కొత్త ఇళ్లతో బోలెడు లాభాలు!

స్థిరాస్తి మార్కెట్‌ ఆశాజనకంగా ఉండటంతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలు ఊపందుకున్నాయి. విక్రయాలు బాగుండటంతో మరిన్ని సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గత ఏడాది కొవిడ్‌ మహమ్మారితో వాయిదా పడిన ప్రాజెక్ట్‌లు సైతం ప్రస్తుతం పట్టాలెక్కుతున్నాయి. స్థలాల వెంచర్లు, విల్లా ప్రాజెక్ట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల వరకు వీటిలో ఉన్నాయి. ...

Updated : 06 Mar 2021 02:35 IST

ఈనాడు, హైదరాబాద్‌  

స్థిరాస్తి మార్కెట్‌ ఆశాజనకంగా ఉండటంతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలు ఊపందుకున్నాయి. విక్రయాలు బాగుండటంతో మరిన్ని సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గత ఏడాది కొవిడ్‌ మహమ్మారితో వాయిదా పడిన ప్రాజెక్ట్‌లు సైతం ప్రస్తుతం పట్టాలెక్కుతున్నాయి. స్థలాల వెంచర్లు, విల్లా ప్రాజెక్ట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల వరకు వీటిలో ఉన్నాయి. మార్కెట్‌లో పోటీ నెలకొనడంతో ఆయా సంస్థలు ప్రీలాంచ్‌, సాఫ్ట్‌లాంచ్‌, న్యూలాంచ్‌ పేరుతో కొనుగోలుదారులను ఆశ్రయిస్తున్నారు. రెరా వచ్చాక ప్రీలాంచ్‌ చట్ట విరుద్ధమైనా మార్కెట్లో వీటి పేరుతో పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో గత ఏడాదిలో ఎక్కువగా సిద్ధంగా ఉన్న ఇళ్లవైపు ఎక్కువ మంది కొనుగోలుదారులు మొగ్గు చూపారు. కొవిడ్‌ భయాలతో భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయోనని నిర్మాణం పూర్తైన వాటికే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో అప్పటివరకు విక్రయించకుండా మిగిలిన ఇళ్లన్నీ దాదాపుగా అమ్ముడయ్యాయి. కొవిడ్‌ నుంచి ఆర్థిక పరిస్థితులు క్రమంగా కుదుటపడంతో రియల్‌ ఎస్టేట్‌పై కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగింది. దీంతో గత ఏడాది ఆఖరి నుంచి కొనుగోళ్లు పెరిగాయి. పాత ప్రాజెక్టుల్లో విక్రయాలు పూర్తవడంతో ప్రస్తుతం అందరూ కొత్త ప్రాజెక్ట్‌ల వైపు చూస్తున్నారు.

ప్రారంభంలో తక్కువ ధర
కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టుల్లో ఆరంభంలో కొనేవారికి ధరపరంగా కొంత కలిసి వస్తుంది. కోరుకునే దిక్కుల్లో, నచ్చిన అంతస్తులో, కావాల్సిన విస్తీర్ణంలో స్థలం, విల్లా, ఫ్లాట్‌ అందుబాటులో ఉంటాయి. ఇల్లు కొనేవారు కాదు పెట్టుబడిదారుల సైతం ఆరంభంలో బుక్‌ చేసేందుకు మొగ్గుచూపుతుంటారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చూస్తే ఒక ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు రెండు మూడేళ్లు పడుతుంది. అప్పటికే ధరల్లో కొన్నిసార్లు 35 శాతం తేడా ఉంటోంది. 50 శాతం పెరిగిన సందర్భాలు ఉన్నాయని బిల్డర్లు అంటున్నారు. సాధారణంగా బిల్డర్‌ అమ్మకాల ఆధారంగా ధరలు పెంచుతూ వెళుతుంటారు. చుట్టుపక్కల పోటీ ప్రాజెక్ట్‌లను బట్టి కూడా ధరలు మారుతుంటాయి. డిమాండ్‌ను బట్టి పెంచుతుంటారు. ప్రారంభంలో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించడానికి, మార్కెట్లో నిలబడేందుకు, కొన్ని నిధులు సమకూర్చుకునేందుకు ప్రారంభ ధరతో 20 శాతం నుంచి 25 శాతం ఇళ్లను విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఎక్కువ సంస్థలు బ్లాక్‌ల వారీగా, టవర్ల వారీగా నిర్మిస్తున్నాయి. ప్రారంభంలో అమ్మకాల లక్ష్యానికి తగ్గట్టుగా రెండు టవర్లు, బ్లాక్‌లు మొదలెట్టి.. క్రమంగా ధరలు పెంచుకుంటూ మిగతా వాటిలో బుకింగ్స్‌ను ప్రారంభిస్తుంటాయి.

భవిష్యత్తులో మరింత పెరగొచ్చు

కొవిడ్‌తో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో భూముల ధరలు తగ్గే అవకాశం ఉందని స్థిరాస్తి సంఘాలు అంచనా వేశారు. ఇళ్ల ధరలు తగ్గవు కానీ స్థలాలు, భూముల ధరలు తగ్గుతాయని కొందరు బిల్డర్లు అన్నారు. కానీ ఊహించిన దానికి భిన్నంగా ధరలు తగ్గకపోగా ఏడాది కాలంలో ధరలు చాలా పెరిగాయి. అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్‌లో నివాసం ఉండేందుకు, పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతుండటంతో భూముల ధరల్లో ఏటా వృద్ధి ఉంటోంది. ఇది మున్ముందు మరికొన్ని సంవత్సరాలు కొనసాగుతుందని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. కొండాపూర్‌, మియాపూర్‌ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం చదరపు అడుగు రూ.5,500 నుంచి రూ.6 వేల మధ్య పూర్తైన ప్రాజెక్టుల్లో విక్రయిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల్లో అటుఇటుగా ప్రారంభ ధర ఇదే ఉంది. భారీ ప్రాజెక్ట్‌లైతే పూర్తి కావడానికి మూడేళ్లు పడుతుంది. అప్పటికి చదరపు అడుగు రూ.8వేల వరకు పెరిగే అవకాశం ఉందని ఓ బిల్డర్‌ అన్నారు.

శివార్ల వైపు..

ప్రధాన నగరంతో పోలిస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న శివార్లలో వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుంది. కొత్త కంపెనీలు సైతం ఇక్కడే వస్తున్నాయి. రద్దీగా ఉండే సిటీలో కంటే సిటీ బయట ఉండేందుకు కొత్తతరం మొగ్గుచూపుతోంది. ఇంటి నుంచి పని మున్ముందు కూడా కొనసాగుతుందని ఐటీ కంపెనీలు ఇస్తున్న సంకేతాలతో శివార్లలో సొంత ఇంటికి నవతరం ఏర్పాట్లు చేసుకుంటోంది. భూముల లభ్యత ఉండటంతో బిల్డర్లు సైతం ఇక్కడ గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వస్తున్నారు.  ఇక్కడైతే తక్కువ ధరకు రావడమే కాదు.. నిర్మాణం పూర్తయ్యే నాటికి ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది ఆస్తి విలువ కూడా పెరుగుతోంది.

సానుకూలతలు

కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి నిర్మాణ ప్రారంభంలో ఉన్న వాటిని కొనుగోలు చేయడం ఆర్థికంగా మేలు.
ప్రాజెక్ట్‌ ప్రారంభంలో కాబట్టి నచ్చిన ఫ్లోర్‌, దిక్కుతో పాటూ ధర కూడా తక్కువకే వస్తుంది.
ఇల్లును తమకు కావాల్సిన రీతిలో కట్టించుకోవచ్చు. నిర్మాణ సమయంలోనే ఇటువంటి వెసులుబాటు ఉంటుంది.
ప్రతికూలతలు
గడువులోపు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోవడం సమస్యగా ఉంది.
గృహ రుణం ద్వారా కొనుగోలు చేస్తే నిర్మాణం నుంచే ఈఎంఐ చెల్లించాల్సి రావడం చాలామందికి భారం. ప్రాజెక్ట్‌ ఆలస్యమయ్యేకొద్దీ ఒకవైపు ఈఎంఐ, మరోవైపు ఇంటి అద్దె చెల్లించాల్సి రావడం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు.

చూడాల్సినవి
నిర్మాణదారుడు ఎంతకాలంలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగలడనేది కొనేముందు చూడాలి.
చెప్పిన సమయానికి ఇచ్చే చరిత్ర ఉందా లేదా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని