు ప్రజలకు అంతగా తెలియదు. మొదటగా 1940లో ఆ గ్రామానికి వచ్చిన ఓ పురావస్తు శాఖ అధికారి 120 మిలియన్‌ ఏళ్లనాటి వృక్ష శిలాజాన్ని గుర్తించారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం గురించి పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేయసాగారు. అయితే, ఆ జిల్లాకు కొంతకాలం క్రితం కొత్తగా వచ్చిన కలెక్టర్‌ చొరవతో స్థానికులకు ఆ విషయాలపైన అధికారులు అవగాహన కల్పించారు. అంతేకాదు.. పాత తహసీల్దార్‌ భవనాన్ని ఆధునికీకరించి, దాన్ని శిలాజాల మ్యూజియంలా తీర్చిదిద్దారు. ఇందులో దాదాపు 300 జీవుల శిలాజాలు ఉన్నాయట. వంద మిలియన్‌ సంవత్సరాల నాటి షార్క్‌ దంతంతోపాటు 500 మిలియన్‌ ఏళ్ల జంతువుల అవశేషాలనూ భద్రపరిచారు.

విజ్ఞాన కేంద్రంగా..

ఈ మ్యూజియాన్ని ప్రజలు, విద్యార్థులు, పర్యాటకులూ కేవలం చూసి వెళ్లేందుకే పరిమితం చేయలేదు. దీన్నో విజ్ఞానం అందించే తరగతి గదిగా కలెక్టర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇటీవల రూ.10 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. తమ ప్రాంత చారిత్రక ప్రాధాన్యం ప్రపంచానికి తెలుస్తుండటంతో అక్కడి వారంతా గర్వపడుతున్నారు.  

టోల్‌ఫ్రీ నంబర్‌ సైతం..

గ్రామస్థులకు ఎవరికైనా శిలాజాలు కనిపిస్తే, వెంటనే సమాచారం అందించేలా ఓ టోల్‌ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడి ప్రభుత్వం ఈ గ్రామాలను ‘రక్షిత ప్రాంతం’(protected areas) గా గుర్తించింది. ఈ మ్యూజియంలో పెద్ద పెద్ద డైనోసార్ల దగ్గరి నుంచి బుజ్జి నత్తల శిలాజాల వరకూ ఉన్నాయట. నేస్తాలూ.. మీరెప్పుడైనా అటువైపు వెళ్తే, చూడాల్సిన ప్రాంతాల జాబితాలో దీన్ని కూడా చేర్చుకోండి మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని