స్నేహబంధం ఎంత మధురం!

ఒక దట్టమైన అడవిలో పెద్ద మర్రిచెట్టు ఉంది. దాన్ని ఆనుకొని ఒక నీటి మడుగు ఉండేది. ఆ అడవిలో నివసించే జీవులన్నీ అందులోనే దాహం తీర్చుకునేవి. ఆ నీటి మడుగులో ఒక తాబేలు నివసించేది. అది మర్రిచెట్టు మీద జీవించే ఒక వడ్రంగి పిట్ట, ఒక కాకి, ఆ పక్కన ఉండే పచ్చటి పొదల్లో బతికే ఒక కుందేలుతో చాలా స్నేహంగా ఉండేది.

Published : 06 Mar 2023 00:29 IST

క దట్టమైన అడవిలో పెద్ద మర్రిచెట్టు ఉంది. దాన్ని ఆనుకొని ఒక నీటి మడుగు ఉండేది. ఆ అడవిలో నివసించే జీవులన్నీ అందులోనే దాహం తీర్చుకునేవి. ఆ నీటి మడుగులో ఒక తాబేలు నివసించేది. అది మర్రిచెట్టు మీద జీవించే ఒక వడ్రంగి పిట్ట, ఒక కాకి, ఆ పక్కన ఉండే పచ్చటి పొదల్లో బతికే ఒక కుందేలుతో చాలా స్నేహంగా ఉండేది.

ఈ నాలుగు జీవులూ ఒకదానికి మరోటి చేదోడువాదోడుగా ఉండేవి. మిగిలిన జీవులకు కూడా చేతనైన సహాయం చేస్తూ జీవించేవి.

ఇలా కాలం గడుస్తుండగా.. ఎండాకాలం రానే వచ్చింది. మడుగులో నీరు అడుగంటిపోతోంది. జంతువులు, పక్షులు కూడా నీటి ఎద్దడి వస్తుందేమో అని తీవ్ర ఆలోచనలో పడ్డాయి. ‘స్నేహితులారా! నీరు లేకపోతే ఈ మడుగులో నేను బతకడం కష్టమవుతుంది. నన్ను ఎవరైనా తేలిగ్గా పట్టుకుంటారు. అందుకే నేను మరో ప్రదేశానికి వెళ్లిపోతాను’ అని తన మిత్రులతో అంది తాబేలు.

‘అయ్యో! అలా నువ్వు వెళ్లిపోతే మాకు బాధగా ఉంటుంది. ఏదైనా మార్గం వెతుకుతుదాం.. తొందరపడొద్దు నేస్తమా!’ అంది కాకి.

‘అవును... మనసుంటే మార్గం అదే దొరుకుతుంది’ అంటూ వడ్రంగి పిట్ట చెట్టును తొలవసాగింది. చెట్టుకు ఉన్న తొర్రలో నుంచి రెండు బంగారు నాణేలు కింద పడ్డాయి. అది చూసి కుందేలు ఆశ్చర్యపోయింది.

‘ఇవేమిటి? వింతగా మెరుస్తున్నాయి... తినే పదార్థాలు కాదనిపిస్తోంది’ అని వాటి వాసన చూసింది కుందేలు. వడ్రంగి పిట్ట తొర్రలోకి తొంగి చూస్తే ఇంకా చాలా నాణేలు ఉన్నట్లు కనిపించాయి.

‘ఇందులో ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటితో మనమేం చేయగలం’ అంది వడ్రంగిపిట్ట. ‘అవును అలాగే అనిపిస్తోంది. వీటి గురించి మనకు తెలిసేది ఎలా?’ అని అంది తాబేలు. ‘మనకన్నా మనిషి తెలివైన వాడు అంటారు కదా! ఆ మనిషి వీటిని చూసి ఎలా ప్రవర్తిస్తాడో చూసి తెలుసుకుందాం’ అని కాకి ఒక నాణెం ముక్కున కరచుకొని రివ్వున ఎగురుకుంటూ వెళ్లి జనాలు నడిచే దారిలో పడేసింది.

కాసేపటికి అటుగా వచ్చిన బాటసారి దృష్టి మిలమిల మెరిసే బంగారు నాణెం మీద పడింది. అటూఇటూ చూసి గబుక్కున దాన్ని జేబులో దాచుకొని, వడివడిగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. చెట్టు మీద నుంచి అంతా చూసిన కాకి, మిత్రుల దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పింది.  

‘ఓహో! ఇవి మనుషులకు విలువైనవి... మనకు పనికిరానివని దీన్ని బట్టి అర్థమవుతోంది. మనం వీటిని ఉపయోగించి మనుషులతో పని చేయించుకోవాలి. అందుకు ఏం చేయాలో ఆలోచిద్దాం’ అంది తాబేలు. అన్నీ కలిసి బాగా ఆలోచిస్తే.. కుందేలుకు ఒక ఉపాయం తట్టింది. ఆ ఆలోచనను మిత్రులతో చర్చించింది. వెంటనే అమలులో పెట్టాలని ఆ నాలుగూ నిర్ణయించుకున్నాయి. వడ్రంగి పిట్ట ఒక్కో నాణెం తొర్రలో నుంచి కింద పడేసింది. కాకి వాటిని ముక్కున కరచుకొని మడుగు దగ్గర నుంచి మనుషులు నడిచే దారి వరకు ఒక్కోటి వేసుకుంటూ వెళ్లింది. మిగిలినవి మడుగులో వేసేసింది. తాబేలు మడుగు నుంచి బయటకు వచ్చి కుందేలుతో కలిసి పొదల మాటున దాక్కుంది.

కాకి, వడ్రంగి పిట్ట మొత్తం నాణేలు పరచటం అయ్యాక చెట్టు మీద కూర్చుని జరిగేది చూడటం కోసం ఎదురు చూస్తున్నాయి. కాసేపటి తరువాత ఆ దారిన వెళ్లే బాటసారులకు నాణేలు కనిపించాయి. ఈ విషయం ఆ నోటా...ఈ నోటా...అటుగా వెళ్తున్న అందరికీ తెలిసిపోయింది. ఆ నాణేలు ఎక్కడ వరకు ఉన్నాయో వెతుక్కుంటూ చాలా మంది జనం వెళ్లారు. మడుగు వరకు ఉండటం చూశారు. అంటే... ఈ మడుగులో ఇంకా ఎన్ని నాణేలు ఉండి ఉంటాయో అని అందరూ మాట్లాడుకున్నారు. తర్వాత సమయం వృథా చేయకుండా గునపం, పార పట్టుకొచ్చి తవ్వడం ప్రారంభించారు.

ఎవరికి వారు తమకే నాణేలు దొరకాలని మడుగు లోతుగా తవ్వి పూడిక తీసి బయటకు వేశారు. అందులో కొన్ని నాణేలు దొరికాయి. ఇంకేముంది!... ఇంకా లోతుగా తవ్వేసరికి నీటి ఊట భూమి నుంచి తేటగా బయటకు వచ్చింది. ఇక నాణేలు లేవు... దొరకడం అసాధ్యం అనుకుని అక్కడ నుంచి జనం వెళ్లిపోయారు.  

‘హమ్మయ్యా! ఈ ఎండాకాలం ఈ అడవిలోని పక్షులు, జంతువులకు నీటి కరవు తొలగిపోయింది. తాబేలు కూడా మనల్ని విడిచి ఎక్కడకూ వెళ్లక్కర్లేదు’ అంది కాకి సంతోషంగా. తాబేలు స్నేహితులకు తన మీద ఉన్న ప్రేమను చూసి మురిసిపోయింది. ‘ఇదంతా మన చలాకీ వడ్రంగి పిట్ట నేస్తం బంగారు నాణేలు వెలికితీయడం వల్లనే సాధ్యమైంది’ అని కుందేలు అంది. ‘కాదు... కాదు... మీరు నలుగురు మిత్రులు స్నేహంగా ఉండడమే కాకుండా అందరికీ నీటి ఎద్దడి లేకుండా చేయాలనుకున్న సంకల్పానికి దైవం కూడా సహాయం చేశాడు. మిమ్మల్ని చూసి మేం కూడా నేర్చుకుంటాం’ అని అడవిలోని మిగిలిన జీవులు ఆనందంగా అన్నాయి.

కేవీ సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని