క్లిక్‌ చెయ్‌.. బిర్యానీ తినెయ్‌..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగా ఆకలి అవుతోంది.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేద్దామంటే, ఆప్‌లో చాలా సమయం చూపిస్తోంది.

Published : 14 Mar 2023 01:23 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగా ఆకలి అవుతోంది.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేద్దామంటే, ఆప్‌లో చాలా సమయం చూపిస్తోంది..

పోనీ, నేరుగా రెస్టరంట్‌కే వెళ్లి తిందామంటే దగ్గరలో అంతమంచివి లేవు.. ఉన్నా, వాటిలో బోలెడు రద్దీ.. ఇంటికి పార్సిల్‌ తెచ్చుకుందామన్నా, చాంతాడంత వరస.. మరి ఎలా?

ఈ కష్టాలన్నింటికీ చెక్‌ పెట్టేలా వచ్చిందే.. ‘బిర్యానీ వెండింగ్‌ మెషిన్‌’. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!!

నం ఇప్పటివరకూ చాలా వెండింగ్‌ మెషిన్లను చూసే ఉంటాం. కానీ, దేశంలోనే మొట్టమొదటగా ‘బిర్యానీ వెండింగ్‌ మెషిన్‌’ను ఇటీవల చెన్నైలో ప్రారంభించారు. 2020లో చెన్నై కేంద్రంగా ఏర్పాటు చేసిన ‘బీవీకే బిర్యానీ’ అనే స్టార్టప్‌.. ఈ వెండింగ్‌ మెషిన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలిసారి కొలత్తూరులోని ఓ ప్రాంగణంలో నాలుగు యంత్రాలను నెలకొల్పారు.

నిమిషాల్లో సిద్ధం..

ఈ వెండింగ్‌ మెషిన్ల సాయంతో ఎటువంటి హడావిడి, ఇబ్బంది లేకుండా ఆకలి తీర్చుకోవచ్చట. ఆ యంత్రం ముందు నిలబడగానే.. మనకు ఎదురుగానున్న స్క్రీన్‌పైన మెనూ కనిపిస్తుంది. వాటిలో మనకు కావాల్సిన బిర్యానీపై క్లిక్‌ చేసి.. స్కానర్‌ లేదా కార్డు ద్వారా పేమెంట్‌ పూర్తి చేస్తే సరి. మూడు నుంచి నాలుగు నిమిషాల వ్యవధిలోనే.. యంత్రం కింద ఉండే ట్రేలో బిర్యానీ ప్యాకెట్‌ సిద్ధంగా కనిపిస్తుంది. దాన్ని తీసుకొని తినేయడమే ఇక ఆలస్యం. ప్యాకింగ్‌ కూడా ఆషామాషీగా ఏమీ ఉండదు నేస్తాలూ.. పెళ్లిళ్లకు అందించే బహుమతుల తరహాలోనే ఆకట్టుకోవడంతోపాటు దృఢంగానూ ఉంటుంది. మెనూలో మాంసాహారంతోపాటు శాకాహార పదార్థాలూ ఉంటాయట.

త్వరలోనే మరిన్ని నగరాలకు.

చిటికెలో బిర్యానీని వేడి వేడిగా అందించే ఈ యంత్రాలను త్వరలోనే మరికొన్ని నగరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు స్టార్టప్‌ ప్రతినిధులు చెబుతున్నారు. అంతేకాదు.. చెన్నై నగరవ్యాప్తంగా ఆర్డర్‌ చేసిన గంటలోనే వీళ్లు ఆహార పదార్థాలను డెలివరీ చేస్తున్నారట. ఈ వెండింగ్‌ మెషిన్ల విధానంలో మనుషుల ప్రమేయం అసలేమాత్రం ఉండదు. నేస్తాలూ.. ఇది చదువుతుంటే, ‘ఈ బిర్యానీ వెండింగ్‌ మెషిన్లు.. మన నగరానికి ఎప్పుడెప్పుడొస్తాయా’ అని అనిపిస్తోంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని