భలే... భలే... బుజ్జి ఎలుగుబంటి!

‘హాయ్‌ నేస్తాలూ! మీకు బుజ్జి ఎలుగుబంటి గురించి తెలుసా’ అని ఎవరైనా అడిగితే.. ‘ఓ తెలుసు! ఎలుగుబంటి జాతికి చెందిన పాండా ఉందిగా’ అంటారేమో! కానీ మరో బుజ్జి ఎలుగుబంటి కూడా ఉందోచ్‌!

Published : 12 Apr 2023 00:47 IST

‘హాయ్‌ నేస్తాలూ! మీకు బుజ్జి ఎలుగుబంటి గురించి తెలుసా’ అని ఎవరైనా అడిగితే.. ‘ఓ తెలుసు! ఎలుగుబంటి జాతికి చెందిన పాండా ఉందిగా’ అంటారేమో! కానీ మరో బుజ్జి ఎలుగుబంటి కూడా ఉందోచ్‌! మరి దాని విశేషాలేంటో తెలుసుకుందామా!

ఆ బుజ్జి ఎలుగుబంటి పేరు సన్‌ బియర్‌. ఇది ఎలుగుబంటి జాతిలోనే అతి చిన్నది. కేవలం 100 నుంచి 140 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది అంతే! బరువేమో కేవలం 25 నుంచి 65 కిలోల వరకు తూగుతుంది. ఈ బుజ్జి ఎలుగుబంట్లు భారత్‌, బంగ్లాదేశ్‌, కంబోడియా, మయన్మార్‌, లావోస్‌, థాయిలాండ్‌, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, చైనాలో ఎక్కువగా జీవిస్తుంటాయి. కానీ వీటి సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. గడిచిన మూడు దశాబ్దాల్లో వీటి జనాభా 35 శాతానికి పైగా పడిపోయిందని అంచనా. అడవుల నరికివేత, వేటే దీనికి ప్రధాన కారణం.

ఎంచక్కా... చకచకా..

దీనికి ఛాతి మీద గంధం రంగులో మచ్చ ఉంటుంది. అందుకే దీనికి సన్‌ బియర్‌ అనే పేరు వచ్చింది. ఇది బుజ్జి ఎలుగుబంటే అయినప్పటికీ చకచకా చెట్లెక్కేస్తుంది. ఆ కొమ్మలపైనే భూమికి 2 నుంచి 7 మీటర్ల ఎత్తులో నిద్రపోతుంది. పగలంతా అప్రమత్తంగా ఉంటుంది. వీటికి బలమైన పాదాలు, గోర్లుంటాయి. కాబట్టి ఇవి శత్రువుల
మీద బలంగా దాడి చేయగలవు.

ఏం తింటాయంటే...

ఈ బుజ్జి ఎలుగుబంట్లు చీమలు, తేనెటీగలు, పురుగులు, చెదపురుగులు, తేనెను ఆహారంగా తీసుకుంటాయి. ఇంకా పలు రకాల విత్తనాలు, పండ్లనూ హాంఁఫట్‌ చేసేస్తాయి. అంతేకాదు నేస్తాలూ.. పక్షులు, అవి పెట్టిన గుడ్లు, జింకలు, దుప్పుల్నీ వేటాడి తినేస్తాయి. ఈ బుజ్జి ఎలుగుబంట్లు సాధారణంగా 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. 31 సంవత్సరాల వరకు జీవించిన ఉదంతాలూ ఉన్నాయి.

వామ్మో.. కొండచిలువలు!

ఈ బుజ్జి ఎలుగుబంట్లు ఎక్కువగా కొండచిలువల దాడిలో ప్రాణాలు కోల్పోతుంటాయి. ముఖ్యంగా రాత్రిపూట ఇవి నిద్రలో ఉండగా కొండచిలువలు వీటి మీద దాడి చేస్తాయి. సన్‌ బియర్లు చిన్నగా ఉండటం వల్ల తేలిగ్గా ప్రాణాలు కోల్పోతుంటాయి. వీటి చర్మం, గోర్ల కోసం మనుషులూ వీటిని వేటాడుతున్నారు. నేస్తాలూ! మొత్తానికి ఇవీ బుజ్జి ఎలుగుబంటి సంగతులు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని