కొంపల్లి వైపు చూస్తున్నారు

మేడ్చల్‌ మార్గంలో కండ్లకోయలో ఐటీ పార్కుకు భూమి పూజతో ఉత్తరం వైపు అందరి దృష్టి పడింది. స్థిరాస్తి సంస్థలు భారీ ఎత్తున ఈ ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టాయి. కొత్త ప్రాజెక్టులు మొదలెడుతున్నాయి. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఓపెన్‌ ప్లాట్లలో

Updated : 07 May 2022 05:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌ మార్గంలో కండ్లకోయలో ఐటీ పార్కుకు భూమి పూజతో ఉత్తరం వైపు అందరి దృష్టి పడింది. స్థిరాస్తి సంస్థలు భారీ ఎత్తున ఈ ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టాయి. కొత్త ప్రాజెక్టులు మొదలెడుతున్నాయి. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఓపెన్‌ ప్లాట్లలో తమ బడ్జెట్‌కు అనువైన వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. కొంపల్లి వాణిజ్య కేంద్రంగా మారడంతో ఈ ప్రాంతం చుట్టూ రియల్‌ లావాదేవీలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో ఉత్తరం వైపు ఇల్లు, స్థలం కొనుగోలు చేయాలంటే సికింద్రాబాద్‌ నుంచి ఎంత దూరం అని చూసేవారు. ఏ అవసరాలకైనా అక్కడిదాకా వెళ్లాల్సి వచ్చేది. శివార్లలో కొత్తగా ఎక్కడికక్కడ వాణిజ్య కేంద్రాలు అభివృద్ధి చెందడంతో వాటి చుట్టుపక్కల నివాసాలకు డిమాండ్‌ పెరిగింది. ఉత్తరం వైపు చూస్తే కొంపల్లి మైక్రో మార్కెట్‌గా అభివృద్ధి చెందింది. సుచిత్ర మొదలు కొంపల్లి, మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌ వరకు ఆవాసాలకు నిలయంగా మారింది. అవుటర్‌ లోపలే 15వేల వరకు బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. ఎక్కువగా గేటెడ్‌ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. ఒక్కోచోట 500 నుంచి వెయ్యి ఫ్లాట్లు కడుతున్న అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.  ఐటీ పార్క్‌ వస్తుండటంతో ఈ ప్రాంతంలో నివాసాలకు డిమాండ్‌ పెరుగుతుందనే అంచనాతో భారీగా కడుతున్నారు. అవుటర్‌ లోపలే అనుకున్న బడ్జెట్‌లో విల్లాలు వస్తుండటంతో వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు వీటికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. 1500 చదరపు అడుగుల ఇల్లు చాలనుకునేవారు అపార్ట్‌మెంట్‌లో కొంటుంటే..  మరింత విశాలంగా రెండు మూడువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల కోసం చూసేవారు విల్లాలు కొనుగోలు చేస్తున్నారని రియల్టర్లు అంటున్నారు. అవుటర్‌ చుట్టుపక్కల ఎక్కువగా ఇవి అందుబాటులో ఉన్నాయి.  మేడ్చల్‌ దాటిన తర్వాత ఓపెన్‌ ప్లాట్లవైపు చూస్తున్నారు. అవుటర్‌ రింగ్‌రోడ్డు, ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్యలో స్థలాలను భవిష్యత్తు దృష్ట్యా కొనుగోలు చేస్తున్నారు.  మున్ముందు మరింత వృద్ధి చెందుతుందని విశ్వాసం వెలిబుచ్చుతున్నారు.

మెరుగైన మౌలిక వసతులు
ఏ ప్రాంతమైనా నివాస యోగ్యంగా ఉండాలంటే మౌలిక వసతులు కీలకం. ఈ ప్రాంతంలో పేరున్న విద్యా సంస్థలు ఉన్నాయి. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి.  రహదారుల పరంగా పలు సానుకూలతలు ఉన్నాయి. నిజామాబాద్‌ హైవే కావడం, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా అభివృద్ధి చేస్తుండటం,  బోయిన్‌పల్లి నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు ఆరు లేన్లుగా విస్తరణతో రహదారులు మరింత మెరుగు కాబోతున్నాయి. ఓఆర్‌ఆర్‌ చేరువలో ఉండటంతో ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి సులువుగా చేరుకోవచ్చు. ఐటీ కారిడార్‌కు సైతం అరగంట ప్రయాణమే అని స్థిరాస్తి సంస్థలు చెబుతున్నాయి. ఈ ప్రాంతానికి చేరువలో బొల్లారం ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ అందుబాటులో ఉంది. మేడ్చల్‌లోనూ  రైల్వే స్టేషన్‌ ఉంది. వీటన్నింటితో రవాణా అనుసంధానత మెరుగ్గా ఉంది.  

పచ్చదనమే పచ్చదనం
సిటీలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే మేడ్చల్‌ మార్గంలో పచ్చదనం ఎక్కువగా కనిపిస్తుంది. ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇటువైపు మొగ్గు చూపేవారికి ఇది కూడా ఒక సానుకూలాంశం. కండ్లకోయలో ఆక్సిజన్‌ పార్క్‌ సైతం అందుబాటులోకి వచ్చింది. ప్రశాంత వాతావరణంలో ఆవాసం కోరుకునేవారికి మేలైన ఎంపిక అవుతుంది. ఈ తరహా పలు సానుకూలతలు ఉండటంతో ప్రవాసీ భారతీయులు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు.  

మరింత వేగంగా
అభివృద్ధిలో ఈ ప్రాంతం మరింతగా దూసుకుపోయేందుకు అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కొత్తగా ఐటీ పార్క్‌ వస్తుండటంతో ఈ ప్రాంతం రెండో హైటెక్‌ సిటీగా మారుతుందనే అంచనాలున్నాయి.   ఒకటి రెండేళ్లలో ఐటీ భవనాలు పూర్తై అందుబాటులోకి వస్తే ఇక్కడ వందల సంఖ్యలో చిన్న ఐటీ సంస్థలు కొలువుదీరే అవకాశం ఉంది. ప్రస్తుతం  ఇవన్నీ ఐటీ కారిడార్‌, ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. కొంపల్లి చుట్టుపక్కల ఉంటున్నవారు సైతం ప్రతిరోజూ అక్కడిదాకా వెళ్లాల్సి వస్తోంది. కార్యాలయాలు తరలివస్తే స్థానికంగా ఉపాధి లభించనుంది. అప్పటికి ఈ ప్రాంతానికి మరింత డిమాండ్‌ వస్తుందని.. ధరలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. మారిన జీవనశైలితో విశాలమైన ఇళ్ల కోసం చూస్తున్నారని.. ఈ ప్రాంతంలో విల్లాలకు మంచి డిమాండ్‌ ఉందని సాకేత్‌ జీఎం సాయికృష్ణ అన్నారు. జీవో 111 ఎత్తివేయడం వల్ల ఇక్కడి మార్కెట్‌పై పెద్దగా ప్రభావం ఉండదని చెప్పారు. గేట్‌ వే ఆఫ్‌ ఐటీ పార్క్‌, తూఫ్రాన్‌ మీదుగా ప్రాంతీయ వలయ రహదారి, ముప్పిరెడ్డిపల్లిలో ఆటోమొబైల్‌ సెజ్‌ వంటి అభివృద్ధి పనులతో ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ పుంజుకుందని, స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నారని అర్బన్‌ వింటేజ్‌ సీఈఓ శివశంకర్‌ తెలిపారు.

అన్ని వర్గాలకు తగ్గట్టుగా..
సిటీలో కొన్ని ప్రాంతాల్లో అధికాదాయ వర్గాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఉత్తర హైదరాబాద్‌ వైపు అన్ని వర్గాల బడ్జెట్‌లో ఆవాసాలు కడుతున్నారు. అత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, విల్లాలతో పాటూ  బడ్జెట్‌లో నిర్మించే గేటెడ్‌ కమ్యూనిటీలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లా వాసులు, సికింద్రాబాద్‌ చుట్టుపక్కల విధులు నిర్వహించేవారు, ఐటీ ఉద్యోగులు వారి బడ్జెట్‌కు తగ్గ ఆవాసాలను కొనుగోలు చేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు