కలాం.. నీకు సలాం!

హాయ్‌ పిల్లలూ.. క్లాసులో ఏదైనా విషయం పైన మాట్లాడమంటేనే ‘అమ్మో’ అనేస్తాం. తప్పనిసరి అనుకుంటే రెండు, మూడు రోజుల ముందు నుంచే రాసుకొని మరీ ప్రిపేర్‌ అవుతాం. కానీ, ఓ విద్యార్థి మాత్రం తన మాటలతో ఏకంగా ముఖ్యమంత్రినే మెప్పించాడు. అతడెవరో, ఆ వివరాలేంటో ఈ కథనం చదివితే మీకూ తెలుస్తాయి మరి!

Published : 08 Mar 2022 01:18 IST

హాయ్‌ పిల్లలూ.. క్లాసులో ఏదైనా విషయం పైన మాట్లాడమంటేనే ‘అమ్మో’ అనేస్తాం. తప్పనిసరి అనుకుంటే రెండు, మూడు రోజుల ముందు నుంచే రాసుకొని మరీ ప్రిపేర్‌ అవుతాం. కానీ, ఓ విద్యార్థి మాత్రం తన మాటలతో ఏకంగా ముఖ్యమంత్రినే మెప్పించాడు. అతడెవరో, ఆ వివరాలేంటో ఈ కథనం చదివితే మీకూ తెలుస్తాయి మరి!

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన విద్యార్థి అబ్దుల్‌ కలాం.. ఇటీవల ఒకరోజు ఉదయాన్నే నడుచుకుంటూ స్కూల్‌కు వెళ్తున్నాడు. ఇంతలో యూట్యూబ్‌ ఛానల్‌కు చెందిన ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి కలాంని ఆపాడు. ఆ చిన్నోడి నోటి దగ్గర మైక్‌ పెట్టి, ‘పాఠశాలలకు అందరూ ఒకటే యూనిఫాంలో రావడం మంచిదా? కాదా?’ అంటూ ఏదో ప్రశ్న అడిగాడు. దానికి ఆ బాబు ఇచ్చిన సమాధానంతో ఆ ఛానల్‌ ప్రతినిధితోపాటు ఆ వీడియో చూసిన వారందరూ ‘శెభాష్‌’ అంటూ మెచ్చుకుంటున్నారు.

అందరూ సమానమే..

ఇంతకీ మన కలాం చెప్పిన సమాధానమేంటంటే.. ‘మనుషుల మధ్య ఎన్ని భేదాభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ, అంతిమంగా అంతా సమానమేనని భావించి పరస్పరం సహకరించుకోవాలే తప్ప.. ఒకరిపై మరొకరు విషం చిమ్ముకోకూడదు. అందరూ మనుషులమే, ఈ భూమిపై ప్రేమకు తప్ప ద్వేషానికి చోటు ఉండకూడదు’ అని అన్నాడు. చిన్న వయసులోనే అంత లోతుగా ఆలోచించిన కలాం మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సీఎం పిలిపించుకొని మరీ..

ఆ వీడియోను చూసిన ముఖ్యమంత్రి స్టాలిన్‌.. కలాంతోపాటు అతడి తల్లిదండ్రులనూ ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ అభినందించారు. అయితే, ఈ సందర్భంగా తమ సమస్యలనూ ఆయనకు విన్నవించారు. తాము అద్దె ఇంట్లో ఉంటున్నామని, కలాం మాటలు వైరల్‌గా మారడంతో.. ఇంటి ఓనర్‌ ఖాళీ చేయమని బలవంతం చేస్తున్నాడని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆయన వెంటనే స్పందించి.. ప్రభుత్వం తరఫున ఇల్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇటీవల ఆ బాలుడితో పాటు కుటుంబ సభ్యులనూ మరోసారి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.. అందుకు సంబంధించిన మంజూరు పత్రాలనూ వారికి అందించారు. బడికెళ్లే వయసులోనే సమాజంపైన, మనుషుల పట్ల కలాంకి ఉన్న సమానత్వ భావన.. నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని