ఆ నేల మాకొద్దు బాబోయ్!

అనగనగా ఓ ప్రాంతం... ఎవరికీ అంతగా తెలియనిది... ప్రపంచంలోనే వింతైనది... ఎందుకో? ఏమిటో? తెలుసుకోకపోతే ఎలా? మన హైదరాబాద్‌ ఏ దేశంలో ఉంది? ‘అది కూడా తెలియదా? భారతదేశంలో’ అనేస్తారు ఒక్క క్షణం ఆగకుండా....

Published : 27 Feb 2018 01:07 IST

ఆ నేల మాకొద్దు బాబోయ్!

అనగనగా ఓ ప్రాంతం...  ఎవరికీ అంతగా తెలియనిది... ప్రపంచంలోనే వింతైనది... ఎందుకో? ఏమిటో? తెలుసుకోకపోతే ఎలా?
న హైదరాబాద్‌ ఏ దేశంలో ఉంది? ‘అది కూడా తెలియదా? భారతదేశంలో’ అనేస్తారు ఒక్క క్షణం ఆగకుండా. టోక్యో ఎక్కడుంది? అని అడగ్గానే కాస్త ఆలోచించైనా జపాన్‌లో ఉంది అని చెబుతారు. కాలిఫోర్నియా ఏ దేశానికి చెందిన ప్రాంతం? అంటే గూగుల్‌లో వెతికైనా ఆ... యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికానే కదా అంటారు. ఇలా ఏ ప్రాంతానికైనా ఏదో ఒక దేశం పేరు ఉంటుంది. కానీ ఓ చోటు మాత్రం దేనికీ చెందదు. ఒంటరిగా ప్రపంచంలో దేనికీ చెందని ప్రాంతంగా ఏకాకిగా మిగిలిపోయింది. అదే... బీర్‌ తవీల్‌ ట్రయాంగిల్‌.
* ఉత్తర ఆఫ్రికాలోని సుడాన్‌, ఈజిప్ట్‌ దేశాల మధ్యలో 2,060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందిది. సరిహద్దు స్థలాల కోసం యుద్ధాలు జరిగినట్టు వినుంటారు కానీ దీని పక్కనున్న సుడాన్‌, ఈజిప్ట్‌ దేశాలు మాత్రం ‘మాకొద్దు మాకొద్దు’ అంటూ దీన్ని వదిలేశారు. ఈ స్థలం వల్ల ఆర్థికంగా ఎలాంటి ఉపయోగమూ కొంచెమైనా లేకపోవడం వల్లనే ఏ దేశమూ దీన్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు... ఇప్పటికీ ఈజిప్షియన్‌ దేశ పటంలో బీర్‌ తవీల్‌ సుడాన్‌కు చెందినదిగా, సుడాన్‌ దేశ పటంలో బీర్‌ తవీల్‌ ఈజిప్ట్‌ దేశానికి చెందినదిగా ఉంటుంది

* ఎప్పుడో 1899లో ఈ రెండు దేశాల మధ్య మొదలైన ఈ వింత పరిస్థితి కొనసాగుతూనే ఉందట. దీంతో అధికారికంగానే ఏ ప్రాంతానికి చెందనిదిగా నిలిచిపోయిందిది.
* బీర్‌ తవీల్‌ అంతా ఇసుక, రాళ్లతో ఉంటుంది. ఈ ప్రదేశంలో రోడ్లేమీ ఉండవు. సహజ వనరులూ లేవట. అందుకేనేమో స్థిర నివాసులు లేరిక్కడ. పాపం... పక్కనున్న ప్రాంతాలు తమలో కలుపుకోవడానికీ ఇష్టపడటం లేదు.
* సాహసికులు మాత్రం ఇక్కడికి ఎలాగోలా చేరుకుని సరదాగా తమ పతాకాల్ని ఎగరేస్తూ ముచ్చట తీర్చుకుంటారు.
* అయితే దీని పక్కనే ఉన్న హలైబ్‌ ట్రయాంగిల్‌ ప్రాంతాన్ని మాత్రం రెండు దేశాలూ ‘మాక్కావాలి మాక్కావాలి’ అంటూ పోటీపడతాయట. ఆ ప్రాంతం కూడా రాళ్లూరప్పలతో ఉన్నా దాని పక్కనే రెడ్‌ సీ ఉండటమే కారణం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని