ఇదో రఘుచిత్రం!

అనగనగా ఓ అడవి. అందులో ఓ గున్న ఏనుగు. దానికి పే...ద్ద కష్టమొచ్చింది. దాన్ని ఓ తాత, ఓ అవ్వ తీర్చారు. ‘ఇంతకీ ఆ ఏనుగుకు ఏం కష్టమొచ్చింది.

Published : 06 Mar 2023 00:30 IST

అనగనగా ఓ అడవి. అందులో ఓ గున్న ఏనుగు. దానికి పే...ద్ద కష్టమొచ్చింది. దాన్ని ఓ తాత, ఓ అవ్వ తీర్చారు. ‘ఇంతకీ ఆ ఏనుగుకు ఏం కష్టమొచ్చింది. దాన్ని తీర్చిన ఆ తాత, అవ్వ ఎవరు?’ నేస్తాలూ... ఇదేగా మీ అనుమానం. దానికి సమాధానమే ఈ కథనం. చదివేయండి మరి.

వి తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి అడవులు. 2017లో పాపం ఓ గున్న ఏనుగు తన తల్లి నుంచి విడిపోయింది. దానికి శరీరమంతా గాయాలు. దాదాపు ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉంది. దాన్ని కాపాడటం అసాధ్యమని మధుమలై టైగర్‌ రిజర్వ్‌లో ఉన్న తెప్పకడు ఎలిఫెంట్‌ క్యాంప్‌నకు చెందిన వాళ్లు అభిప్రాయపడ్డారు. కానీ తాను ఆ ఏనుగును కాపాడుతానంటూ బొమన్‌ అనే తాత ముందుకొచ్చారు. ఈయన ఆ క్యాంప్‌లోని ఏనుగుల బాగోగులను చూసుకుంటూ ఉంటారు. బెల్లి అనే ఓ అవ్వ ఆయనకు ఈ పనిలో సాయం చేసేది.

పేరు పెట్టి... ప్రాణం పోసి...

ఆ బుజ్జి ఏనుగుకు రఘు అని పేరు పెట్టారు. దాన్ని కంటికి రెప్పలా కాపాడారు. కన్నబిడ్డలా చూసుకున్నారు. అది గాయాల నుంచి కోలుకుంది. ప్రాణాపాయస్థితి నుంచి బయట పడింది. తర్వాత 2019లో బొమ్మి అనే మరో గున్న ఏనుగు బాధ్యతలు కూడా వీరికి అప్పగించారు. ఇలా ఆ అవ్వ, తాత ఏనుగుల బాగోగులు చూసుకున్నారు. కొన్ని రోజులకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.  

అనుబంధానికి ప్రతిబింబం

బొమన్‌, బెల్లి దంపతులకు, ఏనుగులతో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ పేరుతో ముంబయికి చెందిన ఫొటోగ్రాఫర్‌ 2022లో ఒక షార్ట్‌ఫిల్మ్‌ తీశారు. ఈ లఘు చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. ఇది డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్‌ విభాగంలో ఈ ఏడాది అకాడమీ అవార్డుకు నామినేట్‌ అయింది.

వీడలేక.. వీడిపోయి!

ప్రస్తుతం రఘు, బొమ్మి ఏనుగుల బాగోగులు బొమన్‌ బదులు వేరేవాళ్లు చూసుకుంటున్నారు. కృష్ణ అనే మరో ఏనుగు ఆలనాపాలనా చూసుకుంటున్నారు. అవ్వ ఇంటిపట్టునే ఉంటోంది. రఘు, బొమ్మి దూరమయ్యాక అవ్వ, తాత చాలా బాధపడ్డారు. తమ కుటుంబం ముక్కలైన భావనకు లోనయ్యారు. అయినా అప్పుడప్పుడు వాటిని చూడ్డానికి వెళ్తున్నారు. వీళ్లను అవి గుర్తుపడుతున్నాయి కూడా! ఈ షార్ట్‌ఫిల్మ్‌ అకాడమీ అవార్డుకు ఎంపికవడం చాలా ఆనందంగా ఉందని ఈ తాత, అవ్వ చెబుతున్నారు. మొత్తానికి ఈ ‘రఘు’చిత్రం విశేషాలు భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని