ఆధునిక మానవుడి అడుగుజాడలు ఇక్కడే!

ఆసియా ఖండంలోని ముఖ్య దేశాల్లో మలేషియా ఒకటి. పూర్వం డచ్‌, బ్రిటిషర్ల పాలనలో ఉన్న ఇది 1957లో పూర్తి స్వాతంత్య్రం పొందింది. ఇక్కడి జాతీయ రహదారుల పొడవు 65,877 కిలోమీటర్లు. అంటే మొత్తం భూమి చుట్టుకొలత కంటే కూడా ఎక్కువ....

Published : 27 Aug 2017 01:03 IST

ఆధునిక మానవుడి అడుగుజాడలు ఇక్కడే!
మలేషియా


మలేషియా..మనకు తెలిసిన పేరే... మరి తెలియని ఈ దేశ కబుర్లేంటో తెలుసుకుందామా!

* ఆసియా ఖండంలోని ముఖ్య దేశాల్లో మలేషియా ఒకటి.
* పూర్వం డచ్‌, బ్రిటిషర్ల పాలనలో ఉన్న ఇది 1957లో పూర్తి స్వాతంత్య్రం పొందింది.
* ఇక్కడి జాతీయ రహదారుల పొడవు 65,877 కిలోమీటర్లు. అంటే మొత్తం భూమి చుట్టుకొలత కంటే కూడా ఎక్కువ. (భూమి చుట్టుకొలత 40,075 కిలోమీటర్లు మాత్రమే)
* మలేషియా అనగానే జంట టవర్లే గుర్తొస్తాయి. వీటి పేరు ‘పెట్రోనాస్‌ ట్విన్‌ టవర్లు’. ఒక్కోదాంట్లో 88 అంతస్తులుంటాయి. వీటి ఎత్తు 450 మీటర్లు. అంటే ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తయినవే అన్నమాట. వీటిలో కార్యాలయాలుంటాయి.
* రబ్బరు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశమిది. 2011 సంవత్సరంలోనే 9,96,673 మెట్రిక్‌ టన్నుల రబ్బరును ఉత్పత్తి చేసింది. ప్రపంచంలోనే రబ్బరు చేతి తొడుగులు తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిందీ దేశం.
* ప్రపంచంలోనే అతి పెద్ద కార్తికేయుడి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి) విగ్రహం ఉన్నది ఇక్కడి బాటు గుహల్లోని ఆలయం దగ్గరే. దీని ఎత్తు 140 అడుగులు. అంటే ఓ పద్నాలుగు అంతస్తుల భవనమంత.
* అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ దుస్తులు, ఆహారం, నివాస వసతుల కోసం అయ్యే ఖర్చు తక్కువే.
* వీరి ఆహార అలవాట్లు మనకులాగే ఉంటాయి. మధ్యాహ్న భోజనంలో గుడ్డు, కొబ్బరన్నం, కారంగా ఉండే సంబల్‌ చిల్లీ పేస్ట్‌, వేరుసెనగ గింజలు, దోసకాయ ముక్కలు... లాంటివి ఉంటాయి.

* దేశం: మలేషియా
* రాజధాని: కౌలాలంపూర్‌
* కరెన్సీ: మలేషియన్‌ రింగెట్‌
* జనాభా: 3,15,48,000 విస్తీర్ణం: 3,30,803 చదరపు కిలోమీటర్లు అధికారిక భాష: బహసా మలేషియా అధికారిక లిపి: మలయ్‌
* జెండా: జెండాపై ఉన్న ఎరుపు, తెలుపు రంగు గీతలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమాన హోదాకూ, నక్షత్రం వారి ఐకమత్యానికీ నిదర్శనం. పక్కనున్న అర్ధ చంద్రుడు వారి అధికారిక మతం ఇస్లాంకు ప్రతీక.

* ప్రపంచంలోనే పొడవైన(కేవ్‌ ఛాంబర్‌) గుహ గది ఉన్నది ఇక్కడి సర్వాక్‌ ఛాంబర్‌ గుహల్లోనే.
* ఈ దేశ కరెన్సీ రింగెట్‌. స్థానికులు మాత్రం డాలర్‌ అనే పిలుచుకుంటారు. దీని విలువ ఇప్పుడు మన కరెన్సీలో దాదాపు 14 నుంచి 15 రూపాయలుంది.
* మలేషియాలో 40,000 సంవత్సరాలకు ముందు ఆధునిక మానవుడు నివసించినట్టు ఆధారాలు దొరికాయి. క్రీస్తుశకం మొదటి శతాబ్దం నుంచి ఇక్కడికి భారత్‌, చైనా నుంచి వ్యాపారులు వలసవచ్చారట. రెండో, మూడో శతాబ్దాల్లో వాణిజ్య రేవులు, తీర ప్రాంత నగరాలు నిర్మించుకున్నారు. దీంతో ఈ దేశ ప్రజలపై భారతీయ, చైనా సంస్కృతులు, సంప్రదాయాల ప్రభావం పడటం మొదలైంది.
* వీధి గోడలపై బొమ్మలేసే కళకు ఇక్కడ చాలా ఆదరణ ఉంది. అందుకే ఇక్కడి వీధుల్లో ఎక్కడ చూసినా, ముఖ్యంగా కౌలాలంపూర్‌లో గోడలపై చాలా బొమ్మలు కనిపిస్తుంటాయి.

* మనిషికి దగ్గర పోలికలతో ఉండే తోకలేని కోతులు ‘ఒరాంగుటాన్లు’ తెలుసుగా. ప్రస్తుతం ఇవి ఈ దేశ సమీపంలోని బోర్నియో, సుమాత్ర దీవుల్లో మాత్రమే ఉన్నాయి.
* ప్రపంచంలోనే విడిపోకుండా ఉన్న అతి పెద్ద ఆకు ఇక్కడి సాభాలో ఉంది. అది అలొకాసియా మక్రోరైజ మొక్కది. 3.2 మీటర్ల పొడవు, 1.92 మీటర్ల వెడల్పు ఉంటుంది.
* ఇక్కడున్న వలసదారుల్లో చైనీయులు, భారతీయులే ఎక్కువ.
* ఇప్పుడు స్వతంత్రంగా ఉన్న సింగపూర్‌ దేశం గతంలో మలేషియాలోని ఒక రాష్ట్రం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని