చిత్రం.. భళారే.. ఈ చిత్రం!

దేశవ్యాప్తంగా 108 మంది విద్యార్థులు చిత్రలేఖన పోటీల్లో పాల్గొంటే అందులో మన తెలుగుతేజం మోటూరి సాత్విక్‌ నాలుగో స్థానంలో నిలిచాడు.

Updated : 19 Dec 2022 01:19 IST

కుంచె పడితే... అద్భుతమే!
బొమ్మను గీస్తే మహాద్భుతమే!
చూసే వారు కళ్లు తిప్పుకోరు...
ఇక బహుమతుల సంగతి సరేసరి!
ఇంతకీ ఆ చిన్నారి చిత్రకారుడు ఎవరు?
సాధించిన ఘనతలేంటో తెలుసుకుందామా!!

దేశవ్యాప్తంగా 108 మంది విద్యార్థులు చిత్రలేఖన పోటీల్లో పాల్గొంటే అందులో మన తెలుగుతేజం మోటూరి సాత్విక్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. తన కుంచెతో చిత్రం గీసి జాతీయస్థాయిలో బహుమతి సాధించి రాష్ట్రపతి అభినందనలు సైతం అందుకున్నాడు. డిసెంబరు 12న దిల్లీ విజ్ఞాన భవన్‌లో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ మినిస్టరీ ఆఫ్‌ పవర్‌, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఈ చిన్నారి చక్కని ప్రతిభ చూపాడు. రాజమహేంద్రవరానికి చెందిన మోటూరి సాత్విక్‌ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తండ్రి శ్రీనివాసరావు ఓ ప్రైవేటు పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌.

యూకేజీ నుంచే..

యూకేజీ చదివే వయసులోనే సాత్విక్‌ కుంచె కదిలిస్తూ బొమ్మలు వేసేవాడు. వాటికి తండ్రి శ్రీనివాసరావు తుది మెరుగులు దిద్దుతూ చిన్నారికి చిత్రలేఖనంలో ఓనమాలు నేర్పించారు. కొవిడ్‌ సమయంలో వైద్యులు, పోలీసులు చేస్తున్న సేవలు ప్రతిబింబించేలా బొమ్మలు గీసేవాడు. ఇలా సరదాగా వేసిన చిత్రాలను తండ్రి పలు సంస్థలు నిర్వహించే పోటీలకు పంపడంతో బహుమతులు కూడా అందుకున్నాడు. అలా సాత్విక్‌ వేసిన కొన్ని చిత్రాలకు రాష్ట్రస్థాయిలో బహుమతులూ వచ్చాయి.

చకచకా చిత్రాన్ని గీసి..

ఒక చిత్రాన్ని గీయాలంటే ఎంతో సాధన కావాలి. ఒకటికి పదిసార్లు మనసులో అనుకున్న రూపాన్ని చిత్రంగా మలచాలి. వాటికి ఆకట్టుకునే రంగులు వేయాలి. అలాంటిది పోటీలకు అయిదు నిమిషాల ముందు మీరు ఫలానా అంశంపై చిత్రాన్ని గీయాలనగానే మన సాత్విక్‌ చకచకా ఒక కాగితంపె చిత్రాన్ని గీసి అక్కడున్న వారిని మెప్పించగలిగాడు. ఇదే చిన్నారిని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా చేసింది. ఇటీవల విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయస్థానం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. డిసెంబరు 12న దిల్లీ విజ్ఞాన భవన్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచాడు.

సింహం బొమ్మలో...

పర్యావరణ జీవనశైలి అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో సాత్విక్‌ ఒక సింహం బొమ్మలో మనిషి జీవన విధానం ఏ విధంగా ముడిపడి ఉంటుందో చక్కగా వివరించాడు. నీరు, వర్షపు నీరు, పాడిపశువులు, సౌరశక్తి, ప్లాస్టిక్‌ నిషేధం, పర్యావరణాన్ని కాపాడాలంటూ అంతర్లీనంగా సందేశమిచ్చాడు. ఈ ఆలోచనే సాత్విక్‌ను టాప్‌-5లో నిలిచేలా చేసింది. బహుమతి ప్రదానోత్సవ సమయంలో రూ.15 వేల నగదు, ఒక టాబ్లెయిడ్‌ అందుకున్నాడు. దేశవ్యాప్తంగా విజేతలుగా నిలిచిన మొదటి 13 మందితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విద్యుత్‌ శాఖామాత్యులు, ఇతర అధికారులతో ఫొటో షూట్‌లో పాల్గొనటం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతని సాత్విక్‌ చెబుతున్నాడు. భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఈ చిన్నారికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా! 

చొల్లంగి వెంకట సుబ్రహ్మణ్యం, రాజమహేంద్రవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని