పండు కోస్తే అంత శిక్షా?

పూర్వం శంఖుమహర్షి, లిఖితమహర్షి అనే ఇద్దరు సోదరులుండేవారు. వీరు ధర్మ మార్గాన్ని వివరించే స్మృతిగ్రంథ కర్తలు. ఒకరోజు లిఖితుడు శంఖుని చూసేందుకు అతని ఆశ్రమానికి వెళ్లాడు. ఆ సమయంలో అన్న పనిమీద అరణ్యానికి వెళ్లాడని

Updated : 09 Aug 2022 14:00 IST

పూర్వం శంఖుమహర్షి, లిఖితమహర్షి అనే ఇద్దరు సోదరులుండేవారు. వీరు ధర్మ మార్గాన్ని వివరించే స్మృతిగ్రంథ కర్తలు. ఒకరోజు లిఖితుడు శంఖుని చూసేందుకు అతని ఆశ్రమానికి వెళ్లాడు. ఆ సమయంలో అన్న పనిమీద అరణ్యానికి వెళ్లాడని తెలిసి తమ్ముడు ఎదురుచూస్తున్నాడు. కొంతసేపటికి లిఖితుడికి ఆకలేయగా, ఆశ్రమంలో మామిడిచెట్టు నుంచి ఓ పండు కోసి తింటున్నాడు.

కొంతసేపటికి శంఖుడు అడవి నుంచి తిరిగొచ్చాడు. తమ్ముడి చేతిలో ఉన్న ఫలం ఎక్కడిదని అడిగితే ఈ చెట్టుదేనన్నాడు. చెట్టుకు యజమాని అయిన తన అనుమతి లేకుండా పండు కోయడం ధర్మవిరుద్ధం కనుక మహారాజును కలిసి, శిక్ష విధించమని కోరమన్నాడు. అదే ధర్మమని అలాగే చేశాడు లిఖితుడు.

‘తప్పు చేసినవారిని దండించడం, వదిలేయడం నా ఇష్టం కనుక నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను’ అన్నాడు మహారాజు. కానీ లిఖితుడు ‘ధర్మ గ్రంథాల్లో ఉన్నట్లుగా చెయ్యాలే గానీ పక్షపాత వైఖరి కూడదు. దయచేసి శిక్ష విధించండి రాజా’ అన్నాడు. ఇక తప్పదనుకున్న మహారాజు పండు కోసింది చెయ్యి కనుక ఆ చేతిని నరకమని ఆజ్ఞాపించాడు. అలా శిక్ష అనుభవించిన లిఖితుడు రక్తం కారుతున్న భుజంతో అన్న దగ్గరికెళ్లాడు. తమ్ముడి ధర్మనిష్ఠకు సంతోషించిన అన్న సంధ్యావందనం చేద్దామంటూ నది వద్దకు తీసుకెళ్లాడు.

నదిలో మునకెయ్యగానే లిఖితుడి చెయ్యి యథావిధిగా వచ్చేసింది. ధర్మాన్ని ఆచరించేవారికి చెడు జరగదనేది ఈ కథ సారాంశం. తెగిపోయిన చెయ్యి తిరిగి ప్రసాదించిందని నాటి నుంచి చిత్తూరు జిల్లాలోని ఆ నదిని బాహుదా నది లేదా చెయ్యేరు అని పిలుస్తున్నారనేది స్థల పురాణం.

- జి.జానకి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని