త్వరపడండి!

ఇంటి కోసం తీసుకున్న గృహ రుణం అసలులో రూ.2.67 లక్షలు ప్రారంభంలో తీరితే? ప్రతినెలా ఈఎంఐ రెండున్నరవేల

Updated : 06 Feb 2021 02:28 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఇంటి కోసం తీసుకున్న గృహ రుణం అసలులో రూ.2.67 లక్షలు ప్రారంభంలో తీరితే? ప్రతినెలా ఈఎంఐ రెండున్నరవేల దాకా తగ్గితే? సామాన్య, మధ్యతరగతి వాసులకు ఆర్థికంగా ఎంతో ఊరట. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఈ రుణ ఆధారిత సబ్సిడీని అందిస్తోంది. ఈ పథకం గడువు మార్చి 31తో ముగుస్తుంది. గడువు పొడిగిస్తారనే అంచనాలు బడ్జెట్‌ ముందువరకు ఉండేవి. కానీ బడ్జెట్‌ కేంద్ర ఆర్థిక మంత్రి దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో వడ్డీ సబ్సిడీ పొందాలనుకునేవారు త్వరపడితే తప్ప ప్రయోజనం దక్కదు. గృహ రుణంతో ఇల్లు తీసుకోవాలనే ఆలోచన ఉన్నవారు ఈలోపే తీసుకుంటే మేలు. ఇప్పటికే తీసుకున్నవారు దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే గృహ రుణం తీసుకున్న బ్యాంకును సంప్రదించండి.
కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి అందరికి ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పేదలకు  ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుండగా.. సామాన్య, మధ్యతరగతి వాసులు మొదటిసారి ఇల్లు కొంటున్నట్లయితే వారు తీసుకునే గృహ రుణంలో కొంతభారం భరించేందుకు 2015లో పీఎంఏవై రుణ ఆధారిత సబ్సిడీని ప్రకటించింది. మార్గదర్శకాల రూపకల్పనలో జాప్యంతో రెండేళ్లు ఆలస్యంగా 2017 నుంచి అమల్లోకి వచ్చింది. మొదట 2019 మార్చి 31 వరకు కేంద్రం గడువు విధించింది. ఆ తర్వాత ఒక్కో సంవత్సరం పొడిగిస్తూ 2021 మార్చి 31 వరకు పెంచింది.

ఎవరు అర్హులు?

* మీ పేరున మొదటి ఇల్లు కొంటున్నట్లయితే గృహ రుణంలో వడ్డీ రాయితీకి మీరూ అర్హులే. ఇంటి రుణం తీసుకున్న బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల్లో దరఖాస్తు చేస్తే చాలు.
* కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వడ్డీ రాయితీని క్లెయిం చేసుకోవచ్చు. ఆదాయ వర్గాలను బట్టి పట్టికలో సూచించిన మేర వడ్డీ రాయితీ ఉంటుంది. ఆ మేరకు నెలనెలా కట్టే ఈఎంఐలో భారం తగ్గుతుంది.
* తీసుకున్న రుణం, కాలవ్యవధిని బట్టి రూ.1.90 లక్షల నుంచి రూ.2.67 లక్షల వరకు కేంద్రం మంజూరు చేస్తుంది. ఈ మొత్తం నేరుగా బ్యాంకుకు చెల్లిస్తే వారు ఆ మేరకు అసలు నుంచి మినహాయిస్తారు. ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో దశల వారీగా ఈ దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని