ఆట ఘనం.. పొగడాల్సిందే మనం.!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. సోషల్‌ మీడియా అంటే మనలాంటి చాలామందికి కేవలం కాలక్షేపం మాత్రమే కదా! దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని కూడా చెబుతుంటారు.

Published : 18 Feb 2023 00:05 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. సోషల్‌ మీడియా అంటే మనలాంటి చాలామందికి కేవలం కాలక్షేపం మాత్రమే కదా! దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని కూడా చెబుతుంటారు. కానీ, సోషల్‌ మీడియాను మంచి పద్ధతిలో వినియోగించుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని నిరూపించిందో నేస్తం. తన ప్రతిభను ప్రపంచానికి చూపడంతోపాటు ప్రముఖుల ప్రశంసలూ అందుకుంటోంది. ఆ వివరాలే ఇవీ..

రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపుర్‌కు చెందిన ముమల్‌ మెహర్‌ అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇటీవల తాను క్రికెట్‌ ఆడుతూ.. అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసింది. అది చూసిన వారంతా తన ప్రతిభకు ఫిదా అవుతున్నారు. అంతేకాదు.. ఏ సాయం కావాలన్నా, అండగా నిలుస్తామని హామీలూ ఇస్తున్నారు.

చిన్నతనం నుంచే..

ముమల్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌ అంటే ఇష్టం ఉండేది. తనలోని ఆసక్తిని, ప్రతిభను గమనించిన స్కూల్‌ టీచర్‌ రోషన్‌ ఖాన్‌ ప్రత్యేకంగా క్రికెట్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇటీవల తాను ఓ ఇసుక ప్రాంతంలో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసిందీ బాలిక. అది కాస్త.. వైరల్‌గా మారి సచిన్‌ వరకూ చేరింది. ఆయన కూడా ఆ వీడియోను చూసి అభినందిస్తూ షేర్‌ చేశారు. ఎక్కడో జైపుర్‌లో ఉన్న ముమల్‌ బ్యాటింగ్‌ స్కిల్స్‌పైన ముంబయిలో ఉండే సచిన్‌ పొగడ్తలు కురిపించడంతో తన ఆనంధానికి అవధుల్లేవు. అంతేకాదు.. ఆ రాష్ట్ర రాజకీయ నేత ఒకరు ప్రశంసిస్తూ, ఆమెకో క్రికెట్‌ కిట్‌ కూడా పంపించారు.

రాష్ట్రస్థాయిలో ప్రతిభ

కొన్ని నెలల క్రితం రాజస్థాన్‌ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లోనూ ముమల్‌ సత్తా చాటింది. ఇటీవల ‘ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌’ వేలం జరిగిన రోజే తన వీడియో వైరల్‌గా మారడం విశేషం. భారత క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తనకు రోల్‌ మోడల్‌ అనీ, పెద్దయ్యాక భారత జట్టు తరఫున ఆడాలనేదే తన లక్ష్యమని చెబుతోందీ నేస్తం. నెటిజన్లు కూడా ఆమె ప్రతిభ అసాధారణమనీ, దేశానికి మరో ఆణిముత్యం దొరికిందనీ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మరి, ముమల్‌కు మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని