వయసు పన్నెండు.. ఇంటర్‌ చదివేశాడు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం మన సబ్జెక్టులు చదివి, అర్థం చేసుకునేందుకే తెగ కష్టపడిపోతుంటాం కదా!

Published : 29 Apr 2023 00:07 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం మన సబ్జెక్టులు చదివి, అర్థం చేసుకునేందుకే తెగ కష్టపడిపోతుంటాం కదా! అదే.. పెద్ద తరగతి పుస్తకాల్లోని అంశాలైతే, వాటిల్లో ఒక్క ముక్కా బుర్రకెక్కదు. అయితే, ఓ నేస్తం మాత్రం పన్నెండేళ్లకే ఇంటర్‌ పాసయ్యాడు. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరి ఆ నేస్తం ఎవరో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆదిత్య శ్రీకృష్ణకు ప్రస్తుతం 12 సంవత్సరాలు. సాధారణంగా అయితే ఈ వయసు వారు ఏడో, ఎనిమిదో తరగతి చదువుతుంటారు. కానీ, ఆదిత్య మాత్రం ఏకంగా ఇంటర్‌ పూర్తి చేసేశాడు. రెండ్రోజుల క్రితం విడుదలైన ఫలితాల్లో ఆ రాష్ట్ర చరిత్రలో అతి పిన్న వయసులో ఇంటర్‌ పూర్తి చేసిన బాలుడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ ఘనత 13 ఏళ్లకే పూర్తి చేసిన సుష్మా వర్మ పేరిట ఉండేది. ఇప్పుడు మన ఆదిత్య ఆ రికార్డును అధిగమించాడన్నమాట.

జ్ఞాపకశక్తి అపారం

ఆదిత్యకు చిన్నతనం నుంచే మంచి జ్ఞాపకశక్తి ఉండేదట. మూడేళ్ల వయసులోనే రూబిక్స్‌ క్యూబ్‌ వంటి పజిల్స్‌ను అలవోకగా సాధించేవాడు. అప్పుడే కుమారుడిలోని ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించారు. అలా ఏడేళ్లు వచ్చేసరికి మిగతా పిల్లల్లా కాకుండా జనరల్‌ నాలెడ్జ్‌, సైన్స్‌, టెక్నాలజీ పైన పట్టు సంపాదించాడు. మేధస్సుకు తగినట్లుగా, ఆదిత్యను పైతరగతికి మార్చాలని వాళ్ల నాన్న ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌ను కోరారట. అందుకు యాజమాన్యం అంగీకరించకపోవడంతో ఏకంగా సీబీఎస్‌ఈ బోర్డుకే లేఖ రాశారాయన. అక్కడా నిరాశే ఎదురుకావడంతో.. ఈసారి ఐసీఎస్‌ఈ ప్రతినిధులను సంప్రదించినా, వారూ వయసు తక్కువగా ఉందని ఒప్పుకోలేదు. ఇంక ఏం చేయాలో తెలియక.. చివరి ప్రయత్నంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రికి లేఖ రాశారాయన. అనంతరం ఆయనను కలిసి విషయం మొత్తాన్ని వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన పలు నిబంధనలను సవరించి పైతరగతిలో చేరేందుకు అవకాశం కల్పించారు. అలా అందివచ్చిన అవకాశాన్ని ఆదిత్య సద్వినియోగం చేసుకుంటూ.. పిన్న వయసులోనే 12వ తరగతిని పూర్తి చేశాడన్నమాట.

తల్లి, యూట్యూబ్‌ సాయం

ఇంటర్‌ చదివేందుకు ఓ ప్రైవేటు కళాశాలలో చేరాడు ఆదిత్య. తరగతులు ముగిసిన తర్వాత.. ఇంటికొచ్చి యూట్యూబ్‌ సహాయంతో తన సందేహాలను నివృత్తి చేసుకునేవాడు. మరిన్ని కొత్త అంశాలు తెలుసుకుంటూ.. ఓ స్కూల్‌లో గణితం టీచర్‌గా పనిచేస్తున్న వాళ్ల అమ్మతో చర్చించేవాడు. ఆమె కూడా కుమారుడి కోసం ఇంటర్‌ పాఠ్యాంశాలను తిరగేసేవారట. వాటన్నింటినీ కుమారుడికి మరోసారి బోధించేదామె. సీఏ కావడమే తన లక్ష్యమట. నేస్తాలూ.. పట్టుదలతో కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమే అనేందుకు మన ఆదిత్యనే మంచి ఉదాహరణ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని