పరమ పవిత్రం.. శ్రీవారి ప్రసాదం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి విశ్వవ్యాప్తంగా పేరుంది. తిరుమలేశునికి నివేదనల కోసం ఎన్నో రకాల ప్రసాదాలు తితిదే తయారు చేయిస్తోంది. వీటిలో లడ్డూలకు భక్తకోటి నుంచి విశేష ఆదరణ ఉంది.

Published : 07 Oct 2021 09:53 IST

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి విశ్వవ్యాప్తంగా పేరుంది. తిరుమలేశునికి నివేదనల కోసం ఎన్నో రకాల ప్రసాదాలు తితిదే తయారు చేయిస్తోంది. వీటిలో లడ్డూలకు భక్తకోటి నుంచి విశేష ఆదరణ ఉంది. స్వామివారి ప్రసాదం కోసం రాజులు,  రాణులు ఎన్నో దానాలు చేశారు. 1803లో  ఆలయంలో ప్రసాదాల విక్రయాన్ని అప్పటి మద్రాసు ప్రభుత్వం ప్రారంభించింది. లడ్డూ తయారీకి రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించారు. అది కాస్తా 1940లో లడ్డూగా రూపొందింది. నామమాత్రంగా ప్రసాదాలు తయారు చేస్తుండగా తితిదే పాలకమండలి 1950లో లడ్డూల తయారీని పెంచింది. వీటి తయారీకి వాడాల్సిన ముడిసరకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. ఈ దిట్టాన్ని భక్తుల సంఖ్యను బట్టి పెంచుకొస్తున్నారు. తితిదే కొలమానాల ప్రకారం 5,100 లడ్డూల తయారీకి 185 కిలోల ఆవు నెయ్యి, 200కిలోల శెనగపిండి, 400కిలోల చక్కెర, 35కిలోల జీడిపప్పు, 17.5 కిలోల ఎండుద్రాక్ష, 10 కిలోల కలకండ, 5కిలోల యాలకులు అవసరం. నిత్యం లక్ష లడ్డూల తయారీ వరకు పోటులో సామర్థ్యం ఉంది. కొన్నేళ్ల కింద బూందీ పోటును వెలుపలికి తీసుకొచ్చిన అనంతరం నిత్యం మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు లడ్డూల తయారీ పెరిగింది. లడ్డూలను రెండు రకాల పరిమాణంతో తయారు చేస్తున్నారు. కల్యాణం లడ్డూ పేరుతో పిలిచే ప్రసాదం బరువు 750 గ్రాములు, సాధారణ లడ్డూ బరువు 140 నుంచి 170 గ్రాములు ఉంటుంది. కల్యాణ లడ్డూను రూ.200, సాధారణ లడ్డూను రూ.50 వంతున  తితిదే విక్రయిస్తోంది. శ్రీనివాసుని లడ్డూకి తితిదే పేటెంట్‌ హక్కులను సాధించుకుంది.

శ్రీనివాసునికి 50 రకాల ప్రసాదాలు
శ్రీవారి మూలమూర్తికి ప్రతిరోజూ నివేదించే ప్రసాదాలు ఆగమశాస్త్రం మేరకు సమర్పిస్తారు. శ్రీనివాసుడికి నిత్యం ఎన్నిసార్లు నైవేద]్యం పెట్టాలి, ఎన్నిరకాల ప్రసాదాలు ఉండాలనే దానిపై ఆగమశాస్త్రంలో నిర్దేశించిన విధంగానే అర్చకులు నివేదిస్తారు. ఆయా ప్రసాదాల్లోనూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. శ్రీనివాసునికి దాదాపు 50 రకాల ప్రసాదాలను వినియోగిస్తున్నారు. వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ రామానుజాచార్యులు నిర్దేశించిన నిబంధనల ప్రకారం శ్రీవారికి నైవేద్యం ఇప్పటికీ సమర్పిస్తున్నారు. సుప్రభాత సేవ సమయం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ప్రసాద నివేదనలు ఉంటాయి. రోజూ జరిగే నిత్యసేవల సమయంలో విరామ సమయంలో వివిధ రకాలైన నివేదనలు జరుగుతాయి. సుప్రభాత సమయంలో నవనీతం, గోక్షీరంతో తయారుచేసిన పదార్థాలను నివేదిస్తారు. తోమాల పూర్తి అయిన తరువాత కొలువు సమయంలో నల్లనువ్వులు, బెల్లం, శొంఠి పెడతారు.  సహస్రనామార్చన తరవాత జరిగే మొదటి గంటలో మీగడ, వెన్న, పెరుగుతో తయారుచేసిన అన్నాన్ని స్వామివారికి నివేదిస్తారు. రోజువారీ చిత్రాన్నం, దద్దోజనం, క్షీరాన్నం, కదంబం, పాయసాన్నం నివేదిస్తారు. మధ్యాహ్న ఆరాధనలో నాదుకం, లడ్డూ, దోసె, వడ, అప్పం నివేదిస్తారు. సాయంకాలం అష్టోత్తర శతనామార్చన తరువాత శుద్ధన్నం, సీరా నివేదనగా సమర్పిస్తారు. రాత్రి నైవేద్య సమయంలో తోమాల తరవాత మిరియాలతో తయారుచేసిన మరీచ్చాన్నం, ఉడాన్నం నివేదిస్తారు. రాత్రి ఆరాధన తరవాత విశ్రాంతి సమయంలో పాయసం నైవేద్యంగా పెడతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని