భళా.. సాహస బాల!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నిప్పును చూడగానే భయపడి పారిపోతాం.. అగ్నిప్రమాద దృశ్యాలను చూడాలంటేనే జంకుతాం.

Published : 14 Jan 2023 00:31 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నిప్పును చూడగానే భయపడి పారిపోతాం.. అగ్నిప్రమాద దృశ్యాలను చూడాలంటేనే జంకుతాం. అలాంటిది.. ఓ నేస్తం మాత్రం అగ్ని ప్రమాద సంఘటనను గమనించి, తల్లిదండ్రులకు చెప్పడంతోపాటు అపార్ట్‌మెంట్‌లో ఉండేవారినీ అప్రమత్తం చేసింది. త్వరలోనే జాతీయ పురస్కారం కూడా అందుకోనుంది. ఇంతకీ ఆ నేస్తం ఎవరో, ఆ విశేషాలేంటో చదివేయండి మరి..

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన వీరాంగన అనే చిన్నారికి ప్రస్తుతం ఏడు సంవత్సరాలు. గత ఆగస్టులో తమ ఇంట్లో అగ్ని ప్రమాద విషయాన్ని అపార్ట్‌మెంట్‌లో ఉండే ఇతరులకు తెలిపి, వారి ప్రాణాలను రక్షించింది. ఈ క్రమంలో బాలిక చూపిన తెగువకు జాతీయ సాహస పురస్కారం దక్కింది. ఈ నెల 26న దిల్లీలో జరగనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనుంది.


ఏసీ నుంచి మంటలు..

గత ఆగస్టు ఏడో తేదీన వీరాంగన తన హోంవర్క్‌ పూర్తి చేసుకుంది. ఇక నిద్రపోదామని గదిలోకి వెళ్లి రిమోట్‌తో ఏసీని ఆన్‌ చేసింది. అంతే.. ఒక్కసారిగా అందులోంచి మంటలు ఎగసిపడ్డాయి. మామూలుగా అటువంటి అనుకోని సంఘటనతో చిన్నవాళ్లైనా, పెద్దవారైనా షాక్‌కు గురవుతారు. కానీ, వీరాంగన మాత్రం చాలా ధైర్యంగా పరుగెత్తుకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. అంతేకాదు.. ఆ మంటలు అపార్ట్‌మెంట్‌ మొత్తం వ్యాపించకముందే.. చుట్టుపక్కలున్న ఫ్లాట్లకు వెళ్లి అందులోని వారిని అప్రమత్తం చేసింది. వెంటనే, అందులో నివసించే మొత్తం 60 మంది బయటకు పరుగుతీశారు. బిందెలు, బకెట్లతో నీళ్లు తీసుకొచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈలోగా ఫైరింజన్‌ రావడంతో.. సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి, ఆ మంటలను అదుపు చేశారు.  


పేరుకు అర్థం అదేనట..

వీరాంగన చూపిన ధైర్యానికి, సమయస్ఫూర్తికి అందరూ అభినందనలు తెలిపారు. ఇంకో విషయం ఏంటంటే.. వీరాంగన అంటే సాహస మహిళ అని అర్థమట. అంటే.. పేరుకు తగినట్టే ఈ చిన్నారి ఎంతో ధైర్యవంతురాలన్నమాట. ఈ నేస్తం తెగువను గుర్తించిన ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌’ ప్రతినిధులు సాహస పురస్కారానికి నామినేట్‌ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పంపారు. వారూ సరేననడంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డును అందుకోనుంది. ధైర్య, సాహసాలను ప్రదర్శించిన చిన్నారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా రిపబ్లిక్‌ డే సందర్భంగా 25 మందికి పురస్కారాలను అందిస్తుంటుంది. గతంలో వీళ్ల తాతయ్య కూడా ఎన్‌సీసీ విద్యార్థిగా ఉన్నప్పుడు జాతీయ అవార్డును పొందారట.


వారం రోజుల ముందే..

వీరాంగన సాహస పురస్కారానికి ఎంపికైనట్లు గత వారమే దిల్లీ నుంచి కబురొచ్చింది. స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే అమ్మానాన్నలు ఈ విషయాన్ని పాపకు చెప్పడంతో.. తన ముఖం ఆనందంతో వెలిగిపోయిందట. అంతేకాదు.. కుటుంబ సభ్యులందరూ వారం రోజుల ముందే దిల్లీకి వెళ్లనున్నారట. అవార్డు తీసుకునే సమయంలో పాటించాల్సిన నిబంధనలు, మరికొన్ని సూచనలను వివరించనున్నారు. జాతీయ స్థాయి ఘనత అంటే మామూలు విషయం కాదు కదా.. అందుకే, మనమూ ఈ నేస్తాన్ని అభినందిద్దాం.!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని